Telugu Global
NEWS

ఫైవ్‌ స్టార్ హోటల్‌లో విచారించాలన్న రఘురామ

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారన్న కేసుల్లో రఘురామకృష్ణంరాజును విచారించేందుకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దేశద్రోహం సెక్షన్‌ మినహా ఇతర సెక్షన్ల కింద దర్యాప్తునకు సహకరించాల్సిందేనని రఘురామకృష్ణంరాజును కోర్టు ఆదేశించింది. ఏపీకి వెళ్తే సీఐడీ అధికారులు తనకు హాని తలపెట్టే ప్రమాదం ఉందని రఘురామ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ వేదికపై హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో విచారించాలని రఘురామ తరపు న్యాయవాది కోరగా.. సీఐడీ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో […]

ఫైవ్‌ స్టార్ హోటల్‌లో విచారించాలన్న రఘురామ
X

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారన్న కేసుల్లో రఘురామకృష్ణంరాజును విచారించేందుకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దేశద్రోహం సెక్షన్‌ మినహా ఇతర సెక్షన్ల కింద దర్యాప్తునకు సహకరించాల్సిందేనని రఘురామకృష్ణంరాజును కోర్టు ఆదేశించింది. ఏపీకి వెళ్తే సీఐడీ అధికారులు తనకు హాని తలపెట్టే ప్రమాదం ఉందని రఘురామ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణ వేదికపై హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

ఆన్‌లైన్‌లో విచారించాలని రఘురామ తరపు న్యాయవాది కోరగా.. సీఐడీ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఆన్‌లైన్ విధానంలో దర్యాప్తు దెబ్బతింటుందన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి విచారించడం కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్‌లో రఘురామను విచారించాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. అందుకు అవసరమైన ఖర్చును రఘురామకృష్ణంరాజే భరిస్తారని కోర్టుకు వివరించారు.

ఫైవ్‌ స్టార్ హోటల్ ప్రతిపాదనకు న్యాయమూర్తి అంగీకరించలేదు. ప్రైవేట్ స్థలంలో విచారణ సరికాదన్నారు. హైదరాబాద్‌లోని దిల్ కుషా గెస్ట్‌ హౌస్‌లో గానీ, మసాబ్ ట్యాంక్ పోలీస్ మెస్‌లో గానీ విచారణకు అభ్యంతరం లేదని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. దాంతో పోలీస్ మెస్ కంటే దిల్ కుషా గెస్ట్‌ హౌస్‌ మేలంటూ అక్కడే విచారించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న ఏబీఎన్‌, టీవీ5 ప్రతినిధులతో కలిపి రఘురామకృష్ణంరాజును విచారించాలనుకుంటే 15 రోజులు ముందుగా నోటీసులు ఇవ్వాలని కోర్టు చెప్పింది. రఘురామ ఎంపిక చేసుకున్న న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని, మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టు ఆదేశించింది. పిటిషనర్‌కు వై కేటగిరి భద్రత ఉన్న నేపథ్యంలో .. గది బయట భద్రతా సిబ్బంది ఉండేలా అనుమతి ఇవ్వాలని సీఐడీకి స్పష్టం చేసింది.

First Published:  29 Jun 2022 9:20 PM GMT
Next Story