Telugu Global
National

ఆధిప‌త్య పోరులో చిరిగిపోయిన ‘రెండాకులు’ !

త‌మిళ‌నాడులో అన్నాడిఎంకె వ‌ర్గ‌పోరులో ఆ పార్టీ ఎన్నిక‌ల చిహ్నం రెండాకులు చివ‌రికి చిరిగిపోయింది. ఈ నెల 9 వ తేదీన జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ల‌కు పార్టీ దూరం కానుంది. రాష్ట్రంలో గ్రామీణ‌,.ప‌ట్ట‌ణ‌ ప్రాంతాల్లో ఏర్ప‌డిన 510 స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో 39 స్థానాలకు పార్టీ సింబ‌ల్ పై జ‌రుగుతాయి. అన్నాడీఎంకేలో పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్‌) గ్రూపుల మధ్య నెలకొన్న వర్గ పోరు ఫలితంగా ఆ పార్టీ రెండాకుల […]

AIADMK
X

త‌మిళ‌నాడులో అన్నాడిఎంకె వ‌ర్గ‌పోరులో ఆ పార్టీ ఎన్నిక‌ల చిహ్నం రెండాకులు చివ‌రికి చిరిగిపోయింది. ఈ నెల 9 వ తేదీన జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఉప ఎన్నిక‌ల‌కు పార్టీ దూరం కానుంది. రాష్ట్రంలో గ్రామీణ‌,.ప‌ట్ట‌ణ‌ ప్రాంతాల్లో ఏర్ప‌డిన 510 స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో 39 స్థానాలకు పార్టీ సింబ‌ల్ పై జ‌రుగుతాయి.

అన్నాడీఎంకేలో పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌), ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్‌) గ్రూపుల మధ్య నెలకొన్న వర్గ పోరు ఫలితంగా ఆ పార్టీ రెండాకుల గుర్తు వివాదంగా మారింది. అందువల్ల, రెండు శిబిరాల మధ్య ఒక స్పష్టత వచ్చే వరకు దీనిని ఏ అభ్యర్థి ఉపయోగించలేరు. ఏఐఏడీఎంకే పార్టీ నిబంధ‌న‌ల ప్రకారం, పోటీదారునికి పార్టీ గుర్తును కేటాయించే అధికారం జనరల్ సెక్రటరీకి మాత్ర‌మే ఉంటుంది. అతను ఫారం-ఏ, బి-ఫారాల‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.

క్లిష్టమైన రాజకీయ పరిణామం
తమిళనాడులో ఎఐఎడిఎంకెకు, ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకెకు ప్రత్యామ్నాయంగా ఎద‌గాల‌ని బిజెపి అనుకుంటున్నతరుణంలో, 34 స్థానిక సంస్థల స్థానాలను కోల్పోవడం ఎఐఎడిఎంకెకు నష్ట‌మే. “ఎఐఎడిఎంకె చరిత్రలో ఒక నాయకుడు తాను అభ్య‌ర్ధుల ఫారం- ఎ, బి-ఫారాల‌పై సంతకం చేయనని చెప్పడం ఇదే మొదటిసారి.

పార్టీ త‌ర‌పున పోటీచేయాల‌నుకుంటున్న వారు తమకు ప్రియ‌మైన రెండు ఆకుల చిహ్నాన్ని కోల్పోవడం ఇదే మొదటిసారి. మా కార్యకర్తలు త్వరలో ఆ నాయకుడికి తగిన గుణపాఠం చెబుతారు, ”అని ఓపిఎస్ వ‌వ‌ర్గానికి చెందిన అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు జెసిటి ప్ర‌భాకర్ అన్నారు.

దీనిపై ఈపిఎస్ వ‌ర్గం స్పందిస్తూ ఈ వాదనను తోసిపుచ్చింది. ఈపిఎస్ వ‌ర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు సెమ్మలై మాట్లాడుతూ, ఈ ఉప ఎన్నికలకు పార్టీ అధికారికంగా ఎవరినీ అభ్యర్థిని ప్రకటించనందున, రెండు ఆకుల గుర్తును ఉపయోగించకూడదనే ప్ర‌శ్నే ఉత్ప‌న్నం కాద‌న్నారు. పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, స‌హ స‌మ‌న్వ‌య క‌ర్త ల మ‌ధ్య త‌లెత్తిన వివాదం వ‌ల్ల పార్టీ త‌ర‌పున అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌లేదు.

రెండు-ఆకుల చిహ్నం.. చ‌రిత్ర‌

రాబోయే ఉప ఎన్నికలు ఎఐఎడిఎంకే కు అంత ముఖ్య‌మైన అంశం కాక‌పోయినా భావోద్వేగాల‌తో ముడిప‌డిన అంశం. ఆ గుర్తుపై పోటీ చేసిన మొద‌టిసారి మంచి ఫ‌లితాలు రావ‌డంతో అది ఒక సెంటివ‌మెంటుగా మారింది. మ‌ద్య‌లో కొన్ని వివాదాలు నాయ‌కుల మ‌ద్య అంత‌రాలు ఏర్ప‌డినా చివ‌రికి అన్నా డిఎంకేయే రెండాకుల చిహ్నాన్ని కొన‌సాగించ‌గ‌లుగుతోంది. దాని చ‌రిత్ర వివ‌రాలు తెలుసుకుందాం.
1973 మే నెల 20 వ తేదీన దిండిగల్ నియోజకవర్గానికి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రకటించారు.

అప్ప‌టికి ఏడు నెలల వయసున్న అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎడిఎంకే) పార్టీ (ఇదే తరువాత ఏఐఏడీఎంకే గా మారింది) ఆ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. పార్టీ వ్యవస్థాపకుడు,అధినేత ఎంజి రామచంద్రన్ (ఎంజిఆర్‌) ఆ ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న న్యాయవాది కె మాయా తేవర్‌కు టిక్కెట్ ఇచ్చారు.

ఎన్నికల గుర్తు కోసం మాయ తేవర్ అప్ప‌టి మదురై జిల్లా కలెక్టర్‌ను సంప్రదించారు. జిల్లా యంత్రాంగం అతనికి 16 స్వతంత్ర చిహ్నాలను చూపించి, ఒకదాన్ని ఎంచుకోమని చెప్పింది. మాయ తేవర్ రెండు-ఆకుల చిహ్నాన్ని ఎంచుకున్నాడు. ఈ గుర్తు త‌ర్వాతి కాలంలో తమిళనాడులో ఎంత ప్రాచుర్యం పొందిందో తెలిసిందే.

“సూర్యుడి ముందు రెండు ఆకులు ఎండిపోతాయి” అని డిఎంకెకు చెందిన చాలా మంది నాయకులు ప్రచారం చేశౄరు. (‘ఉదయించే సూర్యుడు’ డీఎంకే చిహ్న) అయితే డీఎంకేను మూడో స్థానానికి నెట్టి మాయ తేవర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయం త‌రువాత సంవత్సరాల్లో అన్నాడీఎంకేకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.

రెండు ఆకులు గుర్తు ఎంజిఆర్ అనుచరులకు ఒక ఆరాధ‌న‌గా మారింది. ఆ త‌ర్వాత 1974లో కోయంబ‌త్తూరు కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో కూడా పార్టీ సి.అరంగ‌నాయ‌గం కు పార్టీ చిహ్నాన్ని కేటాయించింది. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిచి ఎంజిఆర్‌, ఆ త‌ర్వాత జ‌య‌ల‌లిత మంత్రి వ‌ర్గంలో విద్యా శాఖ మంత్రిగా ప‌నిచేశారు. ఎడిఎంకే నుంచి త‌మిళ‌నాడు అసెంబ్లీలో అడుగుపెట్టిన మొద‌టి ఎమ్మెల్యే గా పేరొందారు.

అయితే యాభై యేళ్ళ‌ త‌ర్వాత నేడు ఓపిఎస్‌, ఈపిఎస్ వ‌ర్గాల మ‌ద్య ఆధిప‌త్య‌పోరులో ‘రెండు ఆకులు’ ఎండిపోయే ముప్పును ఎదుర్కొంటోంది.
జ‌య‌ల‌లిత చేతికి రెండాకులు…

ఎంజిఆర్ భార్య జానకీ రామచంద్రన్‌తో గొడవ తర్వాత జయలలిత అన్నాడీఎంకే అధినేత్రి అయ్యారు. అప్పుడు మ‌దురై ఈస్ట్‌, ఆ త‌ర్వాత 1989 లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఆమెకు రెండు ఆకుల గుర్తు వచ్చింది. అప్ప‌డు కూడా మంచి ఫ‌లితాల‌నే పొందారు.

“జనవరి 1989 ఎన్నికలలో, జానకి వ‌ర్గానికి పావురాలను, జయలలిత బృందానికి కోడిపుంజు గుర్తుల‌ను కేటాయించారు. . పోటీ కారణంగా, రెండు వ‌ర్గాల సభ్యులు ప్ర‌త్య‌ర్ధి వ‌ర్గాల గుర్తులైన పావురాలు, కోళ్ళ‌ను చంపుకోవ‌డం మొద‌లు పెట్టారు. దీంతో ఇక‌పై పార్టీ గుర్తులుగా ఎలాంటి పక్షులు లేదా జంతువులను ఎంపిక చేయరాదని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఎన్నికల్లో రెండు గ్రూపులు ఓడిపోవడంతో జయలలితకు జాన‌కి మార్గం సుగ‌మం చేస్తూ త‌ప్పుకోవ‌డంతో ఎన్నికల సంఘం రెండాకుల గుర్తును జ‌య‌ల‌లిత‌కు కేటాయించింది. త‌దుప‌రి జ‌రిగిన ఉపఎన్నికల్లో పార్టీ గుర్తుగా దాని ప్ర‌భావం క‌నిపించింది. జ‌య‌లిలిత‌కు రెండు ఆకుల గుర్తుపై ఎంతో విశ్వాసం పెరిగింది.సెంటిమెంటుగా మారింది. అనంత‌రం కాలంలో 2014 లో లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎఐఎడిఎంకే ఒంట‌రిగా పోటీ చేసేంత న‌మ్మ‌కాన్ని ఆ గుర్తు తెచ్చి పెట్టింది.

రెండాకుల శ‌క్తి ఏంటంటే..

“1977 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంజీఆర్ ధరాపురం నియోజకవర్గం అభ్యర్థిగా అలంగియం బాలకృష్ణన్‌ని ప్రకటించారు. ఇదే నియోజకవర్గం నుంచి అయ్యసామి స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేశారు. పొరపాటున బాలకృష్ణన్‌కు బదులుగా అయ్యసామికి రెండాకుల గుర్తును, ఆయ‌న‌కు సింహం గుర్తును కేటాయించారు. దాంతో ఎంజీఆర్ సింహం గుర్తుకే ఓటు వేయాల‌ని, రెండాకుల గుర్తుకు ఓటు వేయ‌వ‌ద్ద‌ని ప్ర‌చారం చేయాల్సివ‌చ్చింది. అయినా, ఆ ఎన్నికల్లో అయ్యసామి గెలిచారు’’ అని ద్రావిడ రాజకీయాల చరిత్రకారుడు ఆర్ ముత్తుకుమార్ తెలిపారు. అంటే రెండాకుల గుర్తు ఎంజీఆర్ ను కూడా ఓడించ‌గ‌ల శ‌క్తి గ‌ల‌ద‌ని నిరూప‌ణ అయింద‌న్నారు.

చెన్నైలోని ఎంజిఆర్ స్మార‌క‌స్థ‌లిలో ముఖ‌ ద్వారం రెండు ఆకుల ఆకృతిలో క‌న‌బ‌డుతుంది. అప్ప‌టి ప్ర‌తిప‌క్షంలో ఉన్న డిఎంకె ఈ నిర్మాణం కోసం ప్ర‌భుత్వ నిధులు దుర్వినియోగ‌ప‌రుస్తున్నార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసింది. అయితే అది రెండు ఆకుల గుర్తు కాద‌ని జ‌య‌ల‌లిత వాదించినా ప్ర‌జ‌లు మాత్రం దానిని ఆ గుర్తుగానే చూస్తున్నారు.

First Published:  4 July 2022 12:43 AM GMT
Next Story