జేసీని అదుపుచేయడం ఎలా?
తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువైన ఎంపీ జేసీ దివాకరరెడ్డిని ఎలా అదుపుచేయాలో తెలియక తెలుగుదేశం నాయకులు సతమతమవుతున్నారు. ప్రత్యేక హోదా గురించి, పట్టిసీమ గురించి, పవన్కల్యాణ్ గురించి జేసీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు పార్టీని ఇరుకున పడేశాయి. తాజాగా ఆయన మరోమారు ప్రత్యేక హోదాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు లేవని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన అనంతపురంలో […]
Advertisement
తెలుగుదేశం పార్టీలో అంతర్మథనం
వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువైన ఎంపీ జేసీ దివాకరరెడ్డిని ఎలా అదుపుచేయాలో తెలియక తెలుగుదేశం నాయకులు సతమతమవుతున్నారు. ప్రత్యేక హోదా గురించి, పట్టిసీమ గురించి, పవన్కల్యాణ్ గురించి జేసీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడమే కాదు పార్టీని ఇరుకున పడేశాయి. తాజాగా ఆయన మరోమారు ప్రత్యేక హోదాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు లేవని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ కుండబద్దలు కొట్టారు. అయితే రాష్ట్రాభివృద్ధికి మాత్రం కేంద్రం నిధులు ఇస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు ప్రత్యేక హోదా రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసని ఆయన చేసిన వ్యాఖ్య పార్టీలో కలకలం రేపిన సంగతి తెల్సిందే. అంతేకాదు పట్టిసీమతో రాయలసీమకు నీళ్లు రావని ఒకసారి… పవన్ కల్యాణ్ నోరు మూయించడానికే మావాళ్లు ధర్నాలు చేస్తున్నారని మరోసారి జేసీ చేసిన ప్రకటనలు సంచలనంగా మారాయి. పార్టీనాయకులు ఆయనపై చాలా గుర్రుగా ఉన్నారు కూడా. ఆయన వ్యాఖ్యలపై ఇటీవల సుజనాచౌదరిని విలేకరులు వివరణ అడగ్గా ఆయన ఇష్టం ఆయనది.. నేను మాత్రం మా నాయకుడు చెప్పినట్లు నడుచుకుంటున్నా అని వ్యాఖ్యానించారు. జేసీని ఎలాగైనా సరే అదుపుచేయాలని అధినాయకుడికి ఇప్పటికే చాలామంది ఫిర్యాదుచేశారని సమాచారం. కాగా జేసీ మాత్రం తాను తనకు తెలిసిందే చెబుతున్నానని విలేకరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో కలిసిన సందర్భంగా ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న వాదన వారి మాటల్లో పరోక్షంగా ధ్వనించిందని జేసీ పేర్కొన్నారు. అయితే వారికి రాష్ట్రంపై సానుభూతి ఉందని, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీని ఆదుకోవాలన్న సంకల్పం మాత్రం వారి మాటల్లో స్పష్టంగా కనబడిందని జేసీ వ్యాఖ్యానించారు. జేసీని ఇలాగే వదిలేస్తే ముందుముందు ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అని తెలుగుదేశం నాయకులు మాత్రం గుబులుగా ఉన్నారు.
Advertisement