నారా లోకేష్ పై చర్యలకు వైసీపీ డిమాండ్

తప్పుడు వీడియోని విడుదల చేసి తమ ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు లోకేష్ పై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు అంబటి.

Advertisement
Update: 2024-05-23 11:15 GMT

ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేసిన నారా లోకేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఈసీ ఆ వీడియోని విడుదల చేయలేదని, అలాంటప్పుడు లోకేష్ వద్దకు అది ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అది ఫాల్స్ వీడియో అని అంటున్నారాయన. తప్పుడు వీడియోని విడుదల చేసి తమ ఎమ్మెల్యేపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. ఈమేరకు ఏపీ పోలీసులు, ఎన్నికల కమిషన్ ని ఉద్దేశిస్తూ అంబటి ఓ ట్వీట్ వేశారు.


టీడీపీతో కుమ్మక్కు..

పిన్నెల్లి వీడియోతో తమకు సంబంధం లేదంటూ సీఈఓ ముకేష్ కుమార్ మీనా చేసిన వ్యాఖ్యలు తాజాగా కలకలం రేపాయి. ఈసీకి తెలియకుండా ఆ వీడియోలు ఎలా బయటకు వెళ్లాయని, ఎవరు బయట పెట్టారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీస్ అధికారులు టీడీపీతో ఏ స్థాయిలో కుమ్మక్కయ్యారో దీన్ని బట్టి అర్థమవుతోందని అన్నారు అంబటి రాంబాబు.


వీడియో ఒరిజినలా, కాదా..?

పిన్నెల్లి వీడియో ఒరిజినలా, లేదా ఎడిటింగ్ చేసిందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. పిన్నెల్లి వీడియోని ఎడిట్ చేసి లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారని, అది తప్పుడు వీడియో అని అంటున్నారు అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్. తప్పుడు వీడియోలు పోస్ట్ చేసినందుకు లోకేష్ పై చర్యలు తీసుకోవాలన్నారు అంబటి. పోనీ అది ఒరిజినల్ వీడియో అయినా కూడా.. పోలీసుల దగ్గర ఉండాల్సిన సున్నిత సమాచారం ఇలా బయటకు రావడం సరికాదు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతుందేమో చూడాలి. 

Tags:    
Advertisement

Similar News