Telugu Global
NEWS

కాంగ్రెస్ లో ముదురుతున్న వర్గ రాజకీయాలు " అద్దంకి పై దాడి

కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉందా , లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆ పార్టీలో వర్గపోరు మాత్రం ప్రతి రోజూ నడుస్తూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శ‌లు, తిట్లు, శాపనార్థాల స్థాయి నుండి ఒకరిపై ఒకరు దాడులకు తెగబడటం వరకు సాగుతుంది. దాన్నే ముద్దుగా కాంగ్రెస్ వారు ప్రజాస్వామ్యమని పొంగిపోతూ ఉంటే వీళ్ళ సంస్కృతి ఇంతే అని ప్రజలు కూడా అలవటు పడిపోయారు. తామే రాష్ట్ర‍ం ఇచ్చామని ఆ పార్టీ వారు చేసుకుంటున్న‌ ప్రచారం […]

Addanki Dayakar
X

కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉందా , లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆ పార్టీలో వర్గపోరు మాత్రం ప్రతి రోజూ నడుస్తూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శ‌లు, తిట్లు, శాపనార్థాల స్థాయి నుండి ఒకరిపై ఒకరు దాడులకు తెగబడటం వరకు సాగుతుంది. దాన్నే ముద్దుగా కాంగ్రెస్ వారు ప్రజాస్వామ్యమని పొంగిపోతూ ఉంటే వీళ్ళ సంస్కృతి ఇంతే అని ప్రజలు కూడా అలవటు పడిపోయారు.

తామే రాష్ట్ర‍ం ఇచ్చామని ఆ పార్టీ వారు చేసుకుంటున్న‌ ప్రచారం కానీ, ఈ రాష్ట్రానికి తామెంతో చేశామనే ఉపన్యాసాలు గానీ తెలంగాణలో ఎటువంటి ఫలితాలు చూపలేకపోతున్నాయి. అధికార టీఆరెస్ తో పోటీ పడటానికి ఆపసోపాలు పడుతోంది ఆ పార్టీ. ఈ మధ్యే రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించింది. రైతుల కోసం అంటూ వరంగల్ డిక్ల‌రేషన్ ప్రకటించింది. మరో వైపు నాయకులందరూ కలిసికట్టుగా ఉండాలని వివాదాలుంటే పార్టీ వేదికల మీద మాత్రమే మాట్లాడాలని రాష్ట్ర నాయకులందరికీ రాహుల్ గాంధీ తలంటు పోశారు.

అయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊహించిన కదలిక రాకపోకపోగా నేతల మధ్య కజ్జాలు పెరిగిపోయాయి. ఒకవైపు పీసీసీ అధ్యక్షుడిపైనే తిరుగుబాట్లు సాగుతుండగా ఇప్పుడిక ఓ నాయకుడిపై భౌతికదాడులు చేసేదాకా వెళ్ళింది పరిస్థితి.

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆ పార్టీలో చేరి తుంగతుర్తి ఎమ్మెల్యే టికట్ సాధించిన రోజు నుండీ ఆయనకూ రాంరెడ్డి దామోదర్ రెడ్డి కి పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత ఎన్నికల్లో దయాకర్ ను ఓడించేందుకు దామోదర్ రెడ్డి టీఆరెస్ వాళ్ళకన్నా ఎక్కువ కృషి చేశాడని ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. తన మనుషులకు కాకుండా తన‌కు టిక్కట్ రావడాన్ని సహించలేని దామోదర్ రెడ్డి మొదటి రోజునుండే తుంగతుర్తిలో తనకు వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషిస్తున్నాడని దయాకర్ ఆరోపిస్తున్నాడు. ఈ మధ్య దయాకర్ ఏకంగా దామోదర్ రెడ్డిపై ఏఐసీసీకే పిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ పై ఆదివారంనాడు తుంగతుర్తిలో దాడి జరిగింది. ఓ పెళ్ళికి హాజరయ్యేందుకు తుంగతుర్తికి వెళ్ళిన దయాకర్ పై రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆయన చొక్కా చించేశారు. ఈ లోపు పోలీసులు కలగజేసుకొని దయాకర్ ను కాపాడారు.

ఇప్పటికే రెండు పర్యాయాలు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తుందనే నమ్మకాలు ఆ పార్టీ కార్యకర్తలకే లేవు. ఇలాంటి పరిస్థితుల్లో తమలో తాము కొట్లాడుకొని పార్టీకి ఉన్న పరువును బజారుకీడుస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చెల్లా చెదురైన కా‍ంగ్రెస్ కార్యకర్తలు నాయకుల కొట్లాటలతో మరింత దూరమయ్యే ప్రమాదముందని ఆ పార్టీ అభిమానులు మొత్తుకుంటున్నా వినాలన్న కోరిక కాంగ్రెస్ నాయకుల్లో మాత్రం కనిపించడం లేదు.

First Published:  23 May 2022 12:05 AM GMT
Next Story