Telugu Global
National

రాహుల్ మరీ అంత బాధ్యత లేకుండా ఉన్నారా..?

సినిమా రిలీజ్ అయ్యాక, ఆ టెన్షన్ నుంచి రిలాక్స్ అవ్వడానికి హీరోల్లో చాలామంది ఫారిన్ టూర్లు వెళ్తుంటారు. కానీ రాజకీయాల్లో అలా కుదరదు. ఎలక్షన్లు అయిపోగానే పార్టీ నాయకులు ఫారిన్ టూర్లు వేస్తామంటే కార్యకర్తలకు వారిపై ఆరాధనా భావం తగ్గిపోతుంది. గెలిచినా, ఓడినా.. పార్టీని అంటిపెట్టుకుని ఉండేవారే అసలైన నాయకులు. మరి రాహుల్ గాంధీకి ఏమైంది. తరచూ ఆయన విదేశీ టూర్లకు ఎందుకు వెళ్తున్నారు. అది ఆయన వ్యక్తిగత విషయం అని సర్దిచెప్పుకున్నా.. పార్టీ నాయకులకు కూడా […]

రాహుల్ మరీ అంత బాధ్యత లేకుండా ఉన్నారా..?
X

సినిమా రిలీజ్ అయ్యాక, ఆ టెన్షన్ నుంచి రిలాక్స్ అవ్వడానికి హీరోల్లో చాలామంది ఫారిన్ టూర్లు వెళ్తుంటారు. కానీ రాజకీయాల్లో అలా కుదరదు. ఎలక్షన్లు అయిపోగానే పార్టీ నాయకులు ఫారిన్ టూర్లు వేస్తామంటే కార్యకర్తలకు వారిపై ఆరాధనా భావం తగ్గిపోతుంది. గెలిచినా, ఓడినా.. పార్టీని అంటిపెట్టుకుని ఉండేవారే అసలైన నాయకులు. మరి రాహుల్ గాంధీకి ఏమైంది. తరచూ ఆయన విదేశీ టూర్లకు ఎందుకు వెళ్తున్నారు. అది ఆయన వ్యక్తిగత విషయం అని సర్దిచెప్పుకున్నా.. పార్టీ నాయకులకు కూడా తెలియకుండా రాహుల్ వారాల తరబడి మాయం అయిపోవ‌డాన్ని ఏమనాలి..? వైరి వర్గాలు ఇదే విషయంపై రాహుల్ ని విమర్శిస్తున్నా.. అధిష్టానం మాత్రం వెనకేసుకు రావాల్సి వస్తోంది. తాజాగా ఆయన ఐరోపా పర్యటనపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. మంగళవారం వ్యక్తిగత పర్యటనకోసం ఐరోపా వెళ్లిన రాహుల్‌, ఆదివారం తిరిగి భారత్ కి వస్తారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు.

భారత్ లో ఇప్పుడు పొలిటికల్ హీట్ నడుస్తోంది. గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోడదూకేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటు రాష్ట్రపతి ఎన్నిక హడావిడి ఉండనే ఉంది. మరికొన్నిరోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి గురువారం కీలక సమావేశం జరగాల్సి ఉంది. రాహుల్ ఐరోపా పర్యటనకు వెళ్లారంటే ఆ సమావేశానికి డుమ్మా కొట్టారనే అర్థం. అసలు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడతారో లేదో తేలాల్సి ఉంది. అదే రోజు అక్టోబర్ 2నుంచి మొదలయ్యే భారత్ జోడో యాత్ర గురించి కూడా కీలక చర్చ జరుగుతుందని అంటున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర చేపట్టాలనుకుంటోంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ విషయంపై చర్చించే సమయంలో కూడా రాహుల్ లేరంటే ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సిందేనంటోంది పార్టీలోని మరో వర్గం.

ఆ మధ్య పంజాబ్, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న తర్వాత రాహుల్ విదేశీ పర్యటన అందరి దృష్టినీ ఆకర్షించింది. రాహుల్ నేపాల్‌ లోని ఓ నైట్‌ క్లబ్‌ కు వెళ్లిన దృశ్యాలు బీజేపీకి మంచి విందు భోజనంగా మారాయి. రాహుల్ పై సెటైర్లు పేల్చారు బీజేపీ నేతలు. అసలే పార్టీ అవసాన దశలో ఉంటే, పునర్‌వైభవం ఎలా తీసుకు రావాలనే విషయంపై దృష్టిపెట్టాల్సింది పోయి, ఇలా విదేశాల్లో పార్టీలు చేసుకుంటూ కెమెరాలకు చిక్కడం ఎంతవరకు కరెక్ట్ అంటూ పార్టీ వర్గాలే గుసగుసలాడుకున్నాయి. విచిత్రం ఏంటంటే.. పంజాబ్, యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న రోజుల్లో కూడా రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చారు.

పదే పదే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లడం, ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరెవరిని కలిశారనేది పూర్తిగా రహస్యంగా ఉంచడం.. పార్టీకి, నేతలకు అలవాటైపోయింది. కానీ కాంగ్రెస్ కి గత వైభవం తీసుకు రావాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తి ఇలా ఎందుకు చేస్తున్నారనేదే ఎవరికీ అంతు చిక్కడంలేదు. ఇప్పటి వరకూ రాహుల్ గాంధీ వ్యవహార శైలిని పరిశీలిస్తే ఆయన సీరియస్ గా పార్టీపై, రాజకీయాలపై దృష్టి పెట్టినట్టు అనుకోలేం. అయితే రాహుల్ కూడా రాజకీయాలను లైట్ తీసుకున్నట్టే.. విమర్శలను కూడా పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు.

First Published:  12 July 2022 9:26 AM GMT
Next Story