Telugu Global
NEWS

ఆలూలేదు చూలూ లేదు… ముఖ్యమంత్రి ఎవరని కొట్లాట.. గ్రూపులు కట్టి సై అంటున్న బీజేపీ నాయకులు

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్ దక్కించుకోగల‌ అభ్యర్థులు కూడా లేరు. చాలా గ్రామాల్లో బీజేపీకి కార్యకర్తలు కూడా లేరు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి పీఠం కోసం తన్నులాడుకుంటున్నారు. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా తెలంగాణ బీజేపీలోని గ్రూపిజం మరో సారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గం, […]

ఆలూలేదు చూలూ లేదు… ముఖ్యమంత్రి ఎవరని కొట్లాట.. గ్రూపులు కట్టి సై అంటున్న బీజేపీ నాయకులు
X

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని సర్వేలు ఘోషిస్తున్నాయి. మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్ దక్కించుకోగల‌ అభ్యర్థులు కూడా లేరు. చాలా గ్రామాల్లో బీజేపీకి కార్యకర్తలు కూడా లేరు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి పీఠం కోసం తన్నులాడుకుంటున్నారు.

18 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా తెలంగాణ బీజేపీలోని గ్రూపిజం మరో సారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గం, బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ప్రకటించడం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యతిరేక వర్గానికి షాకిచ్చింది.

ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా తదితరులంతా పాల్గొనే పార్టీ అత్యున్నత విధాన నిర్ణయ‌ సమావేశానికి హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకోవాలని సంజయ్ చేసిన అభ్యర్థనకు కేంద్ర నాయకత్వం అంగీకరించడం పార్టీలోని పలువురిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం. బండి సంజయ్ కి కేంద్ర నాయకత్వం మద్దతుగా ఉందన్న పలువురు నేతల వాదనకు ఈ ప్రకటన బలం చేకూర్చింది. హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకోవడం రాష్ట్ర బిజెపి విభాగానికి గొప్ప వార్త అయినప్పటికీ, ఇది సీనియర్ నాయకుల మధ్య గ్రూపు పోటీని మరింత తీవ్రతరం చేసింది. పార్టీ అధిష్టానం పెద్దఎత్తున నిర్వహించాలనుకున్న బహిరంగ సభ జన సమీకరణకు కూడా గట్టి పోటీ నెలకొంది.

అన్ని పార్టీలలో విభేదాలు, ఘర్షణలు సర్వసాధారణం అయితే, కాషాయ పార్టీ తెలంగాణ యూనిట్ కూడా దానికి మినహాయింపు కాదని రుజువు చేస్తున్నది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించి (ముందస్తు ఎన్నికల ఊహాగానాల మధ్య), సీనియర్ నాయకులు తమ వ్యక్తిగత సామర్థ్యాలను ప్రదర్శించడానికి, కేంద్ర నాయకత్వం మద్దతు పొంద‌డానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. “తమను తాము ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రదర్శించడమే వారి లక్ష్యం” అని ఒక బీజేపీ నాయకుడి మాట‌.

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ చీఫ్‌ బండి సంజయ్‌లు రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానం కోసం తీవ్రంగా పోటీ పడుతుండగా, కొత్తగా ఈటల రాజేందర్ ఆ పోటీలో చేరారు. “ కిషన్ రెడ్డి ఆ స్థానానికి తాను సరిపోతాన‌ని నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బండి సంజయ్ తన కృషి, పనితీరు కారణంగా ఎదగగలిగినప్పటికీ, కిషన్ రెడ్డితో పోల్చుకుంటే స్థాయి బాగా తగ్గినట్లు అనిపిస్తుంది ”అని ఆ నాయకుడు అభిప్రాయపడ్డాడు.

మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్‌ నేత జితేందర్‌ రెడ్డి, కిషన్‌రెడ్డి పక్షాన ఉన్న సంగతి తెలిసిందే. కాగా, కిషన్ రెడ్డి శిబిరంలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బలమైన శక్తిగా భావిస్తున్నారు. అయితే డీకే అరుణ మాత్రం గోడమీద పిల్లిలా ఉందని, బలం ఎటు ఉ‍ంటే ఆమె అటువైపు వెళ్తుందని ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. .

ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో రెడ్డి వర్సెస్ నాన్ రెడ్డి అనేది ప్రధానంగా ఉంది. రెడ్డియేతర శిబిరంలో బండి సంజయ్‌కు ఈటల రాజేందర్ పోటీదారుగా అవతరించారు. కేసీఆర్ కేబినెట్‌లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ భూకబ్జా ఆరోపణలతో కేబినెట్‌ నుంచి అనూహ్యంగా ఉద్వాసనకు గురై బీజేపీలో చేరి హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనకు సంజయ్ కన్నా ఎక్కువ అర్హత ఉందని ఈటల ఎప్పటి నుంచో భావిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. “ఈటలకు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండగా, బండి సంజయ్‌కు ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది” అని పార్టీకి చెందిన‌ ఓ నాయకుడు ఆరోపించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈటల ఆకస్మికంగా భేటీ కావడం పలు ఊహాగానాలకు దారితీసింది. ఈటలకు పార్టీలో తన రాజకీయ భవిష్యత్తుపై భరోసా ఇచ్చారని పార్టీ అంతర్గత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకునేందుకు బండి సంజయ్‌తో పోరులో కిషన్‌రెడ్డి ఈటలకు మద్దతు ఇస్తున్నారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. “కిషన్ రెడ్డి.. ఈటల , బండి సంజయ్ ఇద్దరి భుజాల మీద తుపాకీ పెట్టి షూట్ చేస్తున్నారు. అతను తరచుగా ఈటల అగ్నికి ఆజ్యం పోసేవాడు, ”అని పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు వెల్లడించారు. ఏదేమైనా ప్రస్తుతం కిషన్‌రెడ్డికి, ఈటల రాజేందర్‌కు బండి సంజయ్‌ ఉమ్మడి శత్రువు.

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఇటీవల ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పార్టీ ఎంపిక చేసిన డాక్టర్ కే లక్ష్మణ్ ఇప్పుడు సంతోషంగా ఉన్నారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి వరకు, అతను తెలంగాణ బిజెపి చీఫ్‌గా తన స్థానంలోకి వచ్చిన బండి సంజయ్‌కి కూడా పెద్దగా అనుకూలంగా లేడు.

ఈ అంశాలన్నీ కాషాయం పార్టీలోని గ్రూపిజాన్ని వెల్లడి చేస్తుండగా, అంతా బాగానే ఉందన్న విశ్వాసాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. “చిన్నచిన్న‌ అంతర్గత విభేదాలు ఉండవచ్చు, కానీ బిజెపి విభేదాలు, ముఠాలకు అవకాశం ఇవ్వని పార్టీ కాబట్టి దీని వల్ల జరిగే నష్టమేం లేదు” అని బిజెపి నాయకుడు ఒకరు అన్నారు.

ఆలూ లేదూ చూలూ లేదు …అన్నట్టు తెలంగాణలో బీజేపీ బలమే అంతంత మాత్రంగా ఉంది. కొన్ని ఎన్నికల్లో గెలిచిన వాపును చూసి బలుపు అనుకోవడంతోనే ఆ పార్టీ నాయకులకు అసలు చిక్కు వచ్చిపడింది. ముందు అన్ని స్థానాల్లో డిపాజిట్లు తేగల నాయకులను వెతుక్కోగలిగితే ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అని కొట్లాడుకోవచ్చు అని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు.

First Published:  25 Jun 2022 9:52 PM GMT
Next Story