Telugu Global
National

పోలీసుల లైంగిక వేధింపులు… 19 ఏళ్ళ యువతి ఆత్మహత్య‌

ఉత్తరప్రదేశ్ అరాచక రాజ్యంగా మారిపోయింది. మహిళలపై, దళితులపై, మత మైనార్టీలపై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ దమనకాండలో కొన్నిచోట్ల‌ పోలీసులు హస్తం కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఓ యువతిని పోలీసులు లైంగికంగా వేధించడంతో నిన్న ఆమె ఆత్మహత్య చేసుకొని మరణించింది. యూపీలోని బుదౌన్ జిల్లా బినావర్ లో ఓ 19 ఏళ్ల యువతిని, ఆమె తల్లిని పోలీసులు తీవ్రంగా వేధించారు. బుధవారం తమ ఇంటికి వచ్చినప్పుడు స్నానం చేస్తుండగా బాత్‌రూమ్‌లో ఉన్న […]

పోలీసుల లైంగిక వేధింపులు… 19 ఏళ్ళ యువతి ఆత్మహత్య‌
X

ఉత్తరప్రదేశ్ అరాచక రాజ్యంగా మారిపోయింది. మహిళలపై, దళితులపై, మత మైనార్టీలపై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ దమనకాండలో కొన్నిచోట్ల‌ పోలీసులు హస్తం కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఓ యువతిని పోలీసులు లైంగికంగా వేధించడంతో నిన్న ఆమె ఆత్మహత్య చేసుకొని మరణించింది.

యూపీలోని బుదౌన్ జిల్లా బినావర్ లో ఓ 19 ఏళ్ల యువతిని, ఆమె తల్లిని పోలీసులు తీవ్రంగా వేధించారు.
బుధవారం తమ ఇంటికి వచ్చినప్పుడు స్నానం చేస్తుండగా బాత్‌రూమ్‌లో ఉన్న ఆమె తల్లిని కూడా పోలీసు సిబ్బంది వేధించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం….

మే 9న ఆ కుటుంబానికి వారి బంధువులతో గొడవ జరిగింది. ఘటనపై అదే రోజు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని యువతి తల్లి ఆరోపించారు.

” మే 13 న మళ్ళీ గొడవ జరిగింది. దానిపై మా బంధువులు ఫిర్యాదు చేయడంతో ఆ రోజు నుంచి పోలీసులు మా ఇంటికి రావడం ప్రారంభించారు” అని తల్లి తెలిపింది.

“బినావర్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు దాదాపు ప్రతిరోజూ మా ఇంటికి వచ్చేవారు. వారు నా కుమార్తెను కొట్టి వేధించారు” అని తల్లి ఆరోపించింది.

“బుధవారం సాయంత్రం పోలీసులు మా ఇంటికి వచ్చి నేను స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ నుండి నన్ను నగ్న స్థితిలో బైటికి లాగారు. వారు నన్ను, నా కుమార్తెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, సాయంత్రం తర్వాత తిరిగి పంపించారు. పోలీసుల తీరుతో నా కూతురు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది” అని తల్లి తెలిపింది.

ఈ దుర్మార్గంలో బినావర్ పోలీస్ స్టేషన్లోని సబ్-ఇన్‌స్పెక్టర్ సంజయ్ గౌర్, ఇతర పోలీసు సిబ్బంది ప్రమేయం ఉందని ఆమె ఆరోపించింది.వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.

కాగా మరణించిన యువతి కుటుంబీకుల ఆరోపణలను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఓపీ సింగ్ తోసిపుచ్చారు.

“చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులకు నేర నేపథ్యం ఉంది. ఆమె సోదరుల్లో ఒకరు తీహార్ జైలులో ఉన్నారు. అతని తండ్రి, బంధువులపై పలు కేసులు నమోదయ్యాయి. పాత కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు వారి ఇంటిపై దాడి చేశారు. పోలీసు సిబ్బంది ఏ విధంగానూ అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, ”అని ఆయన అన్నారు.

మరి పోలీసులు ఏ విధమైన అనుచిత ప్రవర్తన లేకుండా , చాలా మర్యాదగా ప్రవర్తించినప్పటికీ ఆ 19 ఏళ్ళ యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయం తేలాల్సి ఉంది.

First Published:  2 Jun 2022 10:14 PM GMT
Next Story