జగన్ బొమ్మ చూసినా పవన్ కి కడుపుమంటేనా..?

పనిలో పనిగా జగన్ ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు పవన్ కల్యాణ్. విశాఖలో దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే "సమగ్ర భూరక్ష చట్టం" తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు.

Advertisement
Update: 2024-01-05 12:12 GMT

రాజకీయాల్లో వైరి వర్గాల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. విమర్శలు, దూషణలు అన్నీ సహజం. అయితే జగన్ విషయంలో పవన్ కల్యాణ్ కి వాటితోపాటు అసూయ కూడా ఎక్కువపాళ్లు ఉందనే విమర్శ వైసీపీ నుంచి ఉంది. తాజాగా సీఎం జగన్ బొమ్మలపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నాయి. అసలు ఏపీలో పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకు..? పొలాల్లో వేసే సరిహద్దు రాళ్లపై జగన్ ఫొటో ఎందుకంటూ లాజిక్ తీస్తున్నారు పవన్ కల్యాణ్. సమగ్ర భూ రక్ష చట్టంపై జనసేన పార్టీ ఆఫీస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదులు ఒక విషయంపై మాట్లాడితే, పవన్ మరో విషయాన్ని ప్రస్తావించి తన మనసులో మాటలన్నీ బయటపెట్టారు.


"సమగ్ర భూరక్ష చట్టం"లో సమస్యలున్నాయంటూ విజయవాడ బార్ అసోసియేషన్ కి చెందిన కొందరు ఆందోళన చేపట్టారు. హైకోర్టు వద్ద కూడా వారు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మద్దతుకోసం కొంతమంది జనసేన పార్టీ ఆఫీస్ కి వచ్చారు. ఆయనతో సమావేశమయ్యారు. వారి మాటలన్నీ విన్న పవన్ కల్యాణ్ ఆందోళనకు సంపూర్ణ మద్దతిస్తానన్నారు. అదే సమయంలో భూరక్ష చట్టంపై స్పందించే విషయంలో ఆయన మరో మెలిక పెట్టారు. సగటు మనిషికి సులువుగా అర్థమయ్యేలా ఈ అంశంపై మరింత అధ్యయనం చేస్తానన్నారు పవన్. అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు తనకు కాస్త సమయం కావాలన్నారు.

పనిలో పనిగా జగన్ ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు పవన్ కల్యాణ్. విశాఖలో దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే "సమగ్ర భూరక్ష చట్టం" తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. రుషికొండను దోచుకొని నచ్చిన వారికి రాసుకోవచ్చు అనుకుంటున్నారా అన్నారు. సమగ్ర భూరక్ష చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని కూడా చెప్పారు పవన్ కల్యాణ్. 

Tags:    
Advertisement

Similar News