Telugu Global
National

ఢిల్లీ, ముంబై మధ్య త్వరలో ఎలక్ట్రిక్ హైవే..

పైన ఎలక్ట్రిక్‌ వైర్లు, కింద వాహనాలు.. ఇలాంటి రోడ్లను విదేశాల్లో చూసి ఉంటాం కానీ భారత్ లో ఇలాంటి రోడ్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి పట్టాలపై వెళ్లే రైళ్లకే ఇలా విద్యుత్ సౌకర్యం ఉంది. ఇదే తరహాలో త్వరలో ముంబై, ఢిల్లీ మధ్య ఎలక్ట్రిక్ హైవే అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎలక్ట్రిక్ హైవేపై ప్రకటన […]

ఢిల్లీ, ముంబై మధ్య త్వరలో ఎలక్ట్రిక్ హైవే..
X

పైన ఎలక్ట్రిక్‌ వైర్లు, కింద వాహనాలు.. ఇలాంటి రోడ్లను విదేశాల్లో చూసి ఉంటాం కానీ భారత్ లో ఇలాంటి రోడ్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి పట్టాలపై వెళ్లే రైళ్లకే ఇలా విద్యుత్ సౌకర్యం ఉంది. ఇదే తరహాలో త్వరలో ముంబై, ఢిల్లీ మధ్య ఎలక్ట్రిక్ హైవే అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.

హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎలక్ట్రిక్ హైవేపై ప్రకటన చేశారు. అయితే ఆ పనులు ఎప్పుడు మొదలవుతాయన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ట్రక్కుల యజమానులు కూడా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంపై దృష్టిసారించాలని, వాతావరణ కాలుష్యాన్ని వీలైనంత మేర తగ్గించాలని సూచించారు.

ట్రాలీ బస్ లు, ట్రాలీ ట్రక్‌లు..

విదేశాల్లో ట్రాలీ బస్ లు ఎలక్ట్రిక్ హైవేలపై పరుగులు తీస్తుంటాయి. అదే తరహాలో ట్రాలీ ట్రక్ లు కూడా అందుబాటులోకి తెస్తామంటున్నారు గడ్కరీ. ఓవర్ హెడ్ పవర్ లైన్స్ ద్వారా వాహనాలకు విద్యుత్ అందిస్తారు. వాహనం ప్రయాణించిన దూరాన్ని బట్టి దానికి చార్జీ వసూలు చేస్తారు. త్వరలోనే ఎలక్ట్రిక్ హైవే పనుల్ని మొదలు పెడతామంటున్నారు గడ్కరీ. హైవే ప్రమాదాల నివారణకు టన్నెల్ లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారాయన. 2.5 లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నట్టు చెప్పారు.

ఆర్టీఓలతో ఇబ్బందులు..

రాష్ట్రాల్లోని రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ (RTO)ల పరిధిలో జరుగుతున్న అవినీతి వల్ల హెవీ వెహికల్స్ యజమానులు ఇబ్బందిపడుతున్న మాట వాస్తవమేనన్నారు నితిన్ గడ్కరీ. వివిధ కారణాల వల్ల చైనా, యూరోపియన్ యూనియన్, అమెరికాతో పోల్చి చూస్తే భారత్ లో ట్రాన్స్ పోర్ట్ ఖర్చు ఎక్కువ అని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తగిన కృషి చేస్తున్నట్టు తెలిపారు.

డ్రైవర్లు అందరూ అనుభవం ఉన్నవారే అయినా, కొన్ని సందర్భాల్లో రోడ్ల నిర్మాణంలో ఉన్న లోపాల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని జిల్లాల కేంద్రాలను కలుపుతూ నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామని తెలిపారు గడ్కరీ.

First Published:  12 July 2022 3:39 AM GMT
Next Story