Telugu Global
NEWS

ఆ సన్నాసులు అమ్ముడుపోయారు.. ఇకపై అలా జరగదు -రేవంత్ రెడ్డి

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12మంది కాంగ్రెస్ నేతలు పార్టీ ఫిరాయించడం అప్పట్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత కాంగ్రెస్ బలహీనపడిందని అనుకున్నా.. రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కార్యకర్తలు, నేతల్లో జోష్ మొదలైంది. అసంతృప్తులు ఉన్నా కూడా.. అందర్నీ కలుపుకొని వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్ అయినా.. తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బలపడుతున్న బీజేపీపై కూడా రేవంత్ ఫోకస్ పెంచారు. ఇటీవల పార్టీలో చేరికలతో సందడి […]

ఆ సన్నాసులు అమ్ముడుపోయారు.. ఇకపై అలా జరగదు -రేవంత్ రెడ్డి
X

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12మంది కాంగ్రెస్ నేతలు పార్టీ ఫిరాయించడం అప్పట్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత కాంగ్రెస్ బలహీనపడిందని అనుకున్నా.. రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కార్యకర్తలు, నేతల్లో జోష్ మొదలైంది. అసంతృప్తులు ఉన్నా కూడా.. అందర్నీ కలుపుకొని వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

ప్రధాన ప్రత్యర్థి టీఆర్ఎస్ అయినా.. తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బలపడుతున్న బీజేపీపై కూడా రేవంత్ ఫోకస్ పెంచారు. ఇటీవల పార్టీలో చేరికలతో సందడి నెలకొంది. తాజాగా ఖమ్మం జిల్లా నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖమ్మం నుంచి గతంలో గెలిచిన సన్నాసులు అమ్ముడుపోయారని, ఇకపై అలా జరగదని చెప్పారు రేవంత్ రెడ్డి.

మోదీ-కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యుద్ధంలో తమకు మద్దతుగా చాలామంది కలసి వస్తున్నారని, చేరికలతో పార్టీ బలపడుతోందని చెప్పారాయన. నాలుగు రోజులుగా జరుగుతున్న వరుస చేరికలే కాంగ్రెస్ బలం పెరుగుతోందనడానికి నిదర్శనం అని అన్నారు. మోదీ-కేసీఆర్.. ఒకరినొకరు విలన్‌ లుగా చిత్రీకరించుకుని జనాల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై తిరుగుబాటు మొదలు పెట్టిందే ఖమ్మం రైతులని, వారికి బేడీలు వేసి జైలుకి పంపించారని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ప్రభుత్వం పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖమ్మం ఖిల్లా మనదే..
గతంలో ఖమ్మం నుంచి గెలిచిన సన్నాసులు అమ్ముడుపోయారని, 2023 ఎన్నికల్లో ఖమ్మం ఖిల్లాపై మూడు రంగుల‌ జెండా ఎగురుతుందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఖమ్మం కాంగ్రెస్ కి కంచుకోట అని గుర్తుచేశారు. మంత్రి పువ్వాడ పేరు చెప్పి మరీ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. కేసు పెట్టి మంత్రి పదవి ఊడగొట్టాల్సింది పోయి, టీఆర్ఎస్ అధిష్టానం పువ్వాడను పక్కనపెట్టుకుందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్‌ కి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు డిక్లరేషన్ అమలు చేసి తీరతామన్నారు రేవంత్ రెడ్డి. ధరణి పోర్టల్ తో ఊరంతా గొడవలేనని, ఈ గొడవల వల్లే హైదరాబాద్ లో హత్యలు జరుగుతున్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు.

First Published:  27 Jun 2022 9:21 PM GMT
Next Story