Telugu Global
National

‘అగ్నిపథ్’ రేపిన చిచ్ఛు ..బీహార్ లో రైళ్లకు నిప్పు.. బీజేపీ నేతపై దాడి

సాయుధ దళాల్లో యువకుల నియామకాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్‘ పథకం.. నియామకాల మాటేమో గానీ నిజంగానే ‘అగ్ని’ని రాజేస్తోంది. బీహార్ లోని పలు జిల్లాల్లోరెండో రోజైన గురువారం కూడా హింస చెలరేగింది. రెచ్చిపోయిన గుంపులు రైళ్లకు, వాహనాలకు నిప్పు పెట్టారు. రైలు, రోడ్డు రవాణాను స్తంభింపజేశారు. అనేక చోట్ల బస్సుల అద్దాలు పగులగొట్టారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే, కారు డ్రైవర్ సహా 5 గురు గాయపడ్డారు. […]

Agipath-train-bjp-mla-car
X

సాయుధ దళాల్లో యువకుల నియామకాలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్‘ పథకం.. నియామకాల మాటేమో గానీ నిజంగానే ‘అగ్ని’ని రాజేస్తోంది. బీహార్ లోని పలు జిల్లాల్లోరెండో రోజైన గురువారం కూడా హింస చెలరేగింది. రెచ్చిపోయిన గుంపులు రైళ్లకు, వాహనాలకు నిప్పు పెట్టారు. రైలు, రోడ్డు రవాణాను స్తంభింపజేశారు. అనేక చోట్ల బస్సుల అద్దాలు పగులగొట్టారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే, కారు డ్రైవర్ సహా 5 గురు గాయపడ్డారు. యువకులు, విద్యార్థుల హింసాత్మక ఆందోళన ఫలితంగా 22 రైళ్ల సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అయిదు రైళ్లను ఎక్కడికక్కడ స్టేషన్లలోనే నిలిపివేశారు. కర్రలు, రాడ్లు ధరించిన నిరసనకారులు భభువా రోడ్ రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు కిటికీల అద్దాలను పగులగొట్టారని, ఓ బోగీకి నిప్పంటించారని ఈస్ట్ సెంట్రల్ రైల్వే వర్గాలు తెలిపాయి.

‘ఇండియన్ ఆర్మీ లవర్స్’ అని రాసి ఉన్న బ్యానర్లతో వీరంతా కొత్త పథకానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నవాడాలో బీజేపీ ఎమ్మెల్యే అరుణాదేవి కోర్టుకు వెళ్తుండగా ఆమె కారుపై వీరు రాళ్లు విసరడంతో ఆమెతో బాటుడ్రైవర్, మరికొందరు గాయపడ్డారు. నవాడా లోని బీజేపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ని దగ్ధం చేశారు. తన కారుపై పార్టీ పతాకాన్ని చూసిన ఆందోళనకారులు పెద్ద పెద్ద రాళ్లతో విరుచుకపడ్డారని, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, తన ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని ఎమ్మెల్యే అరుణాదేవి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా భయపడిపోతున్నా అని ఆమె వాపోయారు.

ఆందోళనకారులు అర్రా రైల్వే స్టేషన్ లో ఫర్నిచర్ ని పట్టాలపైకి విసిరివేసి నిప్పు పెట్టడంతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది నానా శ్రమ పడ్డారు. నవాడా రైల్వే స్టేషన్ పట్టాలపై బైఠాయించిన ఆందోళనకారులు టైర్లను దహనం చేశారు. ప్రధాని మోడీని దుయ్యబడుతూ వారు రైల్వే ఆస్తికి నష్టం కలిగించారని అధికారవర్గాలు తెలిపాయి.

జెహానాబాద్ లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైళ్ల రాకపోకలను అడ్డుకునేందుకు పట్టాలపైకి రాబోయిన విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు యత్నించగా రాళ్లతో దాడి చేయడంతో కొందరు పోలీసులతోబాటు కొందరు సాధారణ ప్రజలు కూడా గాయపడ్డారు. ఒక దశలో నిరసనకారుల మీద పోలీసులు కూడా రాళ్లు విసిరారని, వారిపై తుపాకులను ఎక్కుపెట్టారని తెలిసింది. సహర్సా జిల్లాలో రైల్వే స్టేషన్ ముట్టడికి ఓ గుంపు యత్నించగా వారిని చెదరగొట్టేందుకు ఖాకీలు తీవ్రంగా శ్రమించారు. ఛాప్రా జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది.

యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లోనూ !

యూపీలోని బులంద్ షహర్, ఉన్నావ్, గోండా జిల్లాల్లో విద్యార్థులు ‘అగ్నిపథ్’ పథకం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దీన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయా జిల్లాల మేజిస్ట్రేట్లకు వీరు మెమొరాండంలు సమర్పించారు. హర్యానాలోని బిలాస్ పూర్ తదితర చోట్ల వందలాది విద్యార్థులు బస్టాండ్లను ముట్టడించారు. రోడ్లపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పాల్వాల్ లో రాళ్లదాడికి దిగిన గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో గొగోయ్ విమానాశ్రయం వద్ద విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు.

First Published:  16 Jun 2022 6:20 AM GMT
Next Story