Telugu Global
National

కర్ణాటక సీఎంకు ప్రధాని మోదీ ఫోన్.. ఎందుకంటే..?

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి ప్రధాని మోదీ నుంచి శనివారం ఫోన్ వచ్చింది. పైగా ఆయనతో పాటు హోమ్ మంత్రి అమిత్ షా కూడా బొమ్మైకి ఫోన్ చేశారు. రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో మూడింటిని గెలుచుకున్నందుకు వీరిద్దరూ బొమ్మైని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్నికల ఫలితాల వెల్లడి కాగానే మోదీ.. ఫోన్ చేసి అభినందించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ముగ్గురు సభ్యులు ఎన్నికయ్యేలా […]

pm-modi-phone-karnataka-cm
X

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి ప్రధాని మోదీ నుంచి శనివారం ఫోన్ వచ్చింది. పైగా ఆయనతో పాటు హోమ్ మంత్రి అమిత్ షా కూడా బొమ్మైకి ఫోన్ చేశారు. రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో మూడింటిని గెలుచుకున్నందుకు వీరిద్దరూ బొమ్మైని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్నికల ఫలితాల వెల్లడి కాగానే మోదీ.. ఫోన్ చేసి అభినందించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ముగ్గురు సభ్యులు ఎన్నికయ్యేలా చూడడంలో మీరు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలనిచ్చాయని, రాష్ట్రం నుంచి అందిన ఈ కృషి కారణంగా మరింత స్ఫూర్తిదాయక విజయాలకు బాటపరుస్తాయని మోడీ పేర్కొన్నారు. అలాగే ఈ నెంబర్ల గేమ్ లో అతి కఠినమైన రాజకీయ సవాలు ఎదురైనప్పటికీ మూడో అభ్యర్థి విజయం సాధించేలా పార్టీ నాయకత్వం కృషి చేసిందని, చివరకు ముగ్గురు బీజేపీ అభ్యర్థులూ గెలిచారని హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యసభలో పార్టీ బలం పెరగడానికి కర్ణాటక నుంచి అందిన మంచి గిఫ్ట్ ఇదని ఆయన అభివర్ణించారు.

ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా సైతం సీఎం బసవరాజ్ బొమ్మైని పొగడ్తలతో ముంచెత్తారు. మీరు చేసిన హార్డ్ వర్క్ మంచి ఫలితాలనిచ్చిందని, మీ వ్యూహాలు సఫలమయ్యాయని ఇవి నిరూపించాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో పార్టీ ఇంకా బలోపేతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిన్న రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి నాలుగు సీట్లకు గాను మూడింటిని బీజేపీ కైవసం చేసుకుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కన్నడ నటుడు, రాజకీయవేత్త జగ్గేష్, లహర్ సింగ్ సిరోయా విజయం సాధించారు. వీరిలో సింగ్.. కర్ణాటక మాజీ సీఎం యెడ్యూరప్పకు సన్నిహితులు. కాంగ్రెస్ అభ్యర్థి జైరాం రమేష్ కూడా గెలుపొందారు. జేడీ-ఎస్ తరఫున డి. కుపేంద్ర రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్సూర్ అలీ ఖాన్ నాలుగో అభ్యర్థులుగా బరిలో ఉన్నా.. సిరోయా చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ కారణంగా జేడీ-ఎస్ పార్టీ అవకాశాలు సన్నగిల్లాయి. పైగా జేడీ-ఎస్ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారు. వీరిలో ఒకరు కాంగ్రెస్ పార్టీకి, మరొకరు బీజేపీకి ఓటు వేశారు.

మాజీ సీఎం సిద్దరామయ్యను తిట్టిపోసిన హెచ్. డి.కుమారస్వామి

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయవలసిందిగా ఈ పార్టీ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య జేడీ-ఎస్ ఎమ్మెల్యేలను కోరడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, జేడీ-ఎస్ నేత హెచ్.డి. కుమారస్వామి మండిపడ్డారు. ఇదంతా కుట్ర జరిగినట్టు కనిపిస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో బేరసారాలు జరిగాయని, పైగా రాష్ట్ర బీజేపీ నేత రవి .. కాంగ్రెస్ కార్యాలయంలోకి వెళ్లడాన్ని తాను చూశానని ఆయన చెప్పారు. పైగా మా పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నట్టు కూడా సిద్దరామయ్య చెప్పారని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అటు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు వేసిన జేడీ-ఎస్ సభ్యుడు శ్రీనివాస గౌడ-తనకు ఈ పార్టీ (కాంగ్రెస్) అంటే ఇష్టమని, దాన్ని అభిమానిస్తానని ప్రకటించి.. కుమారస్వామి పుండు మీద మరింత కారం జల్లారు.

First Published:  11 Jun 2022 4:25 AM GMT
Next Story