ఆన్ లైన్ పాఠాలు ఇక చాలు.. అన్నీ స్కూల్ లోనే నేర్పించండి..
కరోనా వల్ల పిల్లలకు కొత్తగా పరిచయం అయిన పేరు ఆన్ లైన్ క్లాస్. కరోనా తగ్గుముఖం పట్టినా పిల్లలు స్కూల్ కి వెళ్తున్నా కూడా.. కొన్నిచోట్ల ఆన్ లైన్ క్లాసులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని సబ్జెక్ట్ లను ఆన్ లైన్ లోనే చెబుతున్నారు. ఆఫ్ లైన్ పాఠాలతోపాటు, ఆన్ లైన్ పాఠాలు ఇప్పుడు అదనంగా పిల్లలపై భారం మోపుతున్నాయి. ఇకపై వీటికి స్వస్తి పలకాలని సూచిస్తున్నారు తల్లిదండ్రులు. ఆన్ లైన్ పాఠాలు ఇక చాలని, పిల్లలకు అన్నీ […]
కరోనా వల్ల పిల్లలకు కొత్తగా పరిచయం అయిన పేరు ఆన్ లైన్ క్లాస్. కరోనా తగ్గుముఖం పట్టినా పిల్లలు స్కూల్ కి వెళ్తున్నా కూడా.. కొన్నిచోట్ల ఆన్ లైన్ క్లాసులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని సబ్జెక్ట్ లను ఆన్ లైన్ లోనే చెబుతున్నారు. ఆఫ్ లైన్ పాఠాలతోపాటు, ఆన్ లైన్ పాఠాలు ఇప్పుడు అదనంగా పిల్లలపై భారం మోపుతున్నాయి. ఇకపై వీటికి స్వస్తి పలకాలని సూచిస్తున్నారు తల్లిదండ్రులు. ఆన్ లైన్ పాఠాలు ఇక చాలని, పిల్లలకు అన్నీ స్కూల్ లోనే నేర్పించాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. విద్యా రంగంలో సమస్యలు, పిల్లల మానసిక స్థితిపై పియర్సన్ గ్లోబల్ లెర్నర్స్ సంస్థ చేపట్టిన సర్వేలో తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను చెప్పారు. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, చైనాతో పాటు భారత్ లోని 3100 మంది తల్లిదండ్రులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
శారీరక వ్యాయామం కావాల్సిందే..
పిల్లలను ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు పేరెంట్స్. పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడేందుకు ఫిజికల్ ఫిట్నెస్ కార్యక్రమాలు అవసరమని 88శాతం పేరెంట్స్ పేర్కొన్నారు. స్కూల్ లో కూడా దీనికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. కరోనా తర్వాత శారీరక వ్యాయామం, ఆహారపు అలవాట్లలో తల్లిదండ్రుల్లో కాస్త అవగాహన వచ్చినట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియా ప్రభావం ఎంత..?
పిల్లలు ఆన్ లైన్ క్లాసులకోసం ఇంటర్నెట్ కి అలవాటుపడే సమయంలో సోషల్ మీడియాకి కూడా బాగా దగ్గరయ్యారు. ఫేస్ బుక్, యూట్యూబ్ వీడియోలు చూడటం, వాట్సప్, ట్విట్టర్, ఇన్ స్టా లలో చాటింగ్ చేయడంలో కూడా ఆరితేరారు. అయితే పిల్లల మానసిక స్థితిపై వీడియో గేమ్స్, సోషల్ మీడియా సానుకూల ప్రభావమే చూపిస్తోందని 40శాతం మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. పిల్లలకు పాఠశాలల్లోనే మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని 53శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. వర్చువల్ పద్ధతిలో బోధనతో చిన్నారులపై సానుకూల ప్రభావమే కనిపిస్తోందని 27శాతం మంది అభిప్రాయపడ్డారు అయితే ఆఫ్ లైన్ క్లాసులు జరుగుతున్న ఈ సమయంలో ఇకపై ఆన్ లైన్, వర్చువల్ పద్ధతిలో బోధన తగ్గించాలని సర్వేలో పాల్గొన్న 88శాతం మంది తల్లిదండ్రులు పేర్కొన్నారు.