వేగుంట మోహనప్రసాద్ (జనవరి 5, 1942 - ఆగష్టు 3, 2011)

Advertisement
Update: 2023-08-03 06:54 GMT

'మో'అన్న ఏకాక్షరంతో సాహితీలోకంలో ప్రసిద్ధంగా వ్యవహృతులైన ప్రముఖ కవి, రచయిత, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి వేగుంట మోహనప్రసాద్ తెలుగు ఆంగ్ల సాహిత్యాల్లో ప్రతిభావంతుడిగా పేరొందారు .

ఆయన గుంటూరు సమీపంలో 1942, జనవరి 5 న సుబ్బారావు, మస్తానమ్మ దంపతులకు తాడికొండ మండలం లాంలో జన్మించారు. స్వస్థలం ఏలూరు తండ్రి సుబ్బా రావు టీచర్. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ. పట్టా పొందారు .విజయవాడ లోని సిద్ధార్థ కళాశాలలో ఆయన ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశారు.అంతకు ముందు మూడేళ్లపాటు నైజీరియాలో ఆంగ్లోపాధ్యాయుడిగా పనిచేశారు .

సిద్ధార్థ విద్యా సంస్థల్లో ఆంగ్ల శాఖాధిపతిగా 2000 జూలై 31న ఉద్యోగ విరమణచేసి ఆ తర్వాత ఐదేళ్లు ద్రవిడ విశ్వవిద్యాలయంలో అనువాద విభాగానికి నేతృత్వం వహించారు. కవిగా, అనువాదకునిగా ఆయన అపార ప్రతిభ కనబర్చారు.ఈయనకు భార్య సుజాత, కుమార్తె మమత ఉన్నారు.

ఆయన వ్రాసిన మొట్టమొదట కవిత "హిమానీహృది" 1960 మే నెల భారతి పత్రికలో ప్రచురించబడింది. మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు తన ఊరి తన వారి జ్ఞాపకానుభవాల కాక్‌టెయిల్‌ చితి-చింత (1969) మో కి తెలుగు కవుల్లో ఒక ప్రత్యేకమైన ఉనికిని తెచ్చింది. తెలుగు పాఠకులకు 1969లో చితి-చింత కవితా సంపుటితో మో పరిచయమయ్యారు.

1970 దశకం దాకా ఉన్న కవిత్వాన్ని ఆంగ్ల పాఠకులకు పరిచయం చేయాలన్న తపనతో ది టెన్స్ టైమ్ను ప్రచురించారు.

కరచాలనం గ్రంథం (1999), రహస్తంత్రి కవితా సంపుటికి మంచి పేరువచ్చింది. బతికిన క్షణాలు (1990), పునరపి (1993), సాంధ్యభాష (1999), వెన్నెల నీడలు (2004) కవితాసంపుటాలు అపురూప కవిగా స్థిరపరిచాయి.

ఖాదర్ మొహియుద్దీన్ -టిఎస్ ఇలియట్ వేస్ట్‌లాండ్ను చవిటిపర్ర (2011) పేరిట చేసిన అనువాదానికి మో టీకా-టిప్పణి సమకూర్చారు. ఆత్మాశ్ర య ధోరణికి పెద్దపీట వేస్తూనే స్వాప్నికునిగా అన్వేషకునిగా తెలుగు సాహిత్యంపై మో చెరగని ముద్ర వేశారు.

2011 ఆగస్టు లో ఆయన అస్వస్థతగా ఉండడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత రోజైన ఆగష్టు 3, 2011 ఉదయం ఆయన కోమాలోకి వెళ్ళిపోవడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. అప్పటి నుంచి ఆయనను వెంటిలేటర్ మీద ఉంచారు.

హైదరాబాద్‌లోని మోహన్ ఫౌండేషన్‌కు తన మూత్ర పిండాలు, కాలేయం, నేత్రాలను దానం చేస్తానని వారికి మోహన్ జీవించి ఉన్న కాలంలో అంగీకార పత్రం రాసి ఇచ్చారు. ఆయన తుది కోరిక నెరవేర్చడం కష్టమైన పని అయినప్పటికీ కుటుంబ సభ్యులు వైద్యులకు పూర్తిగా సహకరించారు.



మోహన్ కోరిక ప్రకారం దానం చేస్తానన్న అవయవాలను తీసుకోవాలంటే శరీరం, కణాలు పూర్తిగా నిర్జీవం కాకూడదని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో మోహన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు సమ్మతితో తెల్లవారు జామున నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యులు ప్రత్యేక సర్జరీ ద్వారా మూత్రపిండాలు, కాలేయం, కళ్ళు తొలగించి భద్రపరిచారు.నేత్రాలను మాత్రం నగరంలోని ఐ బ్యాంక్‌కు ఇచ్చారు. రెండు మూత్రపిండాలు, కాలేయం ఛార్టర్డ్ విమానంలో హైదరాబాద్‌కు తీసుకువెళ్ళారు.




మో చితి కి ఆయన కుమార్తె మమత యే దహనసంస్కారాలు చేసారు .

మో వెలువరించిన గ్రంథాలు :

* చితి-చింత

* పునరపి

* రహస్తంత్రి

* నిషాదం

* సాంధ్యభాష

* బతికిన క్షణాలు (జీవిత చరిత్ర)

* Silent Secret

* This Tense Time (175 తెలుగుకవుల ఆంగ్లానువాదాల సంకలనం - సంపాదకత్వం)

* షేక్స్పియర్ నాటక కథలు

* కరచాలనం పేరుతో వ్యాసాల ద్వారా ప్రసిద్ధ రచయితలను పాఠకులకు పరిచయం చేశారు.

* ఆయన తొలి కవితా సంకలనం చితి- చింతకు 1969లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చింది.

* చివరి కవిత్వం నిషాదం. దీనికి తనికెళ్ల భరణి అవార్డు లభించింది.

ఇవాళ ఆగస్టు 3 ఆయన 12 వ వర్థంతి సందర్భంగా స్మరణీయ నివాళులు 

Tags:    
Advertisement

Similar News