Telugu Global
NEWS

ప‌వ‌న్‌పై అంబ‌టి, పేర్ని పంచ్ డైలాగులు

పర్చూరు కౌలు రైతుల భరోసా యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్లు ఇచ్చారు. పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముందు పవన్ ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో తేల్చుకోవాలని, ఆ తర్వాత ఆయన ప్రజల ముందుకు రావాలని నిలదీశారు నేతలు. పొత్తుల పేరుతో పవన్ ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దత్త పుత్రుడివి కాదని నిరూపించుకో.. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో […]

Ambati-perni-nanpunch-dialogues-pwan
X

పర్చూరు కౌలు రైతుల భరోసా యాత్రలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్లు ఇచ్చారు. పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముందు పవన్ ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో తేల్చుకోవాలని, ఆ తర్వాత ఆయన ప్రజల ముందుకు రావాలని నిలదీశారు నేతలు. పొత్తుల పేరుతో పవన్ ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

దత్త పుత్రుడివి కాదని నిరూపించుకో..
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. వైసీపీని ప్రశ్నించడమే పవన్ కళ్యాణ్ కు తెలుసని అన్నారు పేర్ని నాని. 2014లో పవన్ కళ్యాణ్ గెలిపించిన టీడీపీ.. రైతులను దగా చేసింది వాస్తవం కాదా, ఇప్పటి రైతుల ఇబ్బందులకు అప్పటి ప్రభుత్వం చేసిన మోసం కారణం కాదా.. అని ప్రశ్నించారు నాని. అప్పట్లో ఈ అన్యాయాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని, ఇప్పుడు కౌలు రైతులకోసం ఎందుకు యాత్ర చేస్తున్నారని అడిగారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ కాదని నిరూపించుకోవాలంటే.. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయాలని, పవన్ కు ఆ దమ్ముందా అంటూ సవాల్ విసిరారు నాని.

కేంద్రంతో పోరాడు..
పవన్ కళ్యాణ్ పార్టనర్ గా ఉన్న కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకోసం ఏం చేస్తోందని ప్రశ్నించారు నాని. పాచిపోయిన లడ్డూలంటూ అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీని విమర్శించిన పవన్, తిరిగి బీజేపీతో ఎందుకు చేతులు కలిపారన్నారు. స్పెషల్ స్టేటస్ ఇచ్చారా? విశాఖ స్టీల్ ప్లాంట్ పై హామీ వచ్చిందా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం లో కౌలు రైతుల కోసం చట్టం చేయించాలని డిమాండ్ చేశారు పేర్ని నాని.

ప్రజల్ని మోసం చేస్తున్న పవన్..
పవన్ కల్యాణ్ పొత్తులపై రకరకాలుగా మాట మారుస్తున్నారంటూ విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు. మొన్న బీజేపీతో పొత్తు, నిన్న మూడూ ఆప్షన్ల పొత్తు, నేడు ప్రజలతోనే పొత్తు అంటున్నారని.. ఆయన ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన మాట మీద నిలబడలేరని, అందుకే బీజేపీతో పాటు ఏపీ ప్రజల్ని కూడా ఆయన మోసం చేస్తున్నారని మండిపడ్డారు. జనాన్ని “జనసేన వైపు చూడమంటాడు, ఈయనేమో తెలుగుదేశం వైపు చూస్తాడు!” అంటూ పవన్ పై సెటైర్లు వేశారు అంబటి.

First Published:  19 Jun 2022 8:39 PM GMT
Next Story