Telugu Global
National

ఇండియాలోకి ఒమిక్రాన్ బీఏ.4, బీఏ.5 వేరియంట్లు.. తెలంగాణ, తమిళనాడులో గుర్తింపు.. అప్రమత్తత అవసరం

దేశంలో కోవిడ్-19 తీవ్రత తగ్గినా దాని వేరియంట్లు మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడులో బయటపడినట్లు ఇన్సాకాగ్ వెల్లడించింది. తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతిలో బీఏ.4 సబ్‌వేరియంట్‌ను గుర్తించామని, అలాగే సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక వ్యక్తిలో కూడా ఈ […]

BA-4-BA-5-India
X

దేశంలో కోవిడ్-19 తీవ్రత తగ్గినా దాని వేరియంట్లు మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 లను గుర్తించినట్లు ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడులో బయటపడినట్లు ఇన్సాకాగ్ వెల్లడించింది.

తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతిలో బీఏ.4 సబ్‌వేరియంట్‌ను గుర్తించామని, అలాగే సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక వ్యక్తిలో కూడా ఈ రకమైన వేరియంట్ ఉన్నట్లు శాంపిల్స్‌లో తెలిసిందని చెప్పింది. అయితే హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ వ్యక్తికి నిర్వహించిన పరీక్షల్లో బీఏ.4 వేరియంట్ వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు తెలంగాణకు చెందిన 80 ఏళ్ల వృద్దుడిలో బీఏ.5 వేరియంట్‌ను అధికారులు కనుగొన్నారు. అయితే ఆ వృద్దుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని.. వ్యాక్సినేషన్ కూడా పూర్తయ్యిందని అధికారులు చెప్తున్నారు. అయితే అతడి కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టినట్లు తెలిపారు.

కాగా, ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు అత్యంత వేగంగా వ్యాపిస్తున్నా వీటితో పెద్ద ప్రమాదం ఉండదని నిపుణులు అంటున్నారు. ఈ సబ్ వేరియంట్ల కారణంగా దేశంలో కొన్ని రోజుల పాటు కోవిడ్ కేసులు పెరుగుతాయని, అయితే బాధితులు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందాల్సినంత తీవ్రత ఉండదని అంటున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ దాదాపు పూర్తయినందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కాకపోతే అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇండియాపై ట్రావెల్ బ్యాన్..

ఇండియాతో సహా పదహారు దేశాలపై సౌదీ అరేబియా ట్రావెల్ బ్యాన్ విధించింది. ఆయా దేశాల్లో కోవిడ్ సబ్ వేరియంట్ల తీవ్రత పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికాకు చెందిన 16 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఈ నిషేధం ఉంటుంది. ఈ లిస్టులో ఇండియా, బెలారస్, సిరియా, టర్కీ, ఇరాన్, అఫ్గానిస్తాన్, యెమెన్, సోమాలియా, కాంగో, లిబియా, అర్మేనియా, బెలారస్, వెనుజులా దేశాలు ఉన్నాయి. కాగా, ఈ నిషేధం ఎంత కాలం ఉంటుందో మాత్రం సౌదీ అధికారులు స్పష్టం చేయలేదు.

First Published:  22 May 2022 11:06 PM GMT
Next Story