Telugu Global
National

పోలియో వైరస్‌లో కొత్త వేరియంట్.. పిల్లలు జర జాగ్రత్త

పోలియో ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక వైరస్. చిన్నారుల్లో అపరిశుభ్ర ఆహారం, నీటి ద్వారా చేరి.. చివరకు నాడీ మండలాన్ని ప్రభావితం చేసి.. వాళ్లను దివ్యాంగులుగా మార్చేసే భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది దివ్యాంగులుగా మారిపోయి జీవితంలో దుర్భర పరిస్థితులను అనుభవించారు. దీంతో డబ్ల్యూహెచ్ఓ ఈ వైరస్‌ను ఒక సవాలుగా తీసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల వయసున్న వారికి ఉచితంగా పోలియా వ్యాక్సిన్ (ముందు టీకా ఆ తర్వాత చుక్కల […]

polio-virus-VDPV-2-variant
X

పోలియో ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక వైరస్. చిన్నారుల్లో అపరిశుభ్ర ఆహారం, నీటి ద్వారా చేరి.. చివరకు నాడీ మండలాన్ని ప్రభావితం చేసి.. వాళ్లను దివ్యాంగులుగా మార్చేసే భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది దివ్యాంగులుగా మారిపోయి జీవితంలో దుర్భర పరిస్థితులను అనుభవించారు. దీంతో డబ్ల్యూహెచ్ఓ ఈ వైరస్‌ను ఒక సవాలుగా తీసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల వయసున్న వారికి ఉచితంగా పోలియా వ్యాక్సిన్ (ముందు టీకా ఆ తర్వాత చుక్కల మందు) ఇస్తూ దాదాపు వ్యాధిని నిర్మూలించింది.

తాజాగా పోలియో వైరస్ కొత్త వేరియంట్ రూపంలో కనపడినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. పోలియో వైరస్‌లోని వీడీపీవీ-2 రకం వేరియంట్‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. మురుగునీటిలో ఈ రకం వైరస్ ఉన్నట్లు బ్రిటిష్ హెల్త్ డిపార్ట్‌మెంట్ కూడా తెలిపింది. ఇది టీకాల నుంచి తీసుకోబడిన రకమని వాళ్లు అంటున్నారు. పర్యావరణ నమూనాల నుంచి మాత్రమే దీన్ని గుర్తించామని.. కానీ ఏ మనిషికీ సోకినట్లు స్పష్టం కాలేదన్నారు.

కాగా, పోలియో వైరస్ ఏ రకమైనా, ఏ వేరియంట్ అయినా, ఏ రూపంలో ఉన్నా.. పిల్లలకు ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. శుభ్రమైన, వేడి ఆహారం మాత్రమే అందించాలని వారు అంటున్నారు. నీటి విషయంలో కూడా పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కొత్త వేరియంట్‌పై పరిశోధనలు జరుగుతున్నట్లు బ్రిటిష్ హెల్త్ డిపార్ట్‌మెంట్ చెప్తోంది.

కాగా, 1980వ దశకంలో ప్రపంచాన్ని పోలియో గడగడలాడించింది. అప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం 99 శాతం తగ్గిపోయాయని చెప్తున్నారు. 125 దేశాల్లో కేవలం 3.50 లక్షల కేసులు మాత్రమే గత దశాబ్దంలో గుర్తించారు. చాలా దేశాల్లో పోలియో పూర్తిగా నిర్మూలించబడింది. అయితే పాకిస్తాన్, ఆఫ్గానిస్తాన్‌లో మాత్రం ఇంకా పోలియో కేసులు రెగ్యులర్‌గా వెలుగు చూస్తున్నాయి. ఇండియా పోలియో రహిత దేశం అని 2014లో డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. కాగా, ఈ మధ్య రూపాంతరం చెందిన పోలియో వైరస్‌ను కోల్‌కతాలో గుర్తించారు.

పోలియో వైరస్ మరోసారి వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా పోలియో టీకాల స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు డబ్ల్యూహెచ్ఓ సిద్దమవుతోంది.

First Published:  22 Jun 2022 10:52 PM GMT
Next Story