Telugu Global
NEWS

మై వేముల‌వాడ గ్రూప్.. స‌క్సెస్ స్టోరీ..

వాట్సప్ ఒక ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా ఇండియాలో కూడా ఎంతో మంది ఈ యాప్‌ను యూజ్ చేస్తుంటారు. వాట్సప్‌లో ఎన్నో ఫార్వర్డ్ మెసేజెస్ వస్తుంటాయి. అందులో వచ్చేవి నిజమైనవో కాదో అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. అందుకే ఆ యాప్ సందేశాలను చాలా మంది చులకన భావంతో చూస్తుంటారు. అయితే ఈ వాట్సప్‌ను సక్రమంగా ఉపయోగిస్తే ఎన్నో మంచి పనులు కూడా జరుగుతాయని తెలంగాణలో ఒక గ్రూప్ నిరూపించింది. పక్కన […]

my-vemulawada-whatsapp-group-success-story
X

వాట్సప్ ఒక ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా ఇండియాలో కూడా ఎంతో మంది ఈ యాప్‌ను యూజ్ చేస్తుంటారు. వాట్సప్‌లో ఎన్నో ఫార్వర్డ్ మెసేజెస్ వస్తుంటాయి. అందులో వచ్చేవి నిజమైనవో కాదో అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. అందుకే ఆ యాప్ సందేశాలను చాలా మంది చులకన భావంతో చూస్తుంటారు. అయితే ఈ వాట్సప్‌ను సక్రమంగా ఉపయోగిస్తే ఎన్నో మంచి పనులు కూడా జరుగుతాయని తెలంగాణలో ఒక గ్రూప్ నిరూపించింది.

పక్కన వాళ్లకు కూడా రూపాయి ఇవ్వాలంటే డైలమాలో పడే ఈ రోజుల్లో.. ఏకంగా వాట్సప్ గ్రూప్ ద్వారా ఒక ట్రస్ట్‌నే ఏర్పాటు చేసి ఎంతో మందికి కొంతమంది సేవ చేస్తున్నారు, ‘మై వేములవాడ గ్రూప్‘ అనే పేరుతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసిన సభ్యులు ఇప్పుడు దాన్ని ఏకంగా ‘మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్’ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసే వరకు వెళ్లారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి తమ సేవలను విస్తరించారు. కరోనా లాక్‌డౌన్‌ కంటే ముందే ఏర్పడిన ఈ గ్రూప్.. తెలంగాణలోని వేములవాడలో తమ సేవను కొనసాగిస్తోంది.

వేములవాడ‌ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం వద్ద యాచించే కొంత మందిని మొదటి సారిగా చేరదీసింది. అక్కడ బిక్షాట‌న చేసేవారిని ఈ గ్రూప్ కరోనా సమయంలో ఆదరించడంతో పాటు అదే ఊరిలో ఉండే పేదలకు ఉచితంగా ఆహారం అందించింది. ఆ వాట్సప్ గ్రూప్ చేస్తున్న సేవలను గుర్తించి వేములవాడలోని వ్యాపారులు కూడా తమకు తోచినంత సాయం చేశారు. ఆ తర్వాత అదే గ్రూప్ అన్నదానాలు, పేద విద్యార్థులకు చదువుల ఖర్చులకు సాయం చేయడం కూడా ప్రారంభించింది. దీంతో ఆ గ్రూప్‌ను ఏకంగా ట్రస్ట్‌గా మార్చాలనే ఆలోచన సభ్యులకు వచ్చింది.

ప్రస్తుతం ఆ గ్రూప్‌లో చాలా మంది సభ్యులు ఉన్నారు. కానీ ట్రస్ట్‌లో మాత్రం 2,063 మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ట్రస్ట్‌లో సభ్యత్వం లేకపోయినా.. చాలా మంది ఈ గ్రూప్‌కు సాయం చేస్తున్నారని ట్రస్ట్ సభ్యుడు మధు మహేష్ వెల్లడించారు. తమ ట్రస్ట్ ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు, ఇతర మెడికల్ అవసరాలకు సాయం అందిస్తున్నామని ఆయన చెప్పారు.

కరోనా సమయంలో చాలా మందికి ఎన్65 మాస్కులతో పాటు వృద్దులు, మహిళలు, నిరుపేదలకు అనేక ఉపకరణాలు సాయం చేసినట్లు మధు చెప్పారు. విద్యార్థులకు బుక్స్, శానిటైజర్స్, ఎనర్జీ డ్రింక్స్, డ్రెసెస్ పంపిణీ చేశామని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఈ గ్రూప్, ఎన్జీవో చాలా ఎదిగింది. వేములవాడతో పాటు కరీంనగర్ జిల్లాలో ఎంతో మందికి తమ సేవలను అందిస్తున్నది.

మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ప్రస్తుతం ఉత్తర తెలంగాణలోనే పని చేస్తున్నది. అయితే రానున్న రోజుల్లో మిగిలిన జిల్లాలకు విస్తరించే ఆలోచన ఉన్నట్లు సభ్యులు చెప్తున్నారు. తమ గ్రూప్‌కు కేవలం ధన సహాయం కాకుండా.. సోషల్ మీడియాలో తగినంత ప్రచారం చేయాలని సభ్యులు కోరుతున్నారు.

First Published:  10 Jun 2022 7:31 AM GMT
Next Story