Telugu Global
National

మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు ఏక్‌నాథ్ షిండే బల పరీక్ష

మహారాష్ట్ర నూతన సీఎం ఏక్‌నాథ్ షిండే రేపు అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. జూలై 2న సభలో ఫ్లోర్ టెస్ట్ ని ఎదుర్కోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ జారీ చేసిన ఆదేశాల మేరకు.. షిండే.. ఇందుకు సంసిద్ధులవుతున్నారు. శాసనసభను శనివారం ప్రత్యేకంగా సమావేశపరచాలని కూడా గవర్నర్ కోరారు. నిన్న సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగానే తమ తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి.. జూలై 2, 3 తేదీల్లో రాష్ట్ర […]

మహారాష్ట్ర అసెంబ్లీలో రేపు ఏక్‌నాథ్ షిండే బల పరీక్ష
X

మహారాష్ట్ర నూతన సీఎం ఏక్‌నాథ్ షిండే రేపు అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. జూలై 2న సభలో ఫ్లోర్ టెస్ట్ ని ఎదుర్కోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ జారీ చేసిన ఆదేశాల మేరకు.. షిండే.. ఇందుకు సంసిద్ధులవుతున్నారు.

శాసనసభను శనివారం ప్రత్యేకంగా సమావేశపరచాలని కూడా గవర్నర్ కోరారు. నిన్న సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగానే తమ తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి.. జూలై 2, 3 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీ స్పెషల్ సెషన్ కి పిలుపునివ్వాలని నిర్ణయించారు. సభలో ఫ్లోర్ టెస్ట్ ని ఎదుర్కోవడంతో పాటు కొత్త స్పీకర్ ని ఎన్నుకోవాలని కూడా తీర్మానించారు.

నిన్నటి రోజంతా మహారాష్ట్ర రాజకీయాలు ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగాయి. రాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేస్తారని ఉదయం నుంచే వార్తలు వస్తున్నా మధ్యాహ్నానికి సీన్ మారిపోయింది. కొత్త ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అని ఆయన ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాను నూతన ప్రభుత్వంలో చేరబోనని, కానీ బయటి నుంచి మద్దతునిచ్చి ఈ ప్రభుత్వం సజావుగా కొనసాగేట్టు చూస్తానని చెప్పారు. దీనికి ముందు కొంత తతంగం జరిగింది.

ఫ‌డ్న‌వీస్‌ డిప్యూటీ సీఎం కావాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందని బీజేపీ అధ్యక్షుడు జేపీ. నడ్డా ఫోన్ చేసి చెప్పగానే ఫడ్నవీస్ ఇందుకు అంగీకరించారు. కాగా అసెంబ్లీలో బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 288 మంది సభ్యులున్న సభలో తన మెజారిటీని నిరూపించుకోవాలంటే ఒక పార్టీకి లేదా కూటమికి 145 మంది సభ్యుల మద్దతు అవసరం.

విపక్షం నుంచి ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్ కి 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం, సమాజ్ వాదీ పార్టీల తరఫున చెరి ఇద్దరు సభ్యుల చొప్పున, రాజ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీకి 106 మంది సభ్యులు ఉన్నప్పటికీ షిండేని సీఎంని చేయాలని బీజేపీ నిర్ణయించిందని శివసేన ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ తెలిపారు. ఇది ఆ పార్టీ హృదయ విశాలతకు నిదర్శనమన్నారు.

ఫడ్నవీస్ కి ఉపముఖ్యమంత్రి పదవా ? పవార్ దిగ్భ్రాంతి
దేవేంద్ర ఫడ్నవీస్ కి ఉప ముఖ్యమంత్రి పదవినివ్వడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెబల్ సేన ఎమ్మెల్యేలను ఈ రాష్ట్రం నుంచి అస్సోంకి తరలించుకుపోయిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవిని మించి ఇవ్వరాదని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. కానీ బీజేపీ పోకడ విరుద్ధంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ నుంచో, నాగ పూర్ నుంచో వచ్చిన ఉత్తర్వుల ప్రకారం షిండేని సీఎంని చేసినట్టు ఉందన్నారు. ఒకప్పుడు సీఎంగా ఉన్న వ్యక్తి (ఫడ్నవీస్) ని ఉప ముఖ్యమంత్రిని చేయడం షాకింగ్ గా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. ఏమైనా.. మహా రాజకీయాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయంటే అది అంతా బీజేపీ పకడ్బందీ వ్యూహమేనని చెప్పక తప్పదు.. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ప్రయోజనమే పొందేందుకు ఈ పార్టీ ఇలా ఎత్తుగడ వేసింది. అదే ఏడాది ఇక్కడ కూడా ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి అని ఏకంగా రాష్ట్రాన్నే ‘కొల్లగొట్టవచ్చునన్నది’ కమలం పార్టీ యోచన..

First Published:  30 Jun 2022 9:56 PM GMT
Next Story