Telugu Global
NEWS

కొల్లాపూర్‌లో ఫుల్ టెన్షన్.. జూపల్లి వర్సెస్ బీరం మాటల యుద్ధం

టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత కొంత కాలంగా టీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కోల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి మధ్య మాటల యుద్దం జరుగుతోంది. నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ది విషయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. గత కొంత కాలంగా ఉన్న ఈ విభేదాలు శనివారం నాటికి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కొల్లాపూర్ అభివృద్ది, […]

కొల్లాపూర్‌లో ఫుల్ టెన్షన్.. జూపల్లి వర్సెస్ బీరం మాటల యుద్ధం
X

టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత కొంత కాలంగా టీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కోల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి మధ్య మాటల యుద్దం జరుగుతోంది.

నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ది విషయంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకున్నారు. గత కొంత కాలంగా ఉన్న ఈ విభేదాలు శనివారం నాటికి తీవ్రస్థాయికి చేరుకున్నాయి.

కొల్లాపూర్ అభివృద్ది, అవినీతి విషయంలో గులాబీ పార్టీ నేతలిద్దరూ ఓపెన్ ఛాలెంజ్ అంటూ బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. ఆదివారం (జూన్ 26) దీనిపై చర్చించుకుందాం, పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని ఒకరికొరకు సవాలు చేసుకున్నారు.

దీంతో శనివారం రాత్రే ఇద్దరు నేతలు హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ చేరుకున్నారు. ఇరువురు నేతల అనుచరులు కూడా భారీగా పట్టణంలోని నాయకుల ఇండ్ల వద్దకు వచ్చారు. ముందుగా అప్రమత్తమైన పోలీసులు రాత్రే ఇద్దరు నేతలను హౌస్ అరెస్టు చేశారు. అంతే కాకుండా ఎమ్మెల్యే హర్షవర్దన్ ఇంటి వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా జూపల్లి కృష్ణారావు పని చేశారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసినా.. కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బీరం కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పొడసూపాయి.

సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన జూపల్లి కృష్ణారెడ్డి నియోజకవర్గంలో తన ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. అదే సమయంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కూడా తన చేతిలోనే నియోజకవర్గం ఉండాలని భావించారు. ఇది ఇరువురి మధ్య విభేదాలకు కారణమైంది.

టీఆర్ఎస్ పార్టీ కూడా జూపల్లిని కొంత కాలం పక్కన పెట్టడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోయారు. పార్టీలో అసమ్మతి గళం వినిపించి కొంత కాలం క్రితం ఖమ్మం వెళ్లి అక్కడి అసంతృప్త నేతలతో సమావేశం అయ్యారు. కొల్లాపూర్‌లో కూడా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ మారతాననేలా సంకేతాలు ఇచ్చారు.

ఇటీవల నిర్వహించిన పార్టీ ప్లీనరీకి కూడా జూపల్లి హాజరుకాలేదు. కీలకమైన, సీనియర్ నేత పార్టీకి దూరమైతే ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించి మంత్రి కేటీఆర్ స్వయంగా జూపల్లి వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. జూపల్లి, బీరం మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నంచేశారు. కేటీఆర్ టూర్ తర్వాత పరిస్థితి చక్కబడుతుందని అందరూ భావించారు. కానీ ఎప్పటిలాగే మళ్లీ ఇద్దరి మధ్య మాటల యుద్ద మొదలైంది.

ఎమ్మెల్యే బీరంకు తనకు మధ్య జరుగుతున్న మాటల యుద్దానికి, మంత్రి కేటీఆర్‌కు సంబంధం లేదని జూపల్లి స్పష్టం చేశారు. ఏదైనా ఉంటే అంబేద్కర్ విగ్రహం వద్దే ఎమ్మెల్యేతో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. కావాలనే తన ఇమేజ్‌ను ఎమ్మెల్యే డ్యామేజ్ చేస్తుంటే చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోనని జూపల్లి హెచ్చరించారు. బీరంతో జరుగుతున్న విషయంపై ఎంత వరకు వెళ్లడానికైనా సిద్దమేనని ఆయన అన్నారు.

ఇరువురి నేతల విభేదాలతో ప్రస్తుతం కొల్లాపూర్‌లో హైటెన్షన్ నెలకొన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు ఆందోళనగా ఉన్నారు. ఒకే పార్టీకి చెందిన నేతలు బహిరంగంగానే విభేదాలతో తలపడుతున్నా.. టీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ప్రస్తుతం మౌనంగా ఉన్నది. ఇద్దరినీ కేసీఆర్ పిలిపించుకుకొని మాట్లాడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

First Published:  26 Jun 2022 12:29 AM GMT
Next Story