Telugu Global
NEWS

మోదీజీ.. శరణు శరణు – మాజీ మంత్రి అయ్యన్న

ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. తెలంగాణలో బీజేపీ నేతలంతా టీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తే, మోదీ మాత్రం ఆ జోలికి పోలేదు. దీంతో కాంగ్రెస్ కి కోపమొచ్చింది. టీఆర్ఎస్ పై మోదీ ప్రేమ చాటుకున్నారని, మోదీ-కేసీఆర్ మధ్య స్నేహానికి ఇదే నిదర్శనం అని కొత్త లాజిక్ తీశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇక ఏపీ విషయానికొద్దాం.. ఏపీలో కూడా మోదీ ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ […]

మోదీజీ.. శరణు శరణు – మాజీ మంత్రి అయ్యన్న
X

ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. తెలంగాణలో బీజేపీ నేతలంతా టీఆర్ఎస్ పై విమర్శల దాడి చేస్తే, మోదీ మాత్రం ఆ జోలికి పోలేదు. దీంతో కాంగ్రెస్ కి కోపమొచ్చింది. టీఆర్ఎస్ పై మోదీ ప్రేమ చాటుకున్నారని, మోదీ-కేసీఆర్ మధ్య స్నేహానికి ఇదే నిదర్శనం అని కొత్త లాజిక్ తీశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.

ఇక ఏపీ విషయానికొద్దాం.. ఏపీలో కూడా మోదీ ఎక్కడా రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఇక్కడ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి కోపమొచ్చింది. ఏపీలో ఉన్న పరిస్థితులపై మోదీ ఎందుకు స్పందించలేదంటూ నిలదీస్తున్నారు టీడీపీ నేతలు. ఏపీలో జరుగుతున్న దోపిడీని మోదీ అడ్డుకోవాలన్నారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. ఏపీలో జరుగుతున్న ప్రతీకార రాజకీయాలను మోదీ పట్టించుకోవాలని చెప్పారు.

మాకు దిక్కెవరు..?
వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలు ప్రభుత్వంపై రకరకాల కేసులు వేశారు. తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసేవారు. అయితే ఎప్పుడూ వారు కేంద్రానికి ఫిర్యాదు చేయడం కానీ, రాష్ట్ర విషయాల్లో జోక్యం చేసుకోవాలని అనడం కానీ చేయలేదు.

తాజాగా అయ్యన్నపాత్రుడు మాత్రం మరో అడుగు ముందుకేసి, మోదీజీని శరణు కోరారు. ఏపీలో ఇంత జరుగుతున్నా మోదీ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రధాని సభకు స్థానిక ఎంపీ రాకుండా అడ్డుకున్న పరిస్థితి ఏపీలో ఉందని, ప్రధాని దాన్ని అడ్డుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు అయ్యన్న. పక్క రాష్ట్రంలో భారీ దోపిడీ జరుగుతుంటే ప్రధాని ప్రశ్నించారని, ఏపీలో దోపిడీని ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు. కనీసం రాష్ట్ర బీజేపీ నాయకులైనా మోదీకి ఏపీ పరిస్థితులు తెలియజేయాలని సూచించారు. ఆమేరకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు అయ్యన్న.

నా గోడ పడిపోయింది.. వారందరికీ థ్యాంక్స్..
తన ఇంటి ప్రహరీ గోడ కూల్చేసిన తర్వాత పెద్దగా మీడియాలో కనపడని అయ్యన్న.. తాజాగా ఓ వీడియో మెసేజ్ ద్వారా వెలుగులోకి వచ్చారు. గోడ కూల్చేసిన తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించి, తనకు సంఘీభావం తెలిపిన అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు అయ్యన్న.

ఏపీలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయని, అమ్మఒడిలో అవకతవకలు జరుగుతున్నాయని, ఆరోగ్యశ్రీ సరిగా అమలు కావడంలేదని, నాడు-నేడు అవినీతిమయంగా మారిందని విమర్శించారు. ఫైనల్ గా.. ఏపీ వ్యవహారాల్లో ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలని, వైసీపీని నిలువరించాలని శరణు కోరారు.

First Published:  5 July 2022 8:21 PM GMT
Next Story