కమ్మ కుల ఉగ్రవాదులు.. కొడాలి సంచలన వ్యాఖ్యలు..

తనను కుల బహిష్కరణ చేయడానికే ఓడిపోయిన 10మంది కమ్మ టీడీపీ నాయకులు, గుడివాడ వచ్చి తొడలు కొట్టారని, అయితే వారి పప్పులేవీ ఉడకలేదని అన్నారు కొడాలి నాని.

Advertisement
Update: 2022-10-10 16:16 GMT

మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ కుల ఉగ్రవాదులంటూ అమరావతి టు అరసవెల్లి యాత్ర చేస్తున్నవారిపై మండిపడ్డారు. అమరావతి రైతుల ముసుగులో కమ్మ కుల ఉగ్రవాదులు చేస్తున్నదే పాదయాత్ర అని అన్నారు నాని. 200 ఏళ్లైనా అమరావతి నిర్మాణం పూర్తికాదని చెప్పారు. కేవలం చంద్రబాబు స్వలాభం కోసమే అమరావతి మొదలు పెట్టారని, అది పూర్తికాదనే విషయం ఆయనకు కూడా తెలుసన్నారు. తనను కుల బహిష్కరణ చేయడానికే ఓడిపోయిన 10మంది కమ్మ టీడీపీ నాయకులు, గుడివాడ వచ్చి తొడలు కొట్టారని, అయితే వారి పప్పులేవీ ఉడకలేదని అన్నారు. ఆయనకు ఉపయోగపడేవారిని నయా జమీందారులను చేయడం కోసమే చంద్రబాబు తపన పడుతున్నారని చెప్పారు. అమరావతి ముసుగులో చంద్రబాబు చెబుతున్న మాటల్ని రైతులు నమ్మొద్దని, పదే పదే మోసపోవద్దని కోరారు నాని.

ఎన్టీఆర్‌ చావుకు కారణమైన వారిని తరిమి కొట్టాలని అన్నారు నాని. పవన్‌ కల్యాణ్ కు ఆయన సోదరుడు చిరంజీవి సపోర్ట్ అవసరం లేదని, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మద్దతు ఉంటే చాలని సెటైర్లు వేశారు. పవన్ కు చిరంజీవి అవసరం రాకపోవచ్చన్నారు నాని.

బీఆర్ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీలో బీఆర్ఎస్ మ‌నుగ‌డ‌కు కాల‌మే స‌మాధానం చెప్పాల‌ని అన్నారు కొడాలి నాని. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్, ప్రధాని కావాలని అనుకుంటున్నారేమో అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలు కేసీఆర్‌ ను వ్యతిరేకించారని, కానీ ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్‌లో సెటిలైన ఆంధ్రా వాళ్లు టీఆర్ఎస్ పార్టీని అభిమానించారని కొడాలి నాని గుర్తుచేశారు. ఎవరైనా, ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు అని చెప్పారు నాని.

Tags:    
Advertisement

Similar News