టీడీపీలో తాడోపేడో తేల్చుకునేందుకు ఆమంచి రెడీ…

మొన్నటి ఎన్నికల్లో ప్రకాశం జిల్లా  చీరాల నుంచి ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం టీడీపీలో చేరిన  ఆమంచి కృష్ణమోహన్‌కు టీడీపీ నేతల నుంచి పొగ ఉధృతమైంది. చివరకు తాడోపేడో తేల్చుకోవడానికి ఆమంచి సిద్ధపడే స్థాయికి పరిస్థితి వెళ్లింది. సోమవారం సీఎంను కలిసిన తర్వాత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఆమంచి తీవ్ర నిర్ణయం తీసుకునేంత దూరం పరిస్థితి వెళ్లడానికి కారణం ఇటీవల జిల్లాలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలే.  వేటపాలెం పోలీసులు ఈ […]

Advertisement
Update: 2016-03-20 00:58 GMT

మొన్నటి ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం టీడీపీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్‌కు టీడీపీ నేతల నుంచి పొగ ఉధృతమైంది. చివరకు తాడోపేడో తేల్చుకోవడానికి ఆమంచి సిద్ధపడే స్థాయికి పరిస్థితి వెళ్లింది. సోమవారం సీఎంను కలిసిన తర్వాత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఆమంచి తీవ్ర నిర్ణయం తీసుకునేంత దూరం పరిస్థితి వెళ్లడానికి కారణం ఇటీవల జిల్లాలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలే. వేటపాలెం పోలీసులు ఈ మధ్య ఆమంచి అనుచరులను టార్గెట్ చేశారు. పదేపదే కేసులు పెడుతున్నారు. ఇదంతా టీడీపీ జిల్లా నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపణ. తాజాగా వేటపాలెం పోలీసులు శుక్రవారం సరైన పత్రాలు లేవంటూ ఆమంచి అనుచరుడి వాహనాన్ని సీజ్ చేశారు.

వాహనాన్ని విడిపించుకునేందుకు న్యాయవాదితో కలిసి ఆమంచి అనుచరుడు వెళ్లగా వేటపాలెం పోలీసులు… లాయర్‌తో పాటు ఆమంచి అనుచరుడు గోపిరాజును అదుపులోకి తీసుకున్నారు. మరో ఆరుగురిపై కేసులు పెట్టారు. వీరంతా కలిసి స్టేషన్‌పై దాడి చేసి సామాగ్రి ధ్వంసం చేశారని కేసులు పెట్టారు. ఆ మధ్య వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో ఒక లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ విషయంలో స్థానిక ఎస్సైకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారి వెనుక ఆమంచి హస్తముందని పోలీసులు భావిస్తున్నారు. అప్పటి నుంచి ఆమంచిని పోలీసులు టార్గెట్ చేశారు. ఈ విషయంలో ఆమంచి అంటే గిట్టని టీడీపీ నేతలు కూడా పోలీసులను ఉసిగొల్పుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

దీనిపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆమంచి కృష్ణమోహన్ డీజీపీ వ్యక్తిగత కార్యదర్శి వద్ద ఆవేశంగా మాట్లాడారని తెలుస్తోంది. ఈ విషయంపై మాట్లాడేందుకు అపాయింట్‌మెంట్ కోరగా సోమవారం కలవాల్సిందిగా చంద్రబాబు సూచించారు. సీఎం స్పందనను బట్టి భవిష్యత్తుపై ఆలోచనచేయాలని ఆమంచి వర్గం భావిస్తోంది. ఒకవేళ సీఎం నుంచి సరైన స్పందన రాకపోతే వెంటనే సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆమంచి భావిస్తున్నారు .

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News