లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు - ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

విషయాన్ని ఇంట్లో చెబితే ఏమవుతుందో అని భయపడ్డ వంశీ ఈనెల 25న ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపించాడు.

Advertisement
Update: 2024-05-27 10:05 GMT

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అధిక వడ్డీ అని తెలిసినప్పటికీ అత్యవసరాల కోసం లోన్ యాప్ నిర్వాహకుల నుంచి డబ్బు తీసుకొని ఆ తర్వాత వారి వేధింపులు భరించలేక బాధితులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి లోన్ యాప్ లో రూ. 10 వేలు అప్పుగా తీసుకోగా.. వడ్డీతో సహా లక్ష రూపాయలు కట్టాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధించడంతో అతడు ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.

విజయవాడకు చెందిన మురికింటి వంశీ(22) ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తన వ్యక్తిగత అవసరాల కోసం ఇంట్లో చెప్పకుండా లోన్ యాప్ లో రూ. 10 వేల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వడ్డీతో సహా లక్ష రూపాయలు కట్టాలంటూ లోన్ యాప్ నిర్వాహకులు వంశీని వేధించడం మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని ఇంట్లో చెబితే ఏమవుతుందో అని భయపడ్డ వంశీ ఈనెల 25న ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్ పంపించాడు. దీంతో ఆందోళన చెందిన వంశీ తల్లిదండ్రులు కుమారుడికి ఫోన్ చేయగా అప్పటికే స్విచ్చాఫ్ చేశాడు. దీంతో వారు వంశీ ఆచూకీ కోసం రెండు రోజులుగా వెతుకుతున్నారు. వారికి తాడేపల్లిలో కృష్ణానది వద్ద వంశీ మొబైల్ ఫోన్, చెప్పులు, ద్విచక్ర వాహనం కనిపించాయి. నదిలోకి దిగి గాలించగా వంశీ మృతదేహం లభ్యమైంది. ఈ విషయమై వంశీ తండ్రి ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News