పారిస్‌లో 70 శాతం విమానాల రద్దు..

కొంతమంది స్థానిక ఏజెంట్ల మాటలు వినడం వల్లే ఉద్యోగులు సమ్మెకు దిగారని చెబుతోంది. ఉద్యోగులు సమ్మెకు దిగడం ద్వారా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమానయాన శాఖ డిప్యూటీ మంత్రి ప్యాట్రిస్‌ వెగ్రిట్‌ మీడియాకు తెలిపారు.

Advertisement
Update: 2024-05-26 03:45 GMT

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ఓర్లీ విమానాశ్రయంలో 70 శాతానికి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ పౌర విమాన యాన శాఖ శనివారం వెల్లడించింది. ఆదివారం రాత్రి వరకు విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయని, ప్రయాణికులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. విమానాశ్రయంలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ సామూహిక సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జూలై 26న పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవానికి నగరం సిద్ధమవుతున్న తరుణంలో ఈ సమ్మె జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఓర్లీ విమానాశ్రయ నిర్వాహకులు తక్కువ సిబ్బందితో కాలం వెళ్లదీస్తున్నారని సమ్మెకు దిగిన ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు ఆరోపిస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన కొందరిని నియమిస్తున్నారని, ఇదే కొనసాగితే 2027 నాటికి రెగ్యులర్‌ సిబ్బంది కొరత ఏర్పడుతుందని వారు చెబుతున్నారు. ఖాళీల భర్తీపై స్పష్టమైన ప్రకటన వచ్చేంతవరకు విధుల్లోకి చేరబోమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

మరోపక్క ఉద్యోగుల చర్యను అక్కడి ప్రభుత్వం ఖండించింది. కొంతమంది స్థానిక ఏజెంట్ల మాటలు వినడం వల్లే ఉద్యోగులు సమ్మెకు దిగారని చెబుతోంది. ఉద్యోగులు సమ్మెకు దిగడం ద్వారా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమానయాన శాఖ డిప్యూటీ మంత్రి ప్యాట్రిస్‌ వెగ్రిట్‌ మీడియాకు తెలిపారు. సిబ్బందితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

పారిస్‌ విమాన సిబ్బంది ఇలా హఠాత్తుగా సమ్మెకు దిగడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. మే ప్రారంభంలో సమ్మె కారణంగా యూరప్‌ దేశాలకు పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమానాశ్రయ అధికారులు, అక్కడి ప్రధాన లేబర్‌ యూనియన్‌ ఎస్‌ఎన్‌సీటీఏ మధ్య చర్చలు సఫలమవడంతో అప్పటి వివాదం ముగిసింది. తాజాగా రెండో అతి పెద్ద లేబర్‌ గ్రూప్‌ యూఎన్‌ఎస్‌ఏ – ఐసీఎన్‌ఏ సమ్మెకు పిలుపునిచ్చింది. మరి ఈ సమస్య పరిష్కారానికి ఎంత సమయం పడుతుందనేది వేచిచూడాలి.

Tags:    
Advertisement

Similar News