ఎదురులేని వైస్ చాన్సలర్ శాసనోల్లంఘన
చట్టం ముందు అందరూ సమానులేనన్న సూత్రానికి తరచుగా తూట్లు పొడవడం పరిపాటి అయిపోయింది. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనన్నది కేవలం నేతిబీరకాయలా మిగిలిపోతోంది. సామాజికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన వారు చట్టం ముందు అందరూ సమానులేనన్న సూత్రాన్ని యదేచ్ఛగా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. బలవంతుడి మాటే చెల్లుబాటు అవుతోంది. వివాదాలకు మారుపేరుగా మాత్రమే వార్తలకెక్కే హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పొదిలి అప్పారావు తన సామాజిక వర్గం, రాజకీయ అండ ఆధారంగా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ షెడ్యూల్డు కులాల, […]
చట్టం ముందు అందరూ సమానులేనన్న సూత్రానికి తరచుగా తూట్లు పొడవడం పరిపాటి అయిపోయింది. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేనన్నది కేవలం నేతిబీరకాయలా మిగిలిపోతోంది. సామాజికంగా, రాజకీయంగా పలుకుబడి కలిగిన వారు చట్టం ముందు అందరూ సమానులేనన్న సూత్రాన్ని యదేచ్ఛగా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. బలవంతుడి మాటే చెల్లుబాటు అవుతోంది.
వివాదాలకు మారుపేరుగా మాత్రమే వార్తలకెక్కే హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పొదిలి అప్పారావు తన సామాజిక వర్గం, రాజకీయ అండ ఆధారంగా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ షెడ్యూల్డు కులాల, షెడ్యూలు తెగల వారిపై అత్యాచారాల నిరోధ చట్టాన్ని బాహటంగా ఉల్లంఘించినా అడిగే నాథుడే లేకుండా పోయారు. ఆయన వ్యవహార సరళి రాజ్యాంగ మౌలిక సూత్రాలనే ఉల్లంఘించే రీతిలో ఉంది. షెడ్యూల్డు కులాల, షెడ్యూలు తెగల వారిపై అత్యాచారాల నిరోధ చట్టాన్ని ఉల్లంఘించే వారికి మామూలుగా అయితే శిక్ష పడాలి. కాని ప్రజాస్వామ్య హక్కులకోసం పోరాడిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులని ఆయన చట్ట వ్యతిరేకంగా విశ్వవిద్యాలయం నుంచి సస్పెండ్ చేసినా ఏలిన వారు పట్టించుకోలేదు.
రోహిత్ వేములకు న్యాయం జరగాలని అడిగే వారినందరినీ ఏదో ఒక రకంగా వేధించడమే వైస్ చాన్సలర్ కు నిత్యకృత్యమైంది. అప్పారావుకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన తన సామాజిక వర్గ నేత అండదండలున్నందువల్ల ఆయన ప్రజాస్వామ్యాన్ని అణచివేసినా, అణగారిన వర్గాల వారి మీద కసితో ఏ చర్య తీసుకున్నా ప్రశ్నించడానికే వీలులేకుండా పోయింది. చట్టాన్ని ఉల్లంఘించడమే వైస్ చాన్సలర్ ఎకైక లక్ష్యంగా కనిపిస్తోంది.