Telugu Global
NEWS

ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలపై హైకోర్టు స్టే..

ఏపీలోని సినిమా థియేటర్లలో ఇకపై ఆన్ లైన్ ద్వారానే టికెట్ అమ్మకాలు జరగాలని, కౌంటర్లో కూడా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ ఉండాలని ఇటీవల ప్రభుత్వం జీవో 69ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APFDC)తో థియేటర్ల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ జీవో నేటినుంచి ఇంప్లిమెంట్ కావాల్సి ఉంది. కానీ థియేటర్ యాజమాన్యాలు ఒప్పందం చేసుకోడానికి ఇష్టపడలేదు. ఆన్ లైన్ టికెటింగ్ ద్వారా ప్రభుత్వమే గుత్తాధిపత్యం […]

ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలపై హైకోర్టు స్టే..
X

ఏపీలోని సినిమా థియేటర్లలో ఇకపై ఆన్ లైన్ ద్వారానే టికెట్ అమ్మకాలు జరగాలని, కౌంటర్లో కూడా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ ఉండాలని ఇటీవల ప్రభుత్వం జీవో 69ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (APFDC)తో థియేటర్ల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ జీవో నేటినుంచి ఇంప్లిమెంట్ కావాల్సి ఉంది. కానీ థియేటర్ యాజమాన్యాలు ఒప్పందం చేసుకోడానికి ఇష్టపడలేదు.

ఆన్ లైన్ టికెటింగ్ ద్వారా ప్రభుత్వమే గుత్తాధిపత్యం చెలాయించాలని చూస్తోందంటూ కోర్టుకెక్కారు కొంతమంది ఎగ్జిబిటర్లు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజునుంచి అమలు కావాల్సిన ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారంపై స్టే విధించింది. జీవో 69ని నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది.

గతంలో ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించడంతో థియేటర్ల ఓనర్లు, నిర్మాతలు లబోదిబోమన్నారు. ఆ తర్వాత భారీ బడ్జెట్ సినిమాలకు తొలి రెండువారాలు రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అది కూడా వర్కవుట్ కాలేదు. కరోనా వల్ల థియేటర్లకు రావడం తగ్గించేసిన ప్రేక్షకులు, ఓటీటీలతో కాలక్షేపం చేయడానికి అలవాటు పడ్డారు.

పెంచిన టికెట్ రేట్లు ప్రేక్షకుల్ని మరింతగా థియేటర్లకు దూరం చేశాయి. ఆ తర్వాత తాజాగా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారంతో మరో రచ్చ మొదలైంది. ఇప్పటి వరకూ బుక్ మై షో వంటి ఆన్ లైన్ వెబ్ సైట్లతో థియేటర్ల యాజమాన్యాలు ఒప్పందాలు కుదుర్చుకుని సర్వీస్ చార్జ్ తో కలిపి టికెట్లు అమ్ముతూ వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆ విషయంలో జోక్యం చేసుకోవాలనుకుంది.

కేవలం రెండు శాతం సెస్ తో ఆన్ లైన్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో టికెట్లు అమ్మేందుకు అధికారులు నిబంధనలు తయారు చేశారు. అంటే కౌంటర్లో అమ్మే టికెట్ రేటుపై 2 శాతం సెస్ విధిస్తుంది ప్రభుత్వం, ఆ తర్వాత బుక్ మై షో వంటి వెబ్ సైట్లు అదనంగా సర్వీస్ చార్జి వసూలు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

కానీ ప్రభుత్వ వెబ్ సైట్ లో తక్కువ రేటుకే టికెట్లు వస్తుంటే ఇక బుక్ మై షో వైపు ఎవరు చూస్తారు చెప్పండి. సదరు సంస్థతో థియేటర్ల యాజమాన్యాలు చేసుకున్న ఒప్పందాలు కూడా రద్దయ్యే అవకాశముంది. మరోవైపు ప్రభుత్వం టికెట్ డబ్బు వసూలు చేసి థియేటర్ల యాజమాన్యాలకు ఇస్తామంటోంది. దీనిపై కూడా అభ్యంతరాలున్నాయి.

ప్రభుత్వం తీసుకు రావాలనుకుంటున్న కొత్త విధానం తమకు గిట్టుబాటు కాదని ఎగ్జిబిటర్లు కోర్టుకెక్కారు. ఈ జీవోలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ బుక్‌ మై షో, మల్టీప్లెక్స్ థియేటర్ల అసోసియేషన్‌, విజయవాడ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్లు వేర్వేరుగా అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశాయి.

ఈ వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రస్తుతానికి జీవో నిలుపుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలపై స్టే విధించింది హైకోర్టు. తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది.

First Published:  1 July 2022 3:45 AM GMT
Next Story