Telugu Global
NEWS

కోహ్లీ భవిష్యత్‌పై నీలినీడలు.. ఇంగ్లాండ్‌పై రాణిస్తేనే వరల్డ్ కప్ చాన్స్?

కోహ్లీ ముద్దు పేరు చీకూ. కానీ అభిమానులు మాత్రం రన్ మెషిన్ (పరుగుల యంత్రం) అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2008లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కోహ్లీ ఏనాడూ వెనుదిరిగి చూసుకోలేదు. వందకు పైగా టెస్టులు, 250కిపైగా వన్డేలు, దాదాపు 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. తన బ్యాటు నుంచి పరుగుల వరద పారించాడు. మూడేళ్ల క్రితం నాటికే టెస్టులు, వన్డేలు కలిపి 70 సెంచరీలు చేశాడు. కోహ్లీ చివరి సారిగా బంగ్లాదేశ్‌తో 2019 నవంబర్‌లో […]

కోహ్లీ భవిష్యత్‌పై నీలినీడలు.. ఇంగ్లాండ్‌పై రాణిస్తేనే వరల్డ్ కప్ చాన్స్?
X

కోహ్లీ ముద్దు పేరు చీకూ. కానీ అభిమానులు మాత్రం రన్ మెషిన్ (పరుగుల యంత్రం) అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2008లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కోహ్లీ ఏనాడూ వెనుదిరిగి చూసుకోలేదు. వందకు పైగా టెస్టులు, 250కిపైగా వన్డేలు, దాదాపు 100 టీ20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. తన బ్యాటు నుంచి పరుగుల వరద పారించాడు. మూడేళ్ల క్రితం నాటికే టెస్టులు, వన్డేలు కలిపి 70 సెంచరీలు చేశాడు. కోహ్లీ చివరి సారిగా బంగ్లాదేశ్‌తో 2019 నవంబర్‌లో జరిగిన టెస్టులో సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత రెండున్నర ఏళ్లలో ఏ ఒక్క ఫార్మాట్‌లోనూ సెంచరీ నమోదు చేయలేకపోయాడు.

2021లో ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లిన సమయంలో కూడా అతడు పేలవ ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో కెప్టెన్‌గా వన్డేల్లో చివరి మ్యాచ్, యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీ20ల్లో కెప్టెన్‌గా చివరి మ్యాచ్ ఆడేశాడు. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు ఓడిపోవడంతో టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి.. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని కోహ్లీ భావించాడు. కానీ గత కొన్ని మ్యాచ్‌లు పరిశీలిస్తే.. అతడు తన ఫామ్‌ను అందుకోలేకపోతున్నాడనే చెప్పవచ్చు. రెండున్నరేళ్లుగా సెంచరీ నమోదు చేయకపోవడంతో పాటు.. విన్నింగ్ ఇన్నింగ్స్ కూడా ఆడకపోవడంతో ఇప్పుడు కోహ్లీ భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

గత 24 టెస్టుల రికార్డులు పరిశీలిస్తే.. కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అదే సమయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 11 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు చేశాడు. కోహ్లీ టెస్టుల్లో 27 సెంచరీలు చేసిన సమయానికి.. రూట్ 17 సెంచరీలు మాత్రమే చేశాడు. కానీ ఇప్పుడు కోహ్లీని అధిగమించి 28 సెంచరీలతో నిలిచాడు. ఇటీవల ముగిసిన ఏకైక టెస్టులో కూడా కోహ్లీ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉన్నది.

తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. 2, 3వ టీ20లకు అందుబాటులో ఉంటాడు. అయితే త్వరలో వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే సిరీస్‌కు కోహ్లీని పూర్తిగా పక్కకు పెట్టారు. ఈ నిర్ణయమే అనుమానాలకు దారి తీస్తోంది. ఒకవైపు ఐపీఎల్ ద్వారా యువకులు టీమ్ ఇండియాలో స్థానం కోసం పోటీ పడుతున్నారు.

ఈ ఏడాది చివరిలో టీ20 వరల్డ్ కప్ జరుగనున్నది. ఈ క్రమంలో కోహ్లీని పూర్తిగా పక్కన పెట్టడంతో అతడి కెరీర్ ముగిసినట్లే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విండీస్‌తో జరుగనున్న టీ20 సిరీస్‌కు కోహ్లీ ఎంపిక చేయడం అనుమానమే అని బీసీసీఐ వర్గాలు కూడా అంటున్నాయి. అదే జరిగితే ఇంగ్లాండ్‌తో జరుగనున్న రెండు, మూడవ టీ20లే కోహ్లీకి ఆటగాడిగా ఆఖరు మ్యాచ్‌లా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

వరల్డ్ కప్ నేపథ్యంలో విండీస్‌తో జరిగే టీ20 సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం. ఆ సిరీస్‌లో రాణించే వారికే ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కుతుందని అంటున్నారు. అయితే, కోహ్లీకి అసలు విండీస్ పర్యటనలో అవకాశమే ఇవ్వలేదంటే.. సెలెక్టర్ల ఆలోచన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోహ్లీ లేకపోయినా మిడిల్ ఆర్డర్‌లో దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లు ఆ లోటు భర్తీ చేస్తున్నారు.

ఇటీవల వీళ్లు మంచి ఫామ్‌తో భారత జట్టును గెలిపిస్తున్నారు. దీంతో కోహ్లీ కూడా తన స్థానం కాపాడుకోవడానికి ఇంగ్లాండ్‌తో జరిగే సిరీసే కీలకం కానున్నది. అక్కడ రాణిస్తే అతడు వరల్డ్ కప్‌లో ఆడేందుకు అవకాశాలు మెరుగవుతాయి. అయితే ఆ రెండు మ్యాచ్‌ల తుది జట్టులో కోహ్లీకి చోటు దక్కుతుందా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొన్నది.

First Published:  7 July 2022 4:49 AM GMT
Next Story