Telugu Global
NEWS

ఎడ్లబండిపై ఢిల్లీకి.. చెల్లి కాపురం కోసం అన్న పోరాటం

చెల్లి జీవితం నిలబెట్టేందుకు ఒక్క అన్న ఢిల్లీకి ఎడ్ల బండిలో బయలుదేరాడు. తన తల్లితో కలిసి సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్నాడు. నాలుగేళ్ల నరకం కంటే రెండు నెలల ఎడ్ల బండి ప్రయాణం తమకు కష్టమేమీ కాదంటున్నాడు సదరు యువకుడు ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్లకు చెందిన నాగదుర్గారావు.. తన చెల్లి నవ్యతను అదే మండలం చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కు ఇచ్చి 2018లో వివాహం జరిపించాడు. కట్నంగా 23 లక్షల నగదు, 30 తులాల […]

ఎడ్లబండిపై ఢిల్లీకి.. చెల్లి కాపురం కోసం అన్న పోరాటం
X

చెల్లి జీవితం నిలబెట్టేందుకు ఒక్క అన్న ఢిల్లీకి ఎడ్ల బండిలో బయలుదేరాడు. తన తల్లితో కలిసి సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్నాడు. నాలుగేళ్ల నరకం కంటే రెండు నెలల ఎడ్ల బండి ప్రయాణం తమకు కష్టమేమీ కాదంటున్నాడు సదరు యువకుడు

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్లకు చెందిన నాగదుర్గారావు.. తన చెల్లి నవ్యతను అదే మండలం చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కు ఇచ్చి 2018లో వివాహం జరిపించాడు. కట్నంగా 23 లక్షల నగదు, 30 తులాల బంగారం, మూడు ఎకరాల పొలం ఇచ్చాడు.

పెళ్లైన కొద్దిరోజుల నుంచే తన చెల్లిని భర్త నాగేంద్రనాథ్‌, అతడి తండ్రి మోహన్‌, తల్లి రూపారాణి, అతడి చెల్లి కంఠంనేని మధుర కలిసి వేధిస్తున్నారని నాగదుర్గారావు చెబుతున్నారు. పరువు పోతుందన్న ఉద్దేశంతో రెండేళ్ల పాటు ఎదురుచూశామని, మరో రెండు ఏళ్ల‌ నుంచి పోరాటం చేస్తూనే ఉన్నానని నాగదుర్గరావు చెబుతున్నారు.

వేధింపులపై చందర్లపాడు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తాము డీఎస్పీ వరకు విషయాన్ని తీసుకెళ్లామని.. కానీ వారు కూడా అవతలి వారికే వంతపాడుతున్నారని నవ్యత తల్లి చెబుతున్నారు. భర్త ఇంటి ముందు ధర్నా చేసేందుకు తన కుమార్తె సిద్ధమవగా.. కొండను ఢీకొడితే మీ తలే పడుతుంది గానీ, కొండకేమీ కాదంటూ డీఎస్పీ మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగేంద్రనాథ్ కుటుంబం వారి పరపతిని ఉపయోగించి తమకు న్యాయం జరకుండా అడ్డుకుంటున్నారన్నారు.

ఇక్కడి పోలీసులు తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం పోయిందని, అందుకే ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టుతో పాటు హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించాలనే తాను, తన తల్లి కలిసి ఎడ్లబండిపై బయలుదేరామని నాగదుర్గారావు చెబుతున్నారు. తన గ్రామం నుంచి ఢిల్లీకి 1700 కిలోమీటర్ల దూరం ఉందని.. ఎడ్ల బండిపై ప్రయాణం రెండు నెలల పట్టవచ్చని అతడి వివరించారు. నాలుగేళ్లుగా తాము అనుభవిస్తున్న నరకం కంటే.. ఈ రెండు నెలల ప్రయాణం తమకేమీ పెద్ద కష్టం కాదన్నారు.

బియ్యం, అవసరమైన పప్పు దినుసులను ఎడ్లబండిలో వేసుకుని వెళ్తున్నారు. మార్గమధ్యలో ఎద్దులకు మేత మేపుకుంటూ, భోజనం వండుకుంటూ తల్లి, కుమారుడు ఢిల్లీ వెళ్తున్నారు. ఈనెల 23న వీరి ప్రయాణం మొదలైంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా మీదుగా వెళ్తున్నారు. అయితే వీరు ఇలా ఢిల్లీ వరకు దారిపోరాటం చేయాల్సి వస్తుందా ?… లేక అంతలోపే వ్యవస్థలు ఏమైనా స్పందిస్తారా? అన్నది చూడాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా కృష్ణా జిల్లాకు చెందిన వారే. కాబట్టి న్యాయస్థానాలు, మానవహక్కుల కమిషన్‌ ముందే స్పందిస్తాయా.. లేక తల్లి, కుమారుడు ఢిల్లీకి ఎడ్ల బండిపై వచ్చి విన్నవించుకునే వరకు ఎదురుచూస్తాయా అన్నది చూడాలి.

First Published:  27 May 2022 9:08 PM GMT
Next Story