పవన్ కు జనవాణి తెలియదు.. ధనవాణి తెలుసు

ఇటీవల ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు పవన్ కల్యాణ్. జనవాణి అనే పేరుతో గత ఆదివారం అర్జీలు స్వీకరించిన పవన్, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చేవారం అవసరమైతే మళ్లీ జనవాణి నిర్వహిస్తామన్నారు. పవన్ కల్యాణ్ జనవాణిపై తాజాగా సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్ కల్యాణ్ కి ‘జనవాణి’ తెలియదని, ఆయనకు తెలిసింది ‘ధనవాణి’ మాత్రమేనని అన్నారు. డబ్బులు తీసుకుని చంద్రబాబు, బీజేపీ, కమ్యూనిస్టులు.. ఆఖరికి ఇతర […]

Advertisement
Update: 2022-07-06 06:10 GMT

ఇటీవల ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు పవన్ కల్యాణ్. జనవాణి అనే పేరుతో గత ఆదివారం అర్జీలు స్వీకరించిన పవన్, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చేవారం అవసరమైతే మళ్లీ జనవాణి నిర్వహిస్తామన్నారు. పవన్ కల్యాణ్ జనవాణిపై తాజాగా సెటైర్లు పేల్చారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్ కల్యాణ్ కి ‘జనవాణి’ తెలియదని, ఆయనకు తెలిసింది ‘ధనవాణి’ మాత్రమేనని అన్నారు. డబ్బులు తీసుకుని చంద్రబాబు, బీజేపీ, కమ్యూనిస్టులు.. ఆఖరికి ఇతర రాష్ట్రాల పార్టీలతోనూ పవన్ పొత్తు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన్ను ప్యాకేజీ కల్యాణ్ అంటారన్నారు. డబ్బులు తీసుకుని పొత్తులు పెట్టుకునే పవన్ కల్యాణ్ కి జనవాణి తెలిసే అవకాశమే లేదని, ఆయనకు తెలిసిందన్నా ధనవాణి మాత్రమేనని అన్నారు.

10రోజులు ఏపీలో నిద్రపో.. చాలు
పవన్ కల్యాణ్, వెల్లంపల్లి మధ్య చాన్నాళ్లుగా మాటల తూటాలు పేలుతున్నాయి. 2014లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో పవన్ కూడా వెల్లంపల్లికి ఓట్లేయాలని ప్రజలకు సూచించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ తరపున వెల్లంపల్లి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. అప్పటినుంచి వారిద్దరి మధ్య నేరుగా డైలాగ్ వార్ జరుగుతోంది. పవన్ కూడా వెల్లంపల్లిని నేరుగా టార్గెట్ చేసిన సందర్భాలు అనేకం. మంత్రి హోదాలో ఉన్నప్పుడు, ఇప్పుడు మంత్రి పదవి లేకపోయినా కూడా జనసేనానిపై ఓ రేంజ్ లో సెటైర్లు పేలుస్తున్నారు వెల్లంపల్లి. అసలు పవన్ కల్యాణ్ అడ్రస్ లేని వ్యక్తి అని మండిపడ్డారు మాజీ మంత్రి. ఏపీ, తెలంగాణ మధ్య ఆయనది షటిల్ సర్వీస్ అని ఎద్దేవా చేశారు. ఒక్క పది రోజులు కుదురుగా ఏపీలోనే నిద్రచేసి, ఆ తర్వాత ఏపీ ప్రజల గురించి పవన్ మాట్లాడాలన్నారు. ఎన్నికల సమయంలోనే జగన్ రాజకీయాలు చేస్తారని, మిగిలిన సమయంలో ప్రజల, రాష్ట్ర అభివృద్ధి పైనే దృష్టి పెడతారని అన్నారు వెల్లంపల్లి. మూడేళ్ళపాటు కుంభకర్ణుడిలాగా నిద్రపోయిన పవన్ కల్యాణ్ ఇప్పుడు జనవాణి అంటూ వినతిపత్రాలు స్వీకరించడం ఏంటని మండిపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో ఉంటే తప్పేంటి..?
ఇటీవల ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో సీఎం జగన్ ఆయనతో సన్నిహితంగా ఉండటం ప్రతిపక్షాలకు మింగుడు పడటంలేదు. వామపక్షాల నేతలు, టీడీపీ నేతలు కూడా విమర్శలు మొదలు పెట్టారు. ఈ వ్యవహారంపై వెల్లంపల్లి ఘాటుగా స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అలా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని, పనికిమాలిన ఎంపీ మాటలను, పకోడి రామకృష్ణ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు వెల్లంపల్లి.

Tags:    
Advertisement

Similar News