Telugu Global
NEWS

సీఎం జగన్ కుమార్తెలు.. ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారో తెలుసా..?

తండ్రి ముఖ్యమంత్రి, తాత కూడా అప్పట్లో ముఖ్యమంత్రి. ఇలాంటి కుటుంబంలో పుట్టిన పిల్లలు ఎంత గారాబంగా పెరుగుతారు, ఎంత హంగు, ఆర్భాటాలతో ఉంటారో మనం ఊహించగలం. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అసలు వారిద్దరూ ఎక్కడుంటారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారనే విషయం అతి కొద్దిమంది కుటుంబ సన్నిహితులకు మినహా ఇంకెవరికీ తెలియదు. వారి చిన్నప్పటి ఫొటోలు ఇంటర్నెట్ లో దొరుకుతాయి కానీ, ఇప్పుడు వారు ఎలా ఉన్నారనే […]

సీఎం జగన్ కుమార్తెలు.. ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారో తెలుసా..?
X

తండ్రి ముఖ్యమంత్రి, తాత కూడా అప్పట్లో ముఖ్యమంత్రి. ఇలాంటి కుటుంబంలో పుట్టిన పిల్లలు ఎంత గారాబంగా పెరుగుతారు, ఎంత హంగు, ఆర్భాటాలతో ఉంటారో మనం ఊహించగలం. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుమార్తెలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం.

అసలు వారిద్దరూ ఎక్కడుంటారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారనే విషయం అతి కొద్దిమంది కుటుంబ సన్నిహితులకు మినహా ఇంకెవరికీ తెలియదు. వారి చిన్నప్పటి ఫొటోలు ఇంటర్నెట్ లో దొరుకుతాయి కానీ, ఇప్పుడు వారు ఎలా ఉన్నారనే విషయం ఎక్కడ వెదికినా కనిపించదు. అంత లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు జగన్ కుమార్తెలు.

కనీసం సోషల్ మీడియాలో కూడా ఎక్కడా వారి హడావిడి కనిపించదు. కారణం చదువు, చదువు, చదువు. వారికి చదువే లోకం, చదువే వారి ప్రపంచం. కుమార్తెలను కలిసేందుకు జగన్, ఆయన సతీమణి భారతి.. ఇప్పుడు ప్యారిస్ పయనమవుతున్నారు.

ఫ్రాన్స్ లోని ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ ఇన్సీడ్ నుంచి జగన్ పెద్ద కుమార్తె వైఎస్ హర్షా రెడ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వారి యూనివర్సిటీ కాన్వొకేషన్ జులై 2న జరుగుతుంది. జగన్ దంపతులు ప్యారిస్ లో జరిగే ఈ కాన్వొకేషన్ కి హాజరవుతున్నారు. తిరిగి జులై 3న వారు విజయవాడకు వస్తారు.

సీఎం జగన్ కు ఇద్దరు కుమారైలు. పెద్ద కుమార్తె పేరు హర్ష రెడ్డి, జగన్ అత్తమ్మ ఆమెకు హర్ష అని పేరు పెట్టారు. రెండో కుమార్తెకు అక్క పేరు కలిసొచ్చేలా వర్ష అని పెట్టుకున్నారు. ఇద్దరూ చిన్నప్పటినుంచి చురుకైనవారు. చదువంటే పంచ ప్రాణాలు.

తాత వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వీరిద్దరికీ మంచి చనువు ఉంది. వైఎస్ఆర్ ఎక్కడికెళ్ళినా పిల్లలకు మంచి మంచి పుస్తకాలు తెచ్చి ఇస్తుండేవారు. అలా వారికి పుస్తకాలపై ఆసక్తి, పుస్తక పఠనం అలవాటయ్యాయి.

పెద్దమ్మాయి హర్షా రెడ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాతవ ఫ్రాన్స్ లోని ఇన్సిడ్ బిజినెస్ స్కూల్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది హర్ష. చదువుకుంటూనే ఆమె జాబ్ సంపాదించింది. రెండో కుమార్తె వర్షా రెడ్డి అమెరికాలోని నొట్రా డామ్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుకుంటోంది.

తండ్రి జైలులో ఉన్నప్పుడు..
వైఎస్ఆర్ మరణం, ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో విభేదాలు, సొంత పార్టీ పెట్టడం, అక్రమాస్తుల కేసులు ఎదుర్కోవడం.. ఇలా జగన్ రాజకీయ ప్రస్థానంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కానీ ఆ కష్టాలేవీ తన బిడ్డలకు తెలియకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. బిడ్డలిద్దరూ ఆసమయంలో లండన్ లో చదువుకునేవారు.

జాతీయ మీడియాలో తండ్రి అరెస్టయ్యారన్న వార్తలు చూసి అప్పట్లో వారు భోరున విలపిస్తూ ఫోన్ చేసేవారు. కానీ వారిని ఇక్కడికి తెచ్చేందుకు కుటుంబ సభ్యులు ఇష్టపడలేదు.

జగన్ కూడా వారిని వారించి అక్కడే చదువుకోవాలని సూచించారు. తల్లి భారతి పిల్లల బాధ్యత తీసుకున్నారు. ఆమె గైడెన్స్ లోనే పిల్లలిద్దరూ తాము ఎంచుకున్న చదువు పూర్తి చేశారు. జగన్ జైలులో ఉన్న రోజుల్లో.. తల్లికి ఫోన్ చేసిన ప్రతి సారీ బిడ్డలు కన్నీరుమున్నీరయ్యేవారు. వారికి ధైర్యం చెప్పి హాస్టల్ లోనే ఉంచి చదివించేవారు భారతి.

ఇక జగన్ పాదయాత్ర సమయంలో సైతం వీరు లండన్ లోనే ఉన్నారు. తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం ఏ విషయం అయినా ఫోన్ లోనే మాట్లాడడం, సంతోషాలు, బాధలు అన్నింటికి దూరంగా ఉండడంతో.. సహజంగానే వీరు చదువుకి బాగా దగ్గరయ్యారు.

వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ.. రాసిన పుస్తకంలో మనవరాళ్లు హర్ష, వర్ష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాతతో వారికి ఎక్కువ చనువు ఉండేదని, వారికి 17 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వారిని తాత దగ్గరకు తీసుకొచ్చి కనీసం రెండేళ్లపాటయినా ఆయన దగ్గర పెంచాలని భారతి అనుకున్నారట. కానీ ఆ సమయం వచ్చే నాటికి వైఎస్ఆర్ మరణించారు. దీంతో పిల్లలిద్దరూ ఇంటికి దూరంగా విదేశాల్లోనే ఉండిపోయారు.

2019 ఎన్నికలో వైసీపీ విజయం సాధించిన తర్వాత లండన్ నుంచి పెద్ద కుమార్తె హర్ష సడన్ గా వచ్చి తండ్రి జగన్ ను ఆశ్చర్య పరిచారు. ముఖ్యమంత్రిగా తండ్రి ప్రమాణస్వీకారం రోజు కనపడిన హర్ష, వర్ష.. ఆ తర్వాత తిరిగి విదేశాలకు వెళ్లిపోయారు. ఇద్దరూ లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు.

ఎక్కడా ఆడంబరాలకు పోరు. కనీసం వీరి సోషల్ మీడియా ప్రొఫైల్స్ కూడా ఎక్కడా కనపడవు. వారి ప్రపంచం కేవలం చదువు మాత్రమే. అందుకే వారి చిన్నప్పటి ఫొటోలు ఎవరివద్దయినా ఉంటాయి కానీ, పెద్దయిన తర్వాత కనీసం వారి ఫొటోలు కూడా బయట కనిపించేవి కావు.

నిద్ర లేస్తే సెల్ఫీ, బ్రష్ చేస్తూ సెల్ఫీ, డ్రైవింగ్ చేస్తూ సెల్ఫీ.. ఇలా సెల్ఫీల మోజులో, సోషల్ మీడియాలో యువత కాలం గడుపుతున్న ఈ రోజుల్లో.. ఇలాంటి కుమార్తెలు ఉండటం నిజంగా జగన్ అదృష్టం అని అంటుంటారు వారి కుటుంబ సభ్యులు. హర్ష, వర్ష వల్ల జగన్ కి మంచి పేరొస్తుందని చెబుతుంటారు.

First Published:  28 Jun 2022 6:12 AM GMT
Next Story