Telugu Global
National

ఇంట్లో విజిలెన్స్ తనిఖీలు జరుగుతుండగా.. ఐఏఎస్ అధికారి కొడుకు ఆత్మహత్య

తండ్రి ఒక ఐఏఎస్ అధికారి. ఒక అవినీతి కేసులో విజిలెన్స్ అధికారులు ఐఏఎస్ అధికారి ఇంటిలో తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో ఫస్ట్ ఫ్లోర్‌లో సదరు అధికారి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన సంఘటన పంజాబ్‌ రాజధాని చండీఘర్‌లో చోటు చేసుకుంది. విజిలెన్స్ అధికారులే తమ కుమారుడిని కాల్చి చంపారని కుటుంబ సభ్యులు వాదిస్తుంటే.. అతడే గన్‌తో తనను తాను కాల్చుకున్నాడని అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి […]

ఇంట్లో విజిలెన్స్ తనిఖీలు జరుగుతుండగా.. ఐఏఎస్ అధికారి కొడుకు ఆత్మహత్య
X

తండ్రి ఒక ఐఏఎస్ అధికారి. ఒక అవినీతి కేసులో విజిలెన్స్ అధికారులు ఐఏఎస్ అధికారి ఇంటిలో తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో ఫస్ట్ ఫ్లోర్‌లో సదరు అధికారి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన సంఘటన పంజాబ్‌ రాజధాని చండీఘర్‌లో చోటు చేసుకుంది. విజిలెన్స్ అధికారులే తమ కుమారుడిని కాల్చి చంపారని కుటుంబ సభ్యులు వాదిస్తుంటే.. అతడే గన్‌తో తనను తాను కాల్చుకున్నాడని అధికారులు చెప్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్లీ ప్రస్తుతం పెన్షన్స్ శాఖ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన గతంలో పంజాబ్ సీవరేజ్ బోర్డు సీఈవోగా పనిచేస్తున్న సమయంలో ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంజయ్ కుమార్ అనే వ్యక్తి దిఖాదల కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నవాన్ షహర్ ప్రాంతంలో ఒక మురుగు పైప్ లైన్ వేసేందుకు కాంట్రాక్ట్ ఇవ్వాలంటే 1 శాతం కమీషన్ ఇవ్వాలని సంజయ్ పోప్లీ ఐఏఎస్ డిమాండ్ చేసినట్లు యాంటీ కరప్షన్ హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చేశాడు.

సంజయ్ కుమార్ తన నుంచి ఎలా లంచం ఆశిస్తున్నరో వివరిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. దీంతో పోప్లీని అక్కడి నుంచి పెన్షన్స్ శాఖకు బదిలీ చేసి దర్యాప్తున‌కు ఆదేశించారు. ఈ క్రమంలో సంజయ్ సీవరేజ్ అసిస్టెంట్ సెక్రటరీ సందీప్ వాట్స్‌పైన కూడా ఆరోపణలు చేశారు. బదిలీ అయిన తర్వాత కూడా పోప్లీ తన రెండో ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో జూన్ 20న‌ అరెస్టయిన సంజయ్ పోప్లీని వెంట బెట్టుకొని శనివారం అతడి ఇంట్లో సోదాలు చేయడానికి విజిలెన్స్ అధికారులు వెళ్లారు. అదే సమయంలో పోప్లీ కుమారుడు కార్తీక్ పోప్లీ మొదటి అంతస్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. సంజయ్ ఇంటి నుంచి గన్ కాల్పుల శబ్ధం వినిపించినట్లు ఇరుగు పొరుగువారు చెప్పారు. కాల్పులు జరిగిన వెంటనే విజిలెన్స్ అధికారులే కార్తీక్‌ను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు తీసుకొని వెళ్లారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

కార్తీక్ మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంజయ్ పోప్లీని మొహలీ విజిలెన్స్ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు విజిలెన్స్ అధికారులకు అతడి ఇంటిలో భారీగా గన్ కాట్రిడ్జెస్ లభించాయి. దీంతో ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్టార్ 11 పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

First Published:  25 Jun 2022 9:07 AM GMT
Next Story