Telugu Global
National

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ ను దెబ్బ‌తీసేందుకు బిజెపి స్కెచ్‌!

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో అడ్డ‌దోవ‌న అధికారం చేజిక్కించుకున్న బిజెపి వ‌చ్చే యేడాది జ‌ర‌గ‌నున్నఅసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టినుంచే వ్యూహాలు ర‌చిస్తోంది. 2018 ఎన్నిక‌ల్లో ఏకైక పెద్ద పార్టీగా అవ‌త‌రించిన కాంగ్రెస్ పార్టీ బిఎస్పీ ఇత‌ర పార్టీల‌తో క‌లిసి క‌మ‌ల‌నాథ్ నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయితే యువ‌నాయ‌కుడు జ్యోతిరాదిత్య సింధియా తో పాటు 24 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేయ‌డంతో క‌మ‌ల‌నాథ్ ప‌ద‌వినుంచి వైదాల‌గాల్సివ‌చ్చింది. దీంతో 2020లో శివ‌రాజ్ సింగ్ బిజెపి ముఖ్య‌మంత్రిగా కుర్చీలో కూర్చున్నారు. సింధియా […]

Congress
X

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో అడ్డ‌దోవ‌న అధికారం చేజిక్కించుకున్న బిజెపి వ‌చ్చే యేడాది జ‌ర‌గ‌నున్నఅసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టినుంచే వ్యూహాలు ర‌చిస్తోంది. 2018 ఎన్నిక‌ల్లో ఏకైక పెద్ద పార్టీగా అవ‌త‌రించిన కాంగ్రెస్ పార్టీ బిఎస్పీ ఇత‌ర పార్టీల‌తో క‌లిసి క‌మ‌ల‌నాథ్ నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయితే యువ‌నాయ‌కుడు జ్యోతిరాదిత్య సింధియా తో పాటు 24 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు రాజీనామా చేయ‌డంతో క‌మ‌ల‌నాథ్ ప‌ద‌వినుంచి వైదాల‌గాల్సివ‌చ్చింది. దీంతో 2020లో శివ‌రాజ్ సింగ్ బిజెపి ముఖ్య‌మంత్రిగా కుర్చీలో కూర్చున్నారు. సింధియా రాజీనామా వెన‌క బిజెపి ప్రోత్సాహం, హ‌మీలు ఉన్నాయ‌నే విష‌యం వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

చౌహాన్ పీఠం ఎక్కిన‌ప్ప‌టినుంచి కాంగ్రెస్ ను ఎలా దెబ్బ కొట్టాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో బ‌ల‌మైన నాయ‌కుల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకుఎన్నో ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా యేడాది స‌మ‌యం ఉన్నా నేటి నుంచి రాష్ట్రంలో జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల్లో సైతం కాంగ్రెస్ కు స్థానం లేకుండా చేయాల‌నే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. రాష్ట్రంలో బ‌ల‌మైన ఓబిసి నాయ‌కుడిగా ఉన్న అరుణ్ సుభాష్ యాద‌వ్ ను ఎలాగైనా పార్టీలోకి ర‌ప్పించాల‌ని నాలుగేళ్ళ‌గా చౌహాన్ ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నా ఆయ‌న మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడి రాలేదు. ఆఖ‌రికి స్థానిక ఎన్నిక‌ల‌కు ముందు కూడా యాద‌వ్ కు గాలం వేశారు. ” కాంగ్రెస్ లో ఉండి ఏం చేస్తావ్ అరుణ్ భాయ్‌..కాంగ్రెస్ లో ఉంటే ఏమొస్తుంది. అక్క‌డ అంతా క‌మ‌ల్ నాధ్ పెత్త‌న‌మే. ఆయ‌నే పార్టీ అధ్య‌క్షుడ‌వుతాడు.. ఆ త‌ర్వాత ఆయ‌నే ముఖ్య‌మంత్రి అవుతాడు. నీకేముంది. వ‌చ్చి బిజెపిలో చేరు” అంటూ బ‌హిరంగంగానే అరుణ సుభాష్ యాద‌వ్ ను చౌహాన్ ఆహ్వానించారు.

కంచుకోట‌ను తిరిగి చేజిక్కించుకునేందుకే..

ఇలా చౌహాను యాద‌వ్ ను ఆహ్వానించ‌డం వెన‌క రెండు వ్యూహాలు దాగున్నాయ‌ని బిజెపి వ‌ర్గాలు చెబుతున్నాయి. మొదటిది, రాష్ట్రంలోని నిమార్ ప్రాంతంలో యువ కాంగ్రెస్ నేత అరుణ్ సుభాష్ యాద‌వ్ బ‌లమైన నాయ‌కుడిగా ఉన్నారు. అందుక‌ని ఆ ప్రాంతంలో బిజెపి పునాదిని బలోపేతం చేయడం కాగా రెండవది, కాంగ్రెస్‌ను బలహీనపరచడమే ల‌క్ష్యం. ఖాండ్వా, ఖర్గోన్‌లతో కూడి ఉన్న నిమార్ ప్రాంతం ఒకప్పుడు బిజెపికి కంచుకోట‌గా ఉండేది. అయితే 2018లో ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు క‌మ‌ల‌నాథ్ పిసిసి అధ్య‌క్షుడిగా నియ‌మితులై పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డిపించారు. దాంతో 15యేళ్ళ‌ త‌ర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగ‌లిగింది. ఈ విజ‌యంలో యువ‌నాయ‌కుడు అరుణ్ యాద‌వ్ కృషి గ‌ణ‌నీయంగా ఉంది. అందుక‌నే యాద‌వ్ కు గాలం వేస్తున్నారు.

మధ్యప్రదేశ్ బిజెపి ఉపాధ్యక్షుడు జితు జిరాటి మాట్లాడుతూ, త‌మ పార్టీ యువత‌లోని ప్రతిభను, వారి శ్ర‌మ‌ను గౌర‌విస్తుంద‌ని అటువంటి యువ‌నాయ‌కుల‌ను ప్రోత్స‌హిస్తుద‌ని అన్నారు. ‘యాద‌వ్ 2014లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు క్షేత్ర స్థాయిలో ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశార‌ని అన్నారు. కానీ ఆయ‌న‌కు క‌మ‌ల‌నాథ్ ప్ర‌భుత్వంలో ఎటువంటి పాత్ర కానీ, రాజ్య‌స‌భ సీటు కానీ లేకుండా పోయింది. యాదవ్ లాంటి యువ నాయకుల ఆకాంక్షలను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించదు. కానీ బిజెపి క‌ష్ట్ప‌డి ప‌నిచేసే యువ‌నేత‌ల‌ను ఎంతో గౌర‌వించి ఆద‌రిస్తుంది” అంటూ యాద‌వ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఓబీసీ ఓట‌ర్లే ల‌క్ష్యంగా..
మధ్యప్రదేశ్‌ జనాభాలో 51 శాతం మంది ఓబిసీలు ఉన్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. వీరిలో యాద‌వ సామాజిక వ‌ర్గ ఓటర్లు దాదాపు 13 శాతం ఉన్నారు. అందుకే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, యాదవ్ వంటి బలమైన నాయకులను పార్టీలోకి ర‌ప్పించడం ద్వారా కాంగ్రెస్‌ను మరింత బలహీనపరచాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
మాజీ ఎంపీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్ యాదవ్ మరణించినప్పటి నుండి, బిజెపికి రాష్ట్రంలో యాదవ్ నాయకుడు లేరు. ” మధ్యప్రదేశ్ లో బిజెపి ముగ్గురు ఓబీసీల‌కి ముఖ్యమంత్రులుగా (చౌహాన్, ఉమాభారతి, బాబూలాల్ గౌర్) అవ‌కాశం ఇచ్చింది” అంటూ యాద‌వ్ కు ఆశ పెడుతున్నారు. కాంగ్రెస్ లో ఉంటే ఉప‌యోగం ఉండ‌ద‌ని సింధియా విష‌యంలో అనుస‌రించిన వ్యూహాన్నే యాద‌వ్ విష‌యంలో అమ‌లు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ముఖ్యంగా యాద‌వ్ వంటి బ‌ల‌మైన నాయ‌కుల‌ను పార్టీల‌కి ర‌ప్పించేందుకు బిజెపి గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తోంది.

బ‌ల‌మైన నాయ‌కుడు అరుణ్ యాద‌వ్‌..

యాదవ్ విద్యార్థి ద‌శ నుంచి రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు, కేంద్రంలో మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర సహాయ మంత్రి (2009-2011), 2014లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎదిగారు. 2018లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ఆయన క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసేవ్య‌క్తిగా యాద‌వ్ కు పేరుంది. అయినా త‌గిన గుర్తింపు రాలేద‌నే అసంతృప్తి ఉన్నా పార్టీకి న‌ష్టం క‌లిగించే ప‌నుల చేయ‌లేదు. బిజెపి నేత‌ల ఆహ్వానాన్ని యాద‌వ్ ఎంతో హుందాగా, సున్నితంగా తిర‌స్క‌రిస్తూ జ‌వాబిచ్చాడు. “ఒక సాధారణ కాంగ్రెస్ కార్యకర్తను గౌరవించినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్ నాకు, నా కుటుంబానికి కూడా అడగకుండానే ఎన్నో ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తిరిగి మేం అధికారంలోకి వస్తాం.”అని జ‌వాబిచ్చారు. అరుణ్ తండ్రి సుభాష్ యాద‌వ్ 1993-95 మ‌ధ్య ఉప‌ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు.

First Published:  6 July 2022 6:38 AM GMT
Next Story