Telugu Global
NEWS

మోదీకి షాకింగ్.. హైదరాబాద్ లో ర్యాగింగ్

8 ఏళ్ల పాలనలో బహుశా ప్రధాని మోదీ ఈ స్థాయిలో ర్యాగింగ్ ఎక్కడా ఎదుర్కొని ఉండరు. హైదరాబాద్ పర్యటనలో, అందులోనూ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో మోదీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్న ఈ రోజుల్లో కూడా హోర్డింగ్ లు, ప్లకార్డ్ లు పట్టుకుని వీధుల్లో నిలబడే మనుషులకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అవును.. ఇప్పుడు హైదరాబాద్ లో మోదీని టార్గెట్ చేస్తూ వేసిన హోర్డింగ్ లు […]

narendra modi
X

8 ఏళ్ల పాలనలో బహుశా ప్రధాని మోదీ ఈ స్థాయిలో ర్యాగింగ్ ఎక్కడా ఎదుర్కొని ఉండరు. హైదరాబాద్ పర్యటనలో, అందులోనూ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో మోదీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉన్న ఈ రోజుల్లో కూడా హోర్డింగ్ లు, ప్లకార్డ్ లు పట్టుకుని వీధుల్లో నిలబడే మనుషులకు ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అవును.. ఇప్పుడు హైదరాబాద్ లో మోదీని టార్గెట్ చేస్తూ వేసిన హోర్డింగ్ లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

ఆ క్రియేటివిటీ లెవల్స్ అదుర్స్ అంటున్నారు, ఆ వ్యంగ్యాస్త్రాలు చూసి బీజేపీ నేతలే నవ్వుకుంటున్నారంటే ఆ సెటైర్ల డోస్ ఏ లెవల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అచ్చేదిన్..
బ్రిటానియా తయారు చేసే ‘గుడ్ డే’ బిస్కట్స్ మోదీకి చాలా ఇష్టం అంటూ హైదరాబాద్ లో ఓ హోర్డింగ్ పెట్టారు. గుడ్ డే ని హిందీలో అచ్చేదిన్ అంటారని, అందుకే ఆ బిస్కట్స్ అంటే మోదీకి బాగా ఇష్టమంటూ అందులో రాసుకొచ్చారు.

ఇక్కడ మోదీని నేరుగా విమర్శించలేదు కానీ, 8 ఏళ్లుగా అచ్చేదిన్ అంటున్న మోదీ ఇప్పటికీ అచ్చేదిన్ తేలేకపోయారనే సెటైర్ మాత్రం బాగా పేలింది. అచ్చేదిన్ అంటే జనాలకు అనుకున్నాం కానీ, మోదీ బిస్కెట్ల గురించి చెప్పారా అంటూ జోకులేస్తున్నారు నెటిజన్లు. వేర్ ఈస్ ద ‘గుడ్ డే’ అంటూ టీఆర్ఎస్ అభిమానులు ఈ బ్యానర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

మోసగాడు, మాయగాడు ఎన్.మోదీ..
బ్యాంకుల్ని మోసం చేసి విదేశాలకు పారిపోయిన మోసగాడు నీరవ్ మోదీ. ఈ నీరవ్ మోదీ పేరుని ఎన్.మోదీ అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లింకు చేస్తూ బ్యానర్లు పెట్టారు. దోపిడీ దొంగల్లాగా వేషం వేసుకుని ఉన్న వ్యక్తులు.. ‘మేం బ్యాంకుల్ని మాత్రమే దోచుకుంటాం మీరు దేశం మొత్తాన్ని దోచుకుంటున్నారు ఎన్.మోదీ’ అంటున్నట్టుగా బ్యానర్లు వేశారు. ఇప్పుడు అలాంటి ప్లకార్డులు పట్టుకుని దోపిడీ దొంగల్లా వేషం వేసుకున్న వ్యక్తుల్ని ఏకంగా రోడ్లపైకి వదిలారు.

వీరికి పేమెంట్ ఎవరిస్తారు, ఎవరు ఈ పని చేస్తున్నారనే విషయం పక్కనపెడితే.. హైదరాబాద్ లో ఈ బ్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఎల్ఐసీ ని కూడా ప్రైవేటు పరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తూర్పారబడుతూ.. హైదరాబాద్ లోని ఎల్ఐసీ ఆఫీస్ ముందు ప్లకార్డులు పట్టుకున్న ఇలాంటి వ్యక్తిని నిలబెట్టారు. వివిధ బ్యాంకుల ముందు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో కూడా ఇలాంటి వేషధారణలో ఉన్న వ్యక్తులు అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

సూటిగా.. సుత్తిలేకుండా..
కార్యవర్గ సమావేశాలకోసం వస్తున్న బీజేపీ నేతల్ని, ముఖ్యంగా మోదీకి చుక్కలు చూపిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణకు వస్తున్నందున.. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చూసి వెళ్లండి, మీమీ ప్రాంతాల్ని కూడా ఇలాగే అభివృద్ధి చేయండి అంటూ కేటీఆర్ సెటైరికల్ ట్వీట్లు పెడుతున్నారు, బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు.

ఇవి చాలదన్నట్టు.. హైదరాబాద్ రోడ్లపై కూడా మోదీని ర్యాగింగ్ చేస్తూ హోర్డింగ్ లు పెడుతున్నారు, దోపిడీ దొంగల వేషధారణలో ఉన్న వ్యక్తులకు ప్లకార్డులు ఇచ్చి బయట తిప్పుతున్నారు.

First Published:  2 July 2022 2:38 AM GMT
Next Story