Telugu Global
NEWS

కాంగ్రెస్ ని మింగేయాలనేది పీకే సూచన.. కేసీఆర్ ఆలోచన..

పశ్చిమబెంగాల్ లో గతంలో జీరోగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలా మారిందని, ఆ రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెస్ ని లేకుండా చేశారని.. తెలంగాణలో కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ పెద్దలను కలిసి తెలంగాణ తాజా పరిస్థితి వివరించారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని, బెంగాల్ లాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ ని లేకుండా చేయాలని వారు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అది […]

PK and KCR
X

పశ్చిమబెంగాల్ లో గతంలో జీరోగా ఉన్న బీజేపీ.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలా మారిందని, ఆ రాష్ట్రంలో వామపక్షాలు, కాంగ్రెస్ ని లేకుండా చేశారని.. తెలంగాణలో కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ పెద్దలను కలిసి తెలంగాణ తాజా పరిస్థితి వివరించారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని, బెంగాల్ లాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ ని లేకుండా చేయాలని వారు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అది పీకే సూచన కాగా, కేసీఆర్ దాన్ని ఆచరణలో పెట్టారన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పిన రేవంత్ రెడ్డి.. చేరికల వ్యవహారాన్ని సీనియర్ నేత కె.సి.వేణుగోపాల్ తో చర్చించామన్నారు. అయితే టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న నాయకులని ఆ పార్టీ ఇబ్బందులు పెడుతోందని చెప్పారు.

బీఆర్ఎస్ అసంభవం..
గతంలో కేసీఆర్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేశారని, రెండేస్తే ఆయనకు ఫ్రంటూ బ్యాకూ తెలియవని తాను అప్పుడే చెప్పానని, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అలాంటిదేనన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం కోసం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారన్నారు.

అభ్యర్థి ప్రకటనకు ముందు మమతా బెనర్జీ పెట్టిన మీటింగ్ కి కేసీఆర్ హాజరు కాకుండా విపక్షాల్లో అనైక్యత తీసుకొచ్చారని, తీరా ద్రౌపదీ ముర్ము పేరు ప్రకటించాక.. ఒడిశా, ఏపీ వంటి రాష్ట్రాలు ఆమెకు బేషరతుగా మద్దతిస్తున్నామని చెప్పాక, బీజేపీ అభ్యర్థి విజయం ఖాయమనుకున్న తర్వాతే.. యశ్వంత్ సిన్హాను కేసీఆర్ భుజాన మోస్తున్నారని, ఇదంతా మైండ్ గేమ్ అని వివరించారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికైనా ఒకటేనని, కేంద్రంలో బీజేపీకి, తెలంగాణలో టీఆర్ఎస్ కి ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనన్నారు రేవంత్ రెడ్డి.

విష్ణు విందు రాజకీయంపై క్లారిటీ..
పీజేఆర్ తనయుడు విష్ణువర్దన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాదని హైదరాబాద్ లో అసమ్మతి నేతలను విందుకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే హైకమాండ్ ఆదేశాలతో ఎవరూ ఆయన ఇంటికి వెళ్లలేదు. కేవలం కార్యకర్తల హడావిడి మాత్రమే కనిపించింది. దీనిపై కూడా రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. విష్ణు తనను కూడా విందుకు రమ్మని చెప్పారని, కానీ ఢిల్లీ పర్యటన వల్ల వెళ్లలేకపోయానని, హైదరాబాద్ లో త్వరలోనే ఆయన ఆధ్వర్యంలో భారీ సభ పెడతారని చెప్పారు రేవంత్ రెడ్డి.

పరేండ్ గ్రౌండ్స్ లో బలప్రదర్శన పెడతాం..
బీజేపీ ఇప్పటికే పరేడ్ గ్రౌండ్స్ లో బలప్రదర్శన పెట్టిందని, ఇప్పుడు కేసీఆర్ కి తాము సవాల్ విసురుతున్నామని, టీఆర్ఎస్ కూడా పరేడ్ గ్రౌండ్స్ లో సభ పెట్టాలని, ఆ తర్వాత కాంగ్రెస్ కూడా అక్కడ సభ పెడుతుందని అన్నారు రేవంత్ రెడ్డి. ఎవరి సభకు తెలంగాణ ఉద్యమ వీరులు వస్తారో, ఎవరి సభ ఎలా ఉంటుందో తేల్చుకుంటామని సవాల్ విసిరారు. ఇక జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం ముందు పంచాయితీ జరిగినట్టు తెలుస్తోంది. అంతా సద్దుమణిగినట్టేనని సమాచారం.

First Published:  5 July 2022 5:11 AM GMT
Next Story