టీడీపీ ఓటమి ఖాయమనే భయంతోనే పురందేశ్వరి ఇలా..

కేవలం టీడీపీ కూటమి ఓటమి పాలవుతుందనే భయంతోనే ఆమె ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. నిజానికి, అటువంటి కుట్రలేవో చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతాయని ఆమెకు అనుభవంలో ఉండే ఉంటుంది.

Advertisement
Update: 2024-02-12 12:32 GMT

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నిక‌ల‌కు ముందే చేతులెత్తేసినట్లు కనిపిస్తున్నారు. తన మరిది చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూట‌మి ఓటమి పాలవుతున్నట్లు ఆమె ముందే గ్రహించినట్లున్నారు. అందుకే వైఎస్‌ జగన్‌ వై నాట్‌ 175 పిలుపులో కుట్ర దాగి వుందని ఆమె ఆరోపిస్తున్నారు. అభ్యర్థులను మార్చినట్లే ఓటర్లను కూడా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారుస్తున్నారని ఏ ఆధారమూ లేని ఓ ఆరోపణ చేశారు. అటువంటిది ఏమైనా జరిగితే ఆమె రాష్ట్ర అధ్య‌క్షురాలుగా ఉన్న పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంది. చర్యలు తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది.

కేవలం టీడీపీ కూటమి ఓటమి పాలవుతుందనే భయంతోనే ఆమె ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. నిజానికి, అటువంటి కుట్రలేవో చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతాయని ఆమెకు అనుభవంలో ఉండే ఉంటుంది. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు, సోదరుడు నందమూరి హరికృష్ణకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వారిని అవమానించిన చరిత్ర చంద్రబాబుది. అవ‌స‌రానికి వాడుకుని వదిలేయడం చంద్రబాబు రాజకీయ నీతి.

మరోసారి చంద్రబాబు పన్నిన ఉచ్చులో పురందేశ్వరి చిక్కుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని 2014 ఎన్నికల్లో తాను అడిగిన నియోజకవర్గంలో పోటీ చేయనీయకుండా చేసిన చరిత్ర కూడా చంద్రబాబుకు ఉందని ఆమె మరిచిపోయినట్లున్నారు. మరోసారి ఆమెకు చంద్రబాబు అదే రుచి చూపించే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా రాజకీయాల్లో ముందడుగు వేయరాదనేది చంద్రబాబు వ్యూహం.

Tags:    
Advertisement

Similar News