Telugu Global
NEWS

కుమార్తెపై ఆనం కామెంట్స్‌. కుర్చీలేశామంటున్న సోమిరెడ్డి

”వైసీపీకి భారీ దెబ్బ.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె”…”జగన్‌కి షాక్‌… మహానాడులో లోకేష్‌తో వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె భేటీ”. ఇదీ బద్వేల్‌ టీడీపీ నేత రితేష్‌ రెడ్డి భార్య కైవల్యా రెడ్డి నారా లోకేష్‌ను కలవడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హెడ్‌లైన్లు. ఈ వార్తలు చూసి మీడియా మరీ వైలెంట్‌గా తయారైంది అని టీడీపీ వారే నవ్వుకుంటున్నారు. ఒక మహిళ వివాహం అయిన తర్వాత, అందులోనూ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి కోడలిగా వెళ్లిన తర్వాత తన భర్త […]

కుమార్తెపై ఆనం కామెంట్స్‌. కుర్చీలేశామంటున్న సోమిరెడ్డి
X

”వైసీపీకి భారీ దెబ్బ.. టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె”…”జగన్‌కి షాక్‌… మహానాడులో లోకేష్‌తో వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె భేటీ”. ఇదీ బద్వేల్‌ టీడీపీ నేత రితేష్‌ రెడ్డి భార్య కైవల్యా రెడ్డి నారా లోకేష్‌ను కలవడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హెడ్‌లైన్లు. ఈ వార్తలు చూసి మీడియా మరీ వైలెంట్‌గా తయారైంది అని టీడీపీ వారే నవ్వుకుంటున్నారు.

ఒక మహిళ వివాహం అయిన తర్వాత, అందులోనూ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి కోడలిగా వెళ్లిన తర్వాత తన భర్త అడుగు జాడల్లో నడుస్తారే గానీ.. ఆమె నిర్ణయాలకు తండ్రి ఎలా బాధ్యుడు అవుతారన్న కనీస ఆలోచన కూడా మీడియా వదిలేసింది. టీడీపీ నేత భార్య.. లోకేష్‌ను కలిస్తే జగన్‌కు ఎలా షాక్‌ అవుతుందో మరి!.

తన అల్లుడు, కుమార్తె తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలకు తనను బాధ్యుడిని చేసేలా మీడియా చేస్తున్న ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. తన కుమార్తె అత్తగారి కుటుంబం ఎప్పటి నుంచో టీడీపీలో ఉందని.. ప్రస్తుతం తన అల్లుడు, కుమార్తె నారా లోకేష్‌ను కలవడంతో ప్రత్యేకత ఏమీ లేదని ఆనం వ్యాఖ్యానించారు. అది వారి వ్యక్తిగత రాజకీయ వ్యవహారమని.. ఇందులో తనకు సంబంధం లేదని ఆనం వెల్లడించారు.

నిజానికి కైవల్యారెడ్డి అత్త విజయమ్మ కడప జిల్లా బద్వేల్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. కానీ, ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో వారికి పోటీ చేసే అవకాశం లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు టికెట్‌ను తన భార్యకు ఇవ్వాల్సిందిగా రితేష్‌ రెడ్డి టీడీపీ నాయకత్వాన్ని కోరుతున్నారు.

ఈ పరిణామాలపై నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. కైవల్యారెడ్డి అత్తింటివారు ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్నారని.. కైవల్యా రెడ్డి కూడా టీడీపీ వ్యక్తేనని.. ఆమె కూడా క్రియాశీల రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. ఆమె ఆత్మకూరు టికెట్‌ ఆశిస్తున్నారా లేదా అన్నది తనకు తెలియదన్నారు. టికెట్ల వ్యవహారం రెండేళ్ల తర్వాతి అంశమని వ్యాఖ్యానించారు.

ఆనం రామనారాయణరెడ్డి టీడీపీలోకి వస్తారా అన్న ప్రశ్నకు.. నెల్లూరు రాజకీయాల్లో అనేక పరిణామాలు జరుగుతుంటాయని, తాము మాత్రం ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చున్నామని.. ఎటూ పోయేవాళ్లం కాదని, అదే సమయంలో ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని సోమిరెడ్డి చెప్పారు. ఇక్కడే కుర్చీలేసుకుని కూర్చున్నాం, ఎక్కడికి పోయేవాళ్లం కాదు అంటున్న సోమిరెడ్డి.. లోకేష్ ప్రతిపాదించిన మూడు ఓటములు- నో టికెట్‌ పాలసీకి సానుకూలంగా ఉన్నట్టుగా లేదు.

First Published:  28 May 2022 8:21 PM GMT
Next Story