గరికపాటిపై 'చిరు' పంచ్

గరికపాటి-చిరంజీవి వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడిది మరోసారి తెరపైకొచ్చింది. స్వయంగా చిరంజీవి, గరికపాటి పేరు ప్రస్తావించారు.

Advertisement
Update: 2022-10-29 12:03 GMT

ప్రముఖ ప్రవచకులు గరికపాటి నరసింహారావు, మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవితో సెల్ఫీలు దిగేందుకు అంతా ఎగబడుతుంటే, ప్రవచనం ప్రారంభించాల్సిన గరికపాటి ఒకింత అసౌకర్యానికి గురయ్యారు. అది కాస్తా అసహనంగా మారి, చిరంజీవి ఫొటోలు ఆపితే తను ప్రారంభిస్తానని, లేకపోతే వెళ్లిపోతానని మైకులోనే అనడం వివాదాస్పదమైంది.

దీనిపై చిరంజీవి పెద్దగా స్పందించలేదు. తర్వాత ఆయనొచ్చి నేరుగా గరికపాటి పక్కనే కూర్చున్నారు. కానీ మెగాభిమానులు మాత్రం ఊరుకోలేదు. గరికపాటిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కొన్ని ఛానెళ్లు ఈ అంశంపై చర్చవేదికలు కూడా నిర్వహించాయి.

మొత్తానికి ఆ వివాదం సమసిపోయింది. అటు గరికపాటి, ఇటు చిరంజీవి కూడా ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోవడంతో తొందరగానే వివాదం ముగిసింది. అయితే ఇప్పుడు మరోసారి చిరంజీవి కారణంగానే ఈ వ్యవహారం హైలెట్ అవ్వడం విశేషం.

ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు చిరంజీవి. ఆయన ఎక్కడుంటే అక్కడ సెల్ఫీలు, ఫొటోలు తప్పవు. ఆ కార్యక్రమంలో కూడా అదే జరిగింది. చిరుతో ఫొటోలు దిగేందుకు అంతా ఎగబడ్డారు. అలా తన అభిమానులతో ఫొటోలు దిగుతూనే, ఓ సందర్భంలో 'ఇక్కడ గరికపాటి లేరు కదా' అంటూ చిన్న పంచ్ వేశారు చిరు. దీంతో సభలో అంతా ఘొల్లుమన్నారు. 

Tags:    
Advertisement

Similar News