Telugu Global
NEWS

కుట్రదారులకు అవకాశం లేకుండా జగన్‌కు శాశ్వత అధ్యక్ష పదవి..

రెండురోజుల వైసీపీ ప్లీనరీ ఘనంగా ముగిసింది. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ప్లీనరీకీ భారీగా నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్లీనరీ వేదికపై ప్రతిపక్షంపై ఘాటు విమర్శలు చేశారు నేతలు. రెండు రోజుల పార్టీ పండగలో కొత్త అంశాలు, ముఖ్యమైన విషయాలు రెండే రెండు. 1. పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా 2. వైసీపీకి శాశ్వత అధ్యక్షుడుగా సీఎం జగన్ ఎన్నిక విజయమ్మ రాజీనామాపై ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలందుకున్నాయి. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక చేయాల్సిన […]

కుట్రదారులకు అవకాశం లేకుండా జగన్‌కు శాశ్వత అధ్యక్ష పదవి..
X

రెండురోజుల వైసీపీ ప్లీనరీ ఘనంగా ముగిసింది. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా ప్లీనరీకీ భారీగా నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్లీనరీ వేదికపై ప్రతిపక్షంపై ఘాటు విమర్శలు చేశారు నేతలు. రెండు రోజుల పార్టీ పండగలో కొత్త అంశాలు, ముఖ్యమైన విషయాలు రెండే రెండు.

1. పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా
2. వైసీపీకి శాశ్వత అధ్యక్షుడుగా సీఎం జగన్ ఎన్నిక

విజయమ్మ రాజీనామాపై ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలందుకున్నాయి. జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ఎంపిక చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశాయి. ఈ విమర్శలకు అంతే ఘాటుగా బదులిచ్చారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అది పూర్తిగా పార్టీ వ్యవహారమని స్పష్టం చేశారు. మామ అవసాన దశలో ఉన్నప్పుడు నిర్దయగా పార్టీని లాగేసుకున్న చంద్రబాబుకి ఇలాంటి ఆరోపణలు చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు సజ్జల. చంద్రబాబు లాంటి కుట్రదారులకు అవకాశం లేకుండా ఉండేందుకే జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా చేసుకున్నామని చెప్పారు.

బాబులాంటి కుట్రదారులు ఉంటారని, ఉండాలని తాము కోరుకోవడంలేదని, కానీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరూ పార్టీని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకే పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేశామని, జగన్ ని పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా చేసుకున్నామని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ వల్లే ఈ పార్టీ ఉందని, జగన్ వల్లే పార్టీ పుట్టిందని, అందుకే ఆయన తమ పార్టీకి శాశ్వత అధ్యక్షుడని అన్నారు. ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవని చెప్పారు.

గుంటనక్కలు గుంపుగా వస్తున్నాయి..
జగన్ ని ఓడించే దురాశతో గుంటనక్కలన్నీ గుంపుగా వస్తున్నాయని, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్లీనరీ వేదికగా కార్యకర్తలకు పిలుపునిచ్చామని చెప్పారు సజ్జల. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2024లో అధికారం తమదేనన్నారు. కుప్పంలో చంద్రబాబుని ఓడించబోతున్నామని చెప్పారు. పవన్ కల్యాణ్ ని, చంద్రబాబుని వేర్వేరుగా తాము చూడటంలేదని, వారంతా ఒకటే ముఠా అని అన్నారు. దుష్టచతుష్టయం విషయంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, రెండేళ్లలో ఎన్నికలొస్తున్నాయి కాబట్టి ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని చెప్పారాయన. మొత్తమ్మీద సంచలన విషయాలేవీ లేకుండానే వైసీపీ ప్లీనరీ ముగిసింది.

First Published:  9 July 2022 10:26 AM GMT
Next Story