Telugu Global
NEWS

విధ్వంసం వెనుక ప్రైవేట్‌ ఆర్మీ కోచింగ్ సెంటర్లు.. వాట్సాప్‌లో కీలక వివరాలు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం వెనుక కారణాలు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఒక్కసారిగా వేలమంది యువకులు ఎలా వచ్చారు.. వారిని సంఘటితం చేసింది ఎవరు అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. అదుపులోకి తీసుకున్న యువకుల సెల్‌ఫోన్లలో పలు కీలక అంశాలను గుర్తించారు. వాట్సాప్ గ్రూపుల్లో ఒకరిని ఒకరు ప్రేరేపించుకున్నట్టు గుర్తించారు. శాంతియుతంగా నిరసన తెలిపితే ఎవరూ పట్టించుకోరు, కాబట్టి పోలీసు బలగాలు వచ్చే లోపే పెట్రోల్ పోసి తగలబెడుదాం అంటూ ఆడియో మేసేజ్‌లు కూడా […]

sec-railway-station
X

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ విధ్వంసం వెనుక కారణాలు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఒక్కసారిగా వేలమంది యువకులు ఎలా వచ్చారు.. వారిని సంఘటితం చేసింది ఎవరు అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. అదుపులోకి తీసుకున్న యువకుల సెల్‌ఫోన్లలో పలు కీలక అంశాలను గుర్తించారు. వాట్సాప్ గ్రూపుల్లో ఒకరిని ఒకరు ప్రేరేపించుకున్నట్టు గుర్తించారు. శాంతియుతంగా నిరసన తెలిపితే ఎవరూ పట్టించుకోరు, కాబట్టి పోలీసు బలగాలు వచ్చే లోపే పెట్రోల్ పోసి తగలబెడుదాం అంటూ ఆడియో మేసేజ్‌లు కూడా వాట్సాప్‌లో తిరిగినట్టు పోలీసులు గుర్తించారు.

అయితే ఇంత మంది సంఘటితమై, ఒకే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్‌కు చేరుకోవడం వెనుక ప్రైవేట్ ఆర్మీ కోచింగ్ సెంటర్ల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఒక ప్రముఖ ఆర్మీ కోచింగ్ సెంటర్‌ యువకులను ఏకం చేసినట్టు పోలీసులు గుర్తించారు. అకాడమి డైరెక్టర్‌ డైరెక్షన్‌లోనే యువకులు పెద్దెత్తున రైల్వే స్టేషన్ వైపు వెళ్లారని చెబుతున్నారు.

అగ్నిపథ్‌ను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైల్వే స్టేషన్‌ను టార్గెట్ చేసినట్టు భావిస్తున్నారు. మరో 10 వరకు ఆర్మీ కోచింగ్ సెంటర్లు కూడా పరోక్షంగా యువకుల ఆందోళనకు సహకారం అందించినట్టు పోలీసులు తేల్చారు. ఆహారం, బటర్‌ మిల్క్‌, వాటర్ బాటిళ్లను సరఫరా చేయడంతో పాటు ముందు రాత్రి యువకులు బసను కూడా ఈ ప్రైవేట్ అకాడమీలే కల్పించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో సాయి డెఫెన్స్ అకాడమీ ప్రమేయం ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.

సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు కీలక పాత్ర ఉన్నట్టు వాట్సాప్‌ మేసేజ్ ఆధారంగా పోలీసులు నిర్ధారించారు. మీడియా దృష్టిని ఆకర్శించి.. తమ ఆందోళన తీవ్రతను బయటి ప్రపంచానికి తెలియచేయాలన్న ముందస్తు ఆలోచనతోనే యువకులు వచ్చినట్టు ఆడియో మేసేజ్‌ల బట్టి అర్థమవుతోంది. పెట్రోల్‌ పోసి తగలబెడితే న్యూస్ వెంటనే స్ప్రెడ్‌ అవుతుందంటూ ఒకరికొకరు మాట్లాడుకున్నారు. ఈ ఆడియో టేపుల్లో మాట్లాడింది ఎవరు అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అటు ఏపీలోని కీలకమైన రైల్వేస్టేషన్లు పోలీసుల గుప్పట్లో ఉన్నాయి. ఏపీలోనూ దాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో విశాఖ, విజయవాడ, గుంటూరు రైల్వేస్టేషన్లలో భారీగా పోలీసులు మోహరించారు. రైల్వే పోలీసులతో పాటు రాష్ట్ర పోలీసులు భారీగా మోహరించారు. రైల్వే స్టేషన్లలోకి వెళ్లే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసే పంపుతున్నారు.

First Published:  17 Jun 2022 10:40 PM GMT
Next Story