Telugu Global
National

డ్రామాలు, ఆరోపణలు, బేరసారాలు.. 16 రాజ్యసభ సీట్లలో 8 బీజేపీ కైవసం

రాజ్యసభ ఎన్నికలు భలే రక్తి కట్టించాయి. బేరసారాలు, రకరకాల డ్రామాలు, ఆరోపణల మధ్య కాషాయ పార్టీ 16 స్థానాలకు గాను ఎనిమిదింటిని కైవసం చేసుకుని మరింత బలం సంపాదించుకుంది. ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల నుంచి ఎగువ సభకు ఎన్నికైన 16 మంది అభ్యర్థుల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్ తో బాటు కాంగ్రెస్ నుంచి రణదీప్ సూర్జేవాలా, జైరాం రమేష్, శివసేన నుంచి ఈ పార్టీ నేత సంజయ్ రౌత్ తదితరులున్నారు. […]

8-mps-bjp-win
X

రాజ్యసభ ఎన్నికలు భలే రక్తి కట్టించాయి. బేరసారాలు, రకరకాల డ్రామాలు, ఆరోపణల మధ్య కాషాయ పార్టీ 16 స్థానాలకు గాను ఎనిమిదింటిని కైవసం చేసుకుని మరింత బలం సంపాదించుకుంది. ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల నుంచి ఎగువ సభకు ఎన్నికైన 16 మంది అభ్యర్థుల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయెల్ తో బాటు కాంగ్రెస్ నుంచి రణదీప్ సూర్జేవాలా, జైరాం రమేష్, శివసేన నుంచి ఈ పార్టీ నేత సంజయ్ రౌత్ తదితరులున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, కర్ణాటక ఫలితాలు వెల్లడి కాగా .. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని కాంగ్రెస్, ఎన్సీపీ సమైక్య కూటమికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ రాష్ట్రం నుంచి ఆరు సీట్లకు గాను ప్రధాన విపక్షమైన బీజేపీ మూడు స్థానాలను దక్కించుకోవడంతో ‘మహావికాస్ అఘాడీ’ సర్కార్ ఇబ్బందుల్లో పడింది. అలాగే హర్యానాలో బీజేపీకి చెందిన కిషన్ లాల్ పన్వర్ గెలుపొందగా.. ఈ పార్టీ మద్దతునిచ్చిన స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి అజయ్ మాకెన్ బేర్ మన్నారు. దీంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా చతికిలపడింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపులో జాప్యం, బేరసారాలు, ఒక్కటేమిటి ? బీజేపీ అభ్యర్థులకు ఎన్నికల సంఘం సహకరించిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి.

ఇక క్రాస్ ఓటింగ్ సరేసరి ! ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల విషయంలో కౌంటింగ్ సుమారు 8 గంటలపాటు జాప్యం జరిగిందంటే తెర వెనుక ఎన్ని జిత్తులమారి వ్యూహాలు చోటు చేసుకున్నాయో ఊహించుకోవలసిందే ! మహారాష్ట్ర ఫలితాలైతే ఈ ఉదయం వెల్లడయ్యాయి. ఈ రాష్ట్రం నుంచి ఆరు సీట్లకు గాను బీజేపీ సగానికి సగం.. అంటే మూడు స్థానాల్లో విజయం సాధించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, మాజీ రాష్ట్ర మంత్రి అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్, శివసేన నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నుంచి ఇమ్రాన్ ప్రతాప్ గర్హి విజయం సాధించారు. బీజేపీ బరిలో దింపిన మాజీ ఎంపీ ధనంజయ్ మహాదిక్.. ఆరో సీటుకు గాను శివసేన అభ్యర్థి సంజయ్ పన్వార్ ని ఓడించారు.

హర్యానా విషయానికే వస్తే బీజేపీ అభ్యర్థి కిషన్ లాల్ పన్వర్, తనతో బాటు తమ పార్టీ మద్దతునిచ్చిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మను కూడా గెలిపించుకున్నారు. దీంతో రెండు స్థానాలు బీజేపీ వశమైనట్టే ! కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ ఓటమి చవి చూశారు. కిషన్ లాల్ పన్వర్ కు 36 ఓట్లు రాగా కార్తికేయ శర్మకు 23 తొలి ప్రాధాన్యతా ఓట్లు లభించాయి. ఫైగా బీజేపీ నుంచి 6.6 ఓట్ల బదలాయింపు జరగ్గా ఆయన ఓట్ల బలం 29.6 కి పెరిగింది. అజయ్ మాకెన్ కి 29 ఓట్లు లభించినప్పటికీ రెండో ప్రాధాన్యతా ఓట్లు దక్కకపోవడంతో ఆయన ఓడిపోయారు. కర్ణాటకలో మూడు రాజ్యసభ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. నాలుగు సీట్లకు పోటీ చేసినా .. మా పని తీరు భేషుగ్గా ఉందని నిరూపించుకుంది. ఈ రాష్ట్రంలో ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. రెండు సీట్లకు గాను ఒక్కస్థానాన్ని దక్కించుకుంది. జేడీ-ఎస్ కూడా ఇక్కడ బేర్ మంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, నటుడు, పొలిటిషియన్ జగ్గేష్, ఎమ్మెల్సీ లెహర్ సింగ్ సిరోయా విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్ ఓకే అయ్యారు. కర్ణాటక నుంచి ఎగువ సభకు నిర్మలాసీతారామన్, జైరాం రమేష్ మళ్ళీ ఎన్నికయ్యారు.

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి ఊరట

రాజస్థాన్ లో పాలక కాంగ్రెస్ పార్టీ .. 4 సీట్లకు గాను మూడింటిలో విజయం సాధించింది. బీజేపీ ఒక సీటు గెలుచుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ ఎన్నిక కాగా- బీజేపీ అభ్యర్థి ఘనశ్యామ్ తివారీ .. ఎగువసభ మెట్లెక్కనున్నారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే శోభారాణి కుశ్వాహ్.. కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రమోద్ తివారీకోసం క్రాస్ ఓటింగ్ చేయడం విశేషం. తనను బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయడంతో ఆగ్రహించి కసి దీరా ఆమె కాంగ్రెస్ అభ్జ్యర్థికి ఓటు వేశారు. మొత్తానికి ఈ ఫలితాలపై సీఎం అశోక్ గెహ్లాట్ సంతోషంతో తలమునకలవుతున్నారు.

First Published:  11 Jun 2022 5:55 AM GMT
Next Story