Telugu Global
NEWS

కోనసీమ ఉద్రిక్తతల వెనక ప్రతిపక్షాల హస్తం..?

కోనసీమ జిల్లా పేరు విషయంలో జరుగుతున్న ఆందోళనల వెనక ప్రతిపక్షాల హస్తం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమగా పేరు మార్చామని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాని సూచించారు హోం మంత్రి తానేటి వనిత. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. దీని వెనుక టీడీపీ, జనసేన పార్టీలున్నాయనే అనుమానం వ్యక్తం చేశారామె. గొడవలు చేసే వారిని, వారి వెనుక […]

కోనసీమ ఉద్రిక్తతల వెనక ప్రతిపక్షాల హస్తం..?
X

కోనసీమ జిల్లా పేరు విషయంలో జరుగుతున్న ఆందోళనల వెనక ప్రతిపక్షాల హస్తం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమగా పేరు మార్చామని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాని సూచించారు హోం మంత్రి తానేటి వనిత. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. దీని వెనుక టీడీపీ, జనసేన పార్టీలున్నాయనే అనుమానం వ్యక్తం చేశారామె. గొడవలు చేసే వారిని, వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు వనిత. రాళ్ల దాడిలో 20 మందికి పైగా పోలీసులకు గాయాలయ్యాయని, బస్సులు తగలబెట్టారని, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను కూడా తగలబెట్టారని అన్నారు. పోలీసులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయని, ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను అదేశిస్తున్నట్టు చెప్పారు హోం మంత్రి.

చంద్రబాబు, పవన్ మీడియా ముందుకు రావాలి..
ప్రజల విజ్ఞప్తి మేరకే కోనసీమకు డాక్టర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు పెట్టారని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పారు. కొన్ని సంఘవిద్రోహ శక్తులు కోనసీమలో అశాంతిని రేకేత్తించాయని, ఈ ఘటనలు చూసి సిగ్గుపడుతున్నానని చెప్పారు. చంద్రబాబు కూడా అంబేద్కర్‌ జిల్లా పేరుకి అంగీకరించారని అయితే ఇప్పుడు వారే రాద్ధాంతం చేస్తున్నారని, ఆందోళనల వెనక వారే ఉన్నారని అన్నారు. వెనక ఉండి సామాన్య ప్రజల్ని రెచ్చగొట్టడం మానుకోవాలని.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మీడియా ముందుకు రావాలన్నారు. బయట ఒక మాట లోపల ఒక మాట చెప్పకూడదని, పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దని అన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్.

విపక్షాల కుట్రలివి..
తన ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరం అని అన్నారు మంత్రి విశ్వరూప్. జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని టీడీపీ, బీజేపీ, జనసేన కూడా డిమాండ్‌ చేశాయని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన తమ కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని చెప్పారు. అందరూ సంయమనం పాటించాలన్నారు మంత్రి విశ్వరూప్.

రెచ్చగొట్టడం తప్పు..
అమలాపురం ఉద్రిక్తతలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రెచ్చగొట్టడం ఎవరూ చేసినా తప్పేనని అన్నారాయన. జిల్లా పేరు మార్పుతో తమ పార్టీకి వచ్చే ప్రయోజనం ఏమీ లేదని, ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసింది కాదని చెప్పారు. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామని, అంబేద్కర్ పేరు పెట్టడంపై అన్ని వర్గాల ఆమోదం ఉందని చెప్పారు. ఇది పరిష్కరించలేని సమస్య కాదని అన్నారు సజ్జల.

ALSO READ: రణరంగంగా మారిన అమలాపురం… మంత్రి ఇంటికి నిప్పు

First Published:  24 May 2022 10:10 AM GMT
Next Story