ఓటమి ఖాయం కావడంతో బాబు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు

చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ పొలిటికల్‌ డ్యాన్సర్లని అంబటి రాంబాబు అన్నారు. రోజుకో పార్టీతో డ్యాన్స్‌ చేసే వ్యక్తి చంద్రబాబని ఆయన చెప్పారు.

Advertisement
Update: 2024-04-07 10:07 GMT

రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సత్తెనపల్లిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చంద్రబాబు సభలన్నీ అట్టర్‌ ఫ్లాప్‌ అవుతున్నాయని, సందుల్లో మీటింగులు పెట్టినా జనం రాలేదంటే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు నేతలే లేరని, తాము వదిలేసిన వ్యక్తులకు టీడీపీలో టికెట్‌ ఇచ్చి పోటీ చేయిస్తున్నారని ఆయన తెలిపారు.

సీఎం వైఎస్‌ జగన్‌ దెబ్బకు టీడీపీ తట్టుకునే పరిస్థితి లేదని అంబటి చెప్పారు. 175 స్థానాల్లో గెలిచి మళ్లీ వైఎస్‌ జగనే ముఖ్యమంత్రి అవుతారని ఆయన స్పష్టం చేశారు. సర్వేలన్నీ ఇప్పటికే వైసీపీ విజయాన్ని తేల్చి చెప్పేశాయన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు గెలవడం కష్టమేనని అంబటి చెప్పారు. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ కూడా ఓడిపోతాడని ఆయన స్పష్టం చేశారు.

బాబు, పవన్‌ పొలిటికల్‌ డ్యాన్సర్లు..

చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ పొలిటికల్‌ డ్యాన్సర్లని అంబటి రాంబాబు అన్నారు. రోజుకో పార్టీతో డ్యాన్స్‌ చేసే వ్యక్తి చంద్రబాబని ఆయన చెప్పారు. పవన్‌ కూడా పొలిటికల్‌ డ్యాన్సరేనని ఆయన తెలిపారు. రెండు రోజులు ప్రచారం చేసి ఐదు రోజులు పడుకునే పవన్‌కి అసలు రాజకీయాలు ఎందుకని అంబటి ప్రశ్నించారు. పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నది చంద్రబాబేనని, చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమవుతోందని ఆయన తెలిపారు. బాబుతో పొత్తు అంటే సమాధి కట్టడమేనని అంబటి విమర్శించారు. ఈ విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ గతంలోనే చెప్పారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబుకే కన్నా తిట్టిన తిట్లు గుర్తు లేనట్టున్నాయని, పొత్తు పెట్టుకోవడం, సమాధి కట్టేయడమే చంద్రబాబు పని అని కన్నా విమర్శలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Tags:    
Advertisement

Similar News