Telugu Global
National

రేపు కాదు.. 4 న మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే బలపరీక్ష

మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో ఈ నెల 4 న తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. మొదట రేపే బల పరీక్ష జరగాలని గవర్నర్ కోష్యారీ ఆదేశించినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా ఈ తేదీ మారింది. షిండే వచ్చే సోమవారం సభలో ఫ్లోర్ టెస్ట్ ని ఎదుర్కోనున్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని, రేపు స్పీకర్ ఎన్నికకు నామినేషన్ దాఖలు, 3 న ఎన్నికలు, 4న విశ్వాస పరీక్షపై […]

eknath shinde news
X

మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో ఈ నెల 4 న తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. మొదట రేపే బల పరీక్ష జరగాలని గవర్నర్ కోష్యారీ ఆదేశించినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా ఈ తేదీ మారింది.

షిండే వచ్చే సోమవారం సభలో ఫ్లోర్ టెస్ట్ ని ఎదుర్కోనున్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందని, రేపు స్పీకర్ ఎన్నికకు నామినేషన్ దాఖలు, 3 న ఎన్నికలు, 4న విశ్వాస పరీక్షపై ఓటింగ్ చేపడతారని తెలుస్తోంది.

కాగా-16 మంది సేన రెబెల్ ఎమ్మెల్యేలను సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని, దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న ‘ఉద్ధవ్ సేన’ పిటిషన్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జులై 11 న దీన్ని విచారిస్తామని స్పష్టం చేసింది.

ఈ ఎమ్మెల్యేలను సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన ఆదేశాలను కూడా ఉధ్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన తన పిటిషన్ లో ప్రస్తావించింది. అసెంబ్లీ సెషన్ లో ఈ 16 మంది ఎమ్మెల్యేలు పాల్గొనకుండా చూడాలని అభ్యర్థించింది. కానీ అత్యున్నత న్యాయస్థానం.. దీనిపై 11 వ తేదీనే విచారణ చేపడతామని పేర్కొనడంతో ఉద్ధవ్ శిబిరంలో నిరాశానిస్పృహలు ఆవరించగా .. .కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు షిండే వర్గానికి కొండంత ఊరటనిచ్చాయి.

39 మంది రెబెల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి, ఉద్ధవ్ సేన తాజా పిటిషన్

మొదట 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరిన శివసేన.. తాజాగా.. షిండే వెంట ఉన్న 39 మంది ఎమ్మెల్యేలనూ ఇలా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది.

ఉద్ధవ్ తరఫున కోర్టులో వాదిస్తున్న సీనియర్ లాయర్.. కపిల్ సిబల్… దీన్ని అర్జంటుగా విచారించాలని కోరగా.. తాము ఈ సమస్యను స్టడీ చేస్తున్నామని, కళ్లు మూసుకోలేదని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఏం జరుగుతుందో చూస్తున్నామని, ప్రొసీజర్ ఏమిటో పరిశీలించాలని, దీన్ని ఎలా వర్తింపజేయాలో చూడాల్సి ఉందని ఆయన అన్నారు.

మరోవైపు- తమను అనర్హులుగా చేసే ఏ చర్య అయినా చట్టవిరుద్ధమే అవుతుందంటూ రెబెల్ సభ్యులు కూడా సుప్రీంకోర్టుకెక్కారు. దీనిపై కోర్టు సోమవారం విచారించనుంది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.బి. పార్థివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్లను విచారిస్తోంది.

First Published:  1 July 2022 2:08 AM GMT
Next Story