ఢిల్లీ వచ్చింది 'బ్రో' కోసం కాదు.. అసలు విషయం చెప్పిన అంబటి

రాయలసీమ టూర్ లో చంద్రబాబు స్ధాయికి తగని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తనని ఆంబోతు అంటూ కించపరుస్తున్న చంద్రబాబు, గతంలో ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి పైకి వచ్చాడని సెటైర్లు పేల్చారు అంబటి.

Advertisement
Update: 2023-08-03 10:56 GMT

'బ్రో' సినిమా లెక్కలు తేల్చేస్తానంటూ హడావిడిగా ఢిల్లీ వెళ్లిన ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హస్తినలో మాత్రం పోలవరం లెక్కలు చెప్పారు. ఎవరైనా సలహా ఇచ్చారో లేక సోషల్ మీడియా ట్రోలింగ్ లకు సమాధానం ఇవ్వాలనుకున్నారో తెలియదు కానీ పోలవరం సబ్జెక్ట్ పై మీడియాతో మాట్లాడారు అంబటి. ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ని కలిశానన్నారు. ఆయన్ను పోలవరం సందర్శనకు ఆహ్వానించానని చెప్పారు అంబటి.

పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు, అధికారంలో ఉండగా ఆ పని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు అంబటి. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేంద్రమే నిర్మించి ఇస్తామంటే అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎందుకు చేతుల్లోకి తీసుకుందన్నారు. పోలవరానికి వెన్నెముక లాంటి డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాం పూర్తి కాకుండా ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎందుకు సాహసించారని ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పాలని తాను అడిగితే. ఆంబోతు రాంబాబు అంటూ తనను కించపరుస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో ఏ ఒక్కప్రాజెక్టుకయినా చంద్రబాబు కాలంలో శంకుస్ధాపన జరిగిందా, దాన్ని పూర్తి చేశారా అని ప్రశ్నించారు. రాయలసీమ టూర్ లో చంద్రబాబు స్ధాయికి తగని మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తనని ఆంబోతు అంటూ కించపరుస్తున్న చంద్రబాబు, గతంలో ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి పైకి వచ్చాడని సెటైర్లు పేల్చారు అంబటి.

గోకుతున్నాడు కాబట్టే..

పోలవరంపై మాట్లాడిన తర్వాత 'బ్రో'పై కూడా మరోసారి రియాక్ట్ అయ్యారు అంబటి. సినిమాలో తమని టార్గెట్ చేస్తూ పాత్రలు, డైలాగులు పెట్టి గోకుతున్నారు కాబట్టే తాను 'బ్రో' గురించి మాట్లాడుతున్నానని అన్నారు. పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని, బ్రో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పవన్ కు ఎంత డబ్బిచ్చారో నిర్మాత బయటకు చెప్పాల్సిందేనన్నారు అంబటి. 

Tags:    
Advertisement

Similar News