Telugu Global
NEWS

సర్వదర్శనం స్థానంలో త్వరలో టైమ్ స్లాట్ దర్శనాలు..

తిరుమలలో సర్వదర్శనాల స్థానంలో త్వరలో టైమ్ స్లాట్ దర్శనాలకు కసరత్తులు జరుగుతున్నాయి. ప్రస్తుతం దీనిపై అధ్యయనం జరుగుతోందని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పాలకమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. కరోనా తర్వాత సర్వదర్శనాలకు కూడా ఆన్ లైన్ లో టైమ్ స్లాట్ కేటాయిస్తూ కొన్నిరోజులపాటు ప్రయోగాత్మక విధానం అమలు చేశారు. అయితే ఆ తర్వాత భక్తుల రద్దీ పెరిగిపోవడంతో టోకెన్లు లేకుండానే నేరుగా క్యూలైన్లలోకి పంపించారు. త్వరలో దీన్ని క్రమబద్ధీకరించే […]

సర్వదర్శనం స్థానంలో త్వరలో టైమ్ స్లాట్ దర్శనాలు..
X

తిరుమలలో సర్వదర్శనాల స్థానంలో త్వరలో టైమ్ స్లాట్ దర్శనాలకు కసరత్తులు జరుగుతున్నాయి. ప్రస్తుతం దీనిపై అధ్యయనం జరుగుతోందని తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పాలకమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు.

కరోనా తర్వాత సర్వదర్శనాలకు కూడా ఆన్ లైన్ లో టైమ్ స్లాట్ కేటాయిస్తూ కొన్నిరోజులపాటు ప్రయోగాత్మక విధానం అమలు చేశారు. అయితే ఆ తర్వాత భక్తుల రద్దీ పెరిగిపోవడంతో టోకెన్లు లేకుండానే నేరుగా క్యూలైన్లలోకి పంపించారు. త్వరలో దీన్ని క్రమబద్ధీకరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇక ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలను భక్తుల సమక్షంలోనే నిర్వహించేందుకు పాలకమండలి నిర్ణయించింది. సెప్టెంబరు 27వ తేదీ నుండి అక్టోబరు 5 వరకూ తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు జరిపారు. ఈ ఏడాది భక్తుల సమక్షంలో గతంలో మాదిరిగానే ఉత్సవాలు జరపబోతున్నారు. సెప్టెంబరు 27న శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.

బంగారు తాపడం పనులకు ఆమోదం..

శ్రీవారి ఆనంద నిలయం గోపురానికి బంగారు తాపడం పనులకు టీటీడీ ఆమోదం తెలిపింది. ఆగమ పండితుల సలహాల మేరకు నెల రోజుల తరువాత పనులు ప్రారంభిస్తామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా వైభవోత్సవాలు నిర్వహించేందుకు కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుంచి 20వరకు నెల్లూరులో వైభవోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

ఇతర నిర్ణయాలు..

రూ. 7.32 కోట్లతో ఎస్వీ గోశాల పశుగ్రాసం కొనుగోలుకు ఆమోదం
రూ. 2.7 కోట్ల వ్యయంతో పాత పార్వేట మండపం స్ధానంలో‌ నూతన మండపం నిర్మాణం
రూ. 154 కోట్ల వ్యయంతో చిన్నపిల్లల ఆసుపత్రికి టెండర్లు ఖరారు
రూ. 18 లక్షల వ్యయంతో బేడి ఆంజనేయస్వామికి బంగారు కవచం
ప్రసాదాల తయారీకోసం ఆర్గానిక్ ముడిసరుకుల కొనుగోలుకు మార్క్ ఫెడ్ తో ఒప్పందం
ఆక్టోపస్ భవన నిర్మాణానికి అదనంగా రూ.7కోట్లు కేటాయింపు

ఇక చెన్నైలో రూ.6 కోట్లు, బెంగళూరులో రూ.3.23 కోట్ల విలువైన ఆస్తులు భక్తులు విరాళంగా అందించారని తెలిపారు టీటీడీ చైర్మన్. ఈ ఏడాది 33 లక్షల క్యాలెండర్లు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రతి నెల 2.1 లక్షల సప్తగిరి మాస పత్రికలను ముద్రణ చేస్తున్నామని తెలిపారు.

First Published:  11 July 2022 7:08 AM GMT
Next Story