జనసేన ముఖ్యనేతకు పవన్ షోకాజ్ నోటీస్

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి పసుపులేటి హరిప్రసాద్ కూడా హాజరయ్యారు. వేదికపైనే చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.

Advertisement
Update: 2024-01-03 14:34 GMT

తిరుపతికి చెందిన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా పేరుంది. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో ఆ పార్టీలో హరిప్రసాద్ పనిచేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట నడుస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న హరిప్రసాద్ పవన్ కళ్యాణ్ నిర్వహించే కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. జనసేనకు సంబంధించిన సమాచారాలను మీడియాకు తెలియజేస్తుంటారు.

జనసేనలో కీలక నేత, పవన్ కళ్యాణ్ సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న హరిప్రసాద్ కు పవన్ కళ్యాణ్ షోకాజ్ నోటీస్ జారీచేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ సీటును తమకు ఇవ్వాలని జనసేన పట్టుబడుతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పొత్తులో ఆ సీటు జనసేనకు వస్తే పసుపులేటి హరిప్రసాద్ అభ్యర్థిగా పోటీచేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ షోకాజ్ నోటీస్ జారీచేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి పసుపులేటి హరిప్రసాద్ కూడా హాజరయ్యారు. వేదికపైనే చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. ఆ సమయంలో జిల్లాకు చెందిన పలువురు జనసేన నాయకులను హరిప్రసాద్ చంద్రబాబుకు పరిచయం చేశారు. అయితే కుప్పం నాయకులను మాత్రం హరిప్రసాద్ పట్టించుకోలేదు. దీనిపై కుప్పం జనసేన నాయకులు హరిప్రసాద్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులను చంద్రబాబుకు పరిచయం చేసి తమను మాత్రం దూరం పెట్టడం ఏంటని హరిప్రసాద్ ను ప్రశ్నించారు.

ఈ విషయమై వారు వేదికపైనే హరిప్రసాద్ తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ కుప్పం నాయకులను దూషించినట్లు తెలుస్తోంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో హరిప్రసాద్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై వివరణ ఇవ్వాలని జనసేన క్రమశిక్షణ కమిటీ హరిప్రసాద్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇప్పటికే తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ నగరంలో పలు వివాదాలకు కారణం అవుతుండగా.. ఇప్పుడు అదే నగరానికి చెందిన హరిప్రసాద్ మరో వివాదం తీసుకురావడం పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారింది.

Tags:    
Advertisement

Similar News