Telugu Global
International

థాయిలాండ్‌లో పిల్లి నుంచి మనిషికి కరోనా

జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందా ..? దీనిపై అనేకమంది పరిశోధనలు చేశారు. సార్స్-కోవ్-2 గా వ్యవహరించే వైరస్ కోవిడ్-19 కి కారణమవుతుందని మొదట నిర్ధారించినప్పటికీ.. ఈ వైరస్ మనుషులకు, జంతువులకు మధ్య వ్యాప్తి చెందుతుందా అన్నదానిపై ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ప్రజలు ప్రేమగా పెంచుకునే కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులకు.. వారి నుంచి ఇది సోకుతుందని, ముఖ్యంగా కోవిడ్ తీవ్రంగా ఉన్న రోగులు వీటితో క్లోజ్ కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఈ వైరస్ […]

థాయిలాండ్‌లో పిల్లి నుంచి మనిషికి కరోనా
X

జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందా ..? దీనిపై అనేకమంది పరిశోధనలు చేశారు. సార్స్-కోవ్-2 గా వ్యవహరించే వైరస్ కోవిడ్-19 కి కారణమవుతుందని మొదట నిర్ధారించినప్పటికీ.. ఈ వైరస్ మనుషులకు, జంతువులకు మధ్య వ్యాప్తి చెందుతుందా అన్నదానిపై ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ప్రజలు ప్రేమగా పెంచుకునే కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులకు.. వారి నుంచి ఇది సోకుతుందని, ముఖ్యంగా కోవిడ్ తీవ్రంగా ఉన్న రోగులు వీటితో క్లోజ్ కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ త్వరగా వాటిపై ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి. అలాగే కొన్ని సందర్భాల్లో జంతువుల నుంచి కూడా మనుషులకు కోవిడ్ ముప్పు పొంచి ఉంటుందని అంటున్నవారూ లేకపోలేదు.

ఇప్పుడు థాయిలాండ్ లో ఇదే కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇలాంటిది బయటపడడం ఇదే మొట్టమొదటిసారి అట ! అక్కడి ప్రిన్స్ ఆఫ్ సాంగ్ క్లా యూనివర్సిటీ రీసెర్చర్ సరణ్యు ఛుస్రీ తన అధ్యయనంలో ఇదే వెల్లడించారు. పిల్లిని పెంచుకుంటున్న ఓ కుటుంబంలో పెద్దకు, అతని కొడుకుకు ఈ పిల్లి ద్వారా కోవిడ్ సోకిందని ఆయన తెలిపారు. అంటే అప్పటికే ఈ మార్జాలానికి సార్స్-కోవ్-2 వైరస్ సోకిందని ఆయన పేర్కొన్నాడు. పిల్లితో పాటు ఆ తండ్రీ కొడుకులిద్దరూ ఈ యూనివర్సిటీ ఆసుపత్రిలో (వేర్వేరుగానే) ఐసోలేషన్ లో ఉన్నారట.

నేచర్ అనే జర్నల్ లో ఈ ఉదంతానికి సంబంధించి ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ఈ అధ్యయనం ఆశ్చర్యకరంగా ఉందని, కానీ ఇలాంటి కేసులు మరిన్ని వెలుగులోకి రాలేదని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. పిల్లి నుంచి ఆ కుటుంబానికి సోకిన ఈ కోవిడ్ వ్యవహారం గత ఆగస్టులో జరిగినప్పటికీ తాజాగా ఇప్పుడే బయటపడింది.

పైగా ఆసుపత్రిలో ఈ పిల్లికి ఓ మహిళావెటర్నరీ సర్జన్ శ్వాబ్ టెస్ట్ చేస్తుండగా అది ఆమె ముఖంపై తుమ్మిందని, ఆ తుంపరలు ఆమె కళ్లపై పడిన కారణంగా ఆ సర్జన్ కూడా పాజిటివ్ కి గురైందట. మూడు రోజులకే ఆమె జ్వరం, దగ్గు, తలనొప్పి వంటి రుగ్మతలతో బాధ పడడంతో.. ఆమెకు కూడా పాజిటివ్ వచ్చిందని ఈ రీసెర్చర్ తెలిపారు. ఈ పిల్లి కారణంగా ఓ చిన్న కుటుంబం, ఓ మహిళా సర్జన్ కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. కానీ పిల్లికి శ్వాబ్ టెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న ఇతర డాక్టర్లకు ఎవరికీ ఈ వైరస్ సోకలేదట.

ఏమైనా.. జంతువుల నుంచి మనుషులు కరోనా బారిన పడట‌మన్నది అరుదని, వైరస్ ఇన్ఫెక్షన్ పిల్లుల వంటి జంతువులకు సోకినప్పటికీ అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని హాంకాంగ్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ లియో పూన్ స్పష్టం చేశారు. ఇన్ఫెక్షన్ ఉందని భావించిన పిల్లుల పట్ల అప్రమత్తంగా ఉండాలని లియో సూచించారు. కుక్కలు, కుందేళ్ళవంటివాటికీ ఇది సోకే అవకాశం ఉందన్నారు.

First Published:  30 Jun 2022 4:25 AM GMT
Next Story