ముస్లిం ఓట్లు మాకొద్దు.. కర్నాటకలో బరితెగించిన బీజేపీ

కేవలం హిందువుల పండగలను దృష్టిలో ఉంచుకుని ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెబుతారా..? మిగతా వర్గాల పండగలకు మాత్రం వట్టిచేతులే చూపిస్తారా..? ఇదెక్కడి సౌభ్రాతృత్వం అని నిలదీస్తున్నారు నెటిజన్లు.

Advertisement
Update: 2023-05-02 06:00 GMT

కర్నాటకలో బీజేపీ మేనిఫెస్టో సంచలనంగా మారింది. ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచితంగా పాలు.. ఇలా ఉచితాల డోస్ పెంచారు. అయితే గ్యాస్ సిలిండర్ల విషయంలో బీజేపీ తన బుద్ధి చూపించుకుందనే విమర్శలు వినపడుతున్నాయి. బీపీఎల్ కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పింది బీజేపీ. అయితే ఆ మూడు సిలిండర్లు ఇచ్చేందుకు బీజేపీ ఎంచుకున్న పండగలే విమర్శలకు కారణం అవుతున్నాయి.

ఉగాది, వినాయక చవితి, దీపావళి.. ఈ మూడు పండగల సందర్భంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది బీజేపీ. అంటే బీజేపీ దృష్టిలో ఈ మూడే పండగలా. రంజాన్, క్రిస్మస్.. పండగలు కావా..? కేవలం హిందువుల పండగలను దృష్టిలో ఉంచుకుని ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెబుతారా..? మిగతా వర్గాల పండగలకు మాత్రం వట్టిచేతులే చూపిస్తారా..? ఇదెక్కడి సౌభ్రాతృత్వం అని నిలదీస్తున్నారు నెటిజన్లు.

ఉద్దేశపూర్వకంగానే బీజేపీ తన మేనిఫెస్టోలో హిందువుల పండగలను మాత్రమే గుర్తు చేసిందని, మిగతా వర్గాలను కించపరిచిందనే విమర్శలు వినపడుతున్నాయి. కుల, మత, లింగ భేదాలు లేకుండా ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి. కానీ, బీజేపీ మాత్రం హిందువుల పండగలకే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించింది. ఒకరకంగా తమకి హిందువుల ఓట్లే ముఖ్యమని బీజేపీ తేల్చి చెప్పింది. ముస్లింలు, ఇతర వర్గాల ఓట్లు అవసరం లేదంటోంది. మరీ ఇంత బరితెగింపా..? అని నిలదీస్తున్నారు నెటిజన్లు. కేవలం ముస్లింలే కాదు.. ఇతర వర్గాల వారు కూడా ఈ వివక్షని ప్రశ్నిస్తున్నారు. దీనిపై బీజేపీ అగ్రనాయకత్వం జవాబివ్వాలంటున్నారు. ఈ వివక్ష కేవలం కర్నాటక వరకేనా.. ఇతర అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకి హిందువుల ఓట్లు మాత్రమే సరిపోతాయా అని కౌంటర్లిస్తున్నారు నెటిజన్లు. మొత్తమ్మీద మేనిఫెస్టో హామీలతో మరోసారి బీజేపీ అడ్డంగా బుక్కయింది. 

Tags:    
Advertisement

Similar News